
సిటీబ్యూరో, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : ఉస్మానియా, జేఎన్టీయూ వంటి అన్ని యూనివర్సిటీల్లో బీటెక్, డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ తరగతులు ప్రారంభంకావడంతో ర్యాగింగ్ నియంత్రణపై అధికారులు దృష్టి సారించారు. ర్యాగింగ్ వల్ల ఎవరూ మానసికంగా కుంగిపోకుండా.. సీనియర్ల బారి నుంచి కొత్తగా అడ్మిషన్లు తీసుకున్న ఫ్రెషర్స్ను ర్యాగింగ్ భూతం నుంచి కాపాడడానికి యూనివర్సిటీలు అనేక రకాల చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా యూనివర్సిటీల్లో కొత్తగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. తరగతులు, కాలేజీల వారీగా ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. వాటిలో వైస్చాన్స్లర్, రిజిస్ట్రార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇలా.. హాస్టల్ నిర్వహణ అధికారులతో కలిపి వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. ర్యాగింగ్కు పాల్పడిన వారి నుంచి వెంటనే రక్షించడం కోసం వాట్సాప్ గ్రూపులో ర్యాగింగ్ చేస్తున్న వారి వివరాలు, ప్లేస్ వంటివి షేర్ చేయాలి. దీనికి సంబంధిత అధికారులు వెంటనే స్పందించడంతో పాటు ర్యాగింగ్కు పాల్పడే వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.
ర్యాగింగ్ నియంత్రణలో భాగంగా యూనివర్సిటీల్లో టోల్ఫ్రీ నంబర్లు, హెల్ప్లైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులందరికీ అధికారుల మొబైల్ నంబర్లు ఇవ్వనున్నారు. ర్యాగింగ్ నియంత్రణకు విద్యార్థులు ఎప్పుడు ఫోన్ చేసిన స్పందించడానికి సిద్ధంగా అధికారులు ఉన్నారు. యూనివర్సిటీ క్యాంపస్లలో చదువుకునే వారితో పాటు ప్రైవేట్ అఫిలియేటెడ్ కాలేజీల్లోనూ ర్యాగింగ్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఆయా కాలేజీ యాజమాన్యాలకు యూనివర్సిటీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం ప్రతి కాలేజీ క్యాంపస్లో యాంటీ ర్యాగింగ్ బోర్డులు, స్లోగన్లు ఏర్పాటు చేస్తున్నారు. ర్యాగింగ్ అంశాలపై అంటే. ర్యాగింగ్ చేయడం వల్ల ఎలాంటి నష్టాలు వాటిల్లుతాయి..? వాటివల్ల జూనియర్ విద్యార్థులు ఎన్ని రకాల మానసిక ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి..? ముఖ్యంగా బాలికలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి..? సీనియర్లు, జూనియర్లు కలిసి మెలిసి ఏ విధంగా ఉండాలి..? దానివల్ల కలిగే లాభాలు.. వంటి అన్ని కోణాల్లో ఆలోచన చేసే విధంగా సెమినార్లు నిర్వహించనున్నారు. ఇంత చేసినప్పటికీ కూడా సీనియర్ విద్యార్థులకు ర్యాగింగ్కు పాల్పడితే ర్యాగింగ్ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడానికి ఆయా కాలేజీలు సిద్ధంగా ఉన్నాయని, ఈ విషయంలో యూనివర్సిటీలు, ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉన్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు. అన్ని యూనివర్సిటీల్లో కూడా ర్యాగింగ్ లేకుండా, అందరూ స్నేహపూర్వక వాతావరణంలో కాలేజీ చదువులు కొనసాగడానికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఓయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ విద్యార్థులు భరోసా ఇచ్చారు. కేవలం కాలేజీ ఆవరణలోనే కాకుండా హాస్టళ్లలో కూడా ర్యాగింగ్ చేయవద్దని సీనియర్ విద్యార్థులకు వీసీ ఆదేశిస్తున్నారు.