‘నోరు అదుపులో పెట్టుకోండి. మీ జాతకాలు మొత్తం నా దగ్గర ఉన్నాయ్. హద్దు మీరారో.. ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు’ ఎవరో గల్లీ నేత ఈ హెచ్చరిక చేశాడని అనుకొంటున్నారా? అదేంకాదు. 2017లో హరిద్వార్లో జరిగిన ఎన్నికల సభలో ప్రధాని మోదీ ప్రతిపక్ష కాంగ్రెస్ను బెదిరించిన తీరిది. కేంద్రప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఎండగట్టే విపక్ష నేతలను కేంద్ర దర్యాప్తు సంస్థల సాయంతో వేధింపులకు గురిచేయడం అధికార బీజేపీకి నిత్యకృత్యమైంది. అయితే, దొంగే.. ‘దొంగ.. దొంగ’ అని అరిచిన చందంగా తెలంగాణ సర్కారు తనకు ధమ్కీ ఇస్తున్నదని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ గగ్గోలు పెడుతుండటం విచిత్రం.
మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్కు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేశాడన్న కారణంతో నాగ్పూర్ న్యాయవాది సతీశ్ యుకే నివాసంలో గురువారం ఈడీ సోదాలు నిర్వహించింది. అనంతరం అరెస్ట్ చేసింది. ఇటీవల అసెంబ్లీలో తన ప్రసంగానికి ఆటంకం కలిగించారన్న కారణంతో నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ నేత సువేందు అధికారి ఐటీ రైడ్స్ చేయిస్తానని బెదిరించారు. కాల్చేస్తానని కూడా హెచ్చరించారు. ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాలో అబద్ధాలు ఉన్నాయన్నారని.. ఒక ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా కేజ్రీవాల్ ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడులకు దిగారు. ఇందుకు నేతృత్వం వహించింది స్వయంగా ఆ పార్టీ ఎంపీ తేజస్వి సూర్య. బీజేపీకి ఓట్లేయకపోతే, ఇండ్ల మీదకు బుల్డోజర్లు ఎక్కిస్తామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ యూపీ ఓటర్లను భయపెట్టారు.
అస్మదీయులకు తివాచీ పరిచి, తస్మదీయులపై కేసులు బనాయించి పబ్బం గడుపుకోవడం బీజేపీకి పరిపాటే. అయితే దర్యాప్తు సంస్థల వ్యవహారాల్లో తమ ప్రమేయం ఉండదని బీజేపీ నేతలు చెప్పుకొంటూ వస్తున్నారు. దర్యాప్తు సంస్థలు పారదర్శకంగా పనిచేస్తే.. అధికార పార్టీ నేత ఇండ్లల్లో సోదాలు ఎందుకు జరుగవని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. తాను బీజేపీ ఎంపీని కాబట్టి ఈడీ తనపై దాడి చేయదని మహారాష్ట్ర బీజేపీ నేత సంజయ్ కాకా పాటిల్ అంటే, బీజేపీలో చేరాక.. తాను హాయిగా నిద్రపోగలుగుతున్నానని మరో నేత హర్షవర్థన్ పాటిల్ చెప్పుకొచ్చారు. నటుడు షారుక్ ఖాన్ బీజేపీలో చేరితే.. ఆయన కొడుకు ఆర్యన్ ఖాన్పై నమోదైన మాదకద్రవ్యాల కేసు ఇట్టే వీగిపోతుందని, నౌకలో పిండి దొరికిందని ఎన్సీబీ కేసును మార్చేస్తుందని ఎన్సీపీ నేత చగన్ బుజ్బల్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ వైఖరికి నిదర్శనం.