హైదరాబాద్ : తెలంగాణకు బీజేపీ చేసిందేమిటో చెప్పాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణీ దేవికి తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ మద్దతు తెలిపింది. కార్పోరేషన్ ఛైర్మన్ నాగేందర్ గౌడ్ ఆధ్యర్యంలో ఈడబ్ల్యూఐడీసీ, సర్వశిక్షా అభియాన్ సిబ్బంది బుధవారం మంత్రి హరీశ్రావును కలిసి ఈ మేరకు మద్దతను తెలిపారు. అదేవిధంగా తెలంగాణ ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యుల సంఘం, తెలంగాణ హ్యూమన్ రైట్స్ కం మీడియా ఆర్గనేజేషన్, హైకోర్టు న్యాయవాదుల సంఘం నేతలు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడారు.
బీజేపీ తెలంగాణకు ఏం చేసిందో పట్టభద్రులు గమనించాలన్నారు. గత బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి కోతలు-ప్రజలకు వాతలు మిగిలాయన్నారు. ప్రజలు కట్టే పన్నుల్లో 42 శాతం రాష్ట్రాలకు ఇవ్వాలి. తెలంగాణకు 2.43 శాతం రావాలి. దాన్ని 2.13 కి తగ్గించారు. రూ.14 వేల 150 కోట్లు బడ్జెట్లో కోత పెట్టారు. 13వ ఫైనాన్స్ కింద హక్కుగా ఇవ్వాల్సిన రూ. 1140 కోట్లు, 14వ ఫైనాన్స్ కింద రావాల్సిన రూ. 817 కోట్లు, 15వ ఆర్థిక సంఘం కింద రావాల్సిన దాంట్లో రూ. 15 వేల కోట్ల కోత నిజం కాదా అని ప్రశ్నించారు. బీఆర్జీఎఫ్ కింద రూ. 950 కోట్లు ఇవ్వకుండా ఆపలేదా? అని అడిగారు. మొత్తం మీద కేంద్రం నుంచి రాష్రానికి రావాల్సిన మొత్తంలో రూ.20 వేల కోట్లు రాష్ట్రానికి కోత విధించిందన్నారు. జీడీపీ పెంచుతామంటూ బీజేపీ ప్రభుత్వం గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచిందన్నారు. దేశ వృద్ధి రేటు ప్లస్ 8 శాతం నుంచి మైనస్ 8 శాతానికి పడిపోయిందని.. దేశ స్థూల ఆదాయం తగ్గిపోయిందని తెలిపారు.
మొన్నటి బడ్జెట్లో కేంద్రం ఎరువుల రాయితీని లక్ష కోట్లు తగ్గించింది. దీంతో ఎరువుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే దేశంలో బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, రైల్వేస్, విమానయాన సంస్థలను కేంద్రం ప్రైవేటుపరం చేస్తోంది. పక్క రాష్ట్రంలో ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేస్తోంది. రేపు మన తెలంగాణలోని బీడీఎల్ లాంటి సంస్థలను ప్రైవేటుపరం చేయనున్నట్లు తెలిపారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను బీజేపీ ప్రభుత్వం ఊడగొడుతుందన్నారు.
దివంగత ప్రధాని పీవీ నరసింహారావును గౌరవించాలన్న భావంతో ఆయన కుమార్తె వాణీ దేవికి సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారన్నారు. ఏడేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉందో.. ఇప్పుడు రాష్ట్రం ఎలా ఉందో ఆలోచించాలన్నారు. తాగు నీరు, విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ ఇలా ఏ రంగం తీసుకున్నా తెలంగాణ దేశానికి రోల్ మోడల్గా నిలిచిందన్నారు. బీజేపీ దుష్ప్రచారానికి లోను కాకుండా వాణి దేవికి తొలి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరారు. ఈడబ్ల్యూఐడీసీ సిబ్బంది జీతాలు ఇబ్బంది లేకుండా నెల నెలా వచ్చేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఈడబ్ల్యూఐడీసీ, సర్వ శిక్షాభియాన్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అంజనీకుమార్, ప్రధాన కార్యదర్శి జి.వెంకట నర్సయ్య, తాండూరు టీఆర్ఎస్ మైనార్టీ నేత అబ్దుల్ వాహెద్, రంగారెడ్డి జిల్లా మైనార్టీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ యాసిన్, బీసీ సంఘం ఉపాధ్యక్షుడు ప్రశాంత్ గౌడ్ పాల్గొన్నారు.