షార్జా: నాకౌట్ రేసులో నిలువాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్లో విండీస్ విజృంభించింది. సూపర్-12 గ్రూప్-1లో భాగంగా శుక్రవారం జరిగిన ఉత్కంఠ పోరులో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ 3 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. టాపార్డర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. మిడిలార్డర్లో నికోలస్ పూరన్ (22 బంతుల్లో 40; ఒక ఫోర్, 4 సిక్సర్లు) ధాటిగా ఆడి పోరాడే స్కోరు అందిస్తే.. బౌలర్లు సమిష్టిగా రాణించి విండీస్ను విజయతీరాలకు చేర్చారు. మొదట బ్యాటింగ్ చేసిన పోలార్డ్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ పూరన్తో పాటు రోస్టన్ చేజ్ (39) సత్తాచాటగా.. క్రిస్ గేల్ (4), లూయిస్ (6), మెట్మైర్ (9), రస్సెల్ (0), బ్రేవో (1) విఫలమయ్యారు. బంగ్లా బౌలర్లలో షరీఫుల్ ఇస్లామ్, మెహదీ హసన్, ముస్తఫిజుర్ రహమాన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 139 పరుగులకు పరిమితమైంది. లిటన్ దాస్ (44), కెప్టెన్ మహ్ముదుల్లా (31 నాటౌట్) రాణించినా.. సాధారణ లక్ష్యాన్ని ఛేదించడంలో బంగ్లా విఫలమైంది.
వెస్టిండీస్: 20 ఓవర్లలో 142/7 (పూరన్ 40, చేజ్ 39; షరీఫ్ 2/20, మెహదీ 2/27), బంగ్లాదేశ్: 20 ఓవర్లలో 139/5 (లిటన్ 44, మహ్ముదుల్లా 31 నాటౌట్; హోల్డర్ 1/22).