హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా జాబ్ మేళాలను నిర్వహించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న ప్రణాళిక ఏమిటో వెల్లడించాలని బీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి ఏమైనా ప్రణాళిక రూపొందించారా? అని సోమవారం లోక్సభలో లిఖితపూర్వకంగా ప్రశ్నించారు. నిరుద్యోగులకు జాబ్ మేళాలు ఏ మేరకు ఉపయోగపడుతున్నాయని నిలదీశారు. ఉత్తరప్రదేశ్ సహా అన్ని రాష్ర్టాల్లో జాబ్ మేళాల నిర్వహణకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని జిల్లాలవారీగా తెలియజేయాలని, ఏ శాఖ ద్వారా ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చెప్పాలని కోరారు. గత ఐదేండ్లలో నిర్వహించిన జాబ్ మేళాల వివరాలు తెలియజేయాలన్నారు. వర్చువల్ పద్ధతిలో జాబ్ మేళాల నిర్వహణకు గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల విషయంలో ఎదురవుతున్న సమస్యల పరిషారానికి కేంద్రం చేపడుతున్న చర్యలేమిటో చెప్పాలని నామా విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి రామేశ్వర్ స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించడంతోపాటు వివిధ శాఖల ద్వారా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్టు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. నిరుద్యోగులకు కెరీర్ కౌన్సెలింగ్, వొకేషనల్ గైడెన్స్, సిల్ డెవలప్మెంట్ సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. దేశంలో కొత్తగా 370 మాడల్ కెరీర్ సెంటర్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిందని చెప్పారు.