‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2021’లో రూ.5 వేల బహుమతి పొందిన కథ.
అది.. ఓరుగల్లు. పాలకుర్తి గ్రామ పొలిమేర.
ఊరవతల చెరువొడ్డున చాకలి బండల కాడ రజకుల కుటుంబీకులైన నాలుగైదు జంటలు తమ కులవృత్తిలో నిమగ్నులై ఉన్నారు.
చాకలి ఐలమ్మ.. తనవంతు బట్టలు ఉతుకుడు అయిపోయింది.
ఒక్కటొక్కటి పిండుకుంట మైదానంల, బీడువడ్డ పొలాల ఒడ్లమీద యేడ గొడంత జాగుంటె ఆడ బట్టలు ఆరేత్తంది.
ఆయాస పడుకుంట అచ్చిన మొగుడు చిట్యాల
నర్సయ్యను చూసుకుంట..
“నన్ను గీ సాకిరేవు కాడికి వొమ్మని సెప్పి.. ‘గిప్పుడే వత్త.. దొర రమ్మన్నడు’ అనుకుంట, గుడిసె కాన్నుండటే వోతివి. అవ్! గింత సేపాయె!” నిలదీసింది ఐలమ్మ.
నీళ్లు విండిన ఆమె సేతిలోని గొన్నన్ని తడి బట్టల్ని తీసుకుని తను ఆరేసుడు షురూ జేసిండు నర్సయ్య.
“పక్కూరుకు దొర వంపిండు గాదె!”.
“అయితమాయె తియ్ గని.. ఇగో ముత్తెమన్ని బట్టలున్నయ్! గివి ఆరేసి రా. గింతెసరు వెట్టాలె. నేనింటికి బోత” అన్నది.
“ఆగాగు! దొర్సానవ్వ నిన్ను తోల్క రమ్మన్నది. గడీకి వోవాలె. పనుందట” అన్నడు నర్సయ్య.
“నీకు దొర, గడి.. గివ్విదప్ప మల్లోటి దెల్వదా? మీ తాతల కాన్నుంచి దొరలకు వూడిగం సేయనే వడితిరి. మల్ల నన్ను గూడ గీ రొంపిలోకి దింపితిరి”.
ఆరేసిన బట్టల మీద వాలుతున్న పక్షులను ‘ఉష్.. ఉష్..’ అని ఎల్లగొట్టుకుంట..
“ఏం జేసుడు మల్ల? మనకు దిక్కేది?” అన్నడు విచారంగ మొకం బెట్టి.
రైక దప్పిన చీరను సరిజేసుకుంట..
“వొకటి జెప్త. యేవనుకోకయ్య!” అన్నదామె.
“ఏందో సెప్పరాదె!”.
“గా దొర్సానవ్వ తనను, తన బిడ్డను గూడా ‘దొరా!’ అని పిల్వమంటంది”.
గా మాటలకు పడీ పడీ నవ్విండు.
“దొర్సానవ్వను ఆమె ముందట నేను ‘దొరా!’ అంటలేనానే!”.
“నాకు మంచిగనిపిత్తలేదు.
నేను విల్వ!”.
“ఊరంతా అననే వట్టిరి. దానికి నామోషీ ఎందుకు? అంటె మన సొమ్మేంబాయె!”.
“ఆడోళ్లను గూడ ‘దొరా’ అనుడేంది? ఇసిత్రం గాక పోతె!”.
“గట్ల పిల్వని ఎందరో ఆడోళ్లను దగ్గరుండి దొరతోని బలాత్కారం జేయించింది. గయన్ని మనకెందుకే?”.
“మనకెందుకంటే ఎట్లయ్యా? మనమీద వొకల్ల పెత్తనం ఏందయ్యా? మన గురించి మనం పట్టించుకోకపోతే ఎట్లయ్యా?!”.
“కిష్టాపురం పిల్లవు. నన్ను లగ్గం జేసుకొని గీ పాలకుర్తి ఊరికత్తివి. అన్నిటిని మతికి ఎక్కించుకోకు! గీ ఊర్లె అందరెట్లుంటె గట్లనే మెదల్రాదె!”.
“మనం మనుషులమే కదా! పశువులం గాదు కదా! గట్లయితే ఆళ్లకాడ పని బందువెడదం!”.
భార్య చివరి మాటకు అదిరిపడ్డడు నర్సయ్య.
చేస్తున్న పనాపి..
“దొరకాడ పని బందువెట్టి గీ ఊల్లె బతికి బట్ట కడుతవా?” అన్నడు భయపడుకుంట.
“బతికి బట్టగట్టుడే గాదు. బందూకు సేతుల వట్టి సూపెడదం..” అన్నదామె కాస్త ఆవేశంగా.
ఎన్నడూ లేంది భార్య ఐలమ్మ నోటివెంట బందూకు ముచ్చట ఇనంగనే.. ముచ్చెమటలు పట్టినయి
నర్సయ్యకు. భార్య తెగింపు చూసి కాసేపు ఏం మాట్లాడాలో తోచక బిర్ర బిగుసుకు పోయిండు.
ఎలాగోలా గొంతు దెచ్చుకొని..
“సెప్తే వినవు! సేసేది సెప్పవు. యేమోనే ఐలవ్వా!” అని మాత్రం అనగలిగిండు.. అరచేతితో నుదురు మీద చరుచుకుంట.
ఇల్లు కాలి బూడిదైనా..ఐలమ్మ కొడుకులు నోరు మెదపలేదు. కానీ, తమ సోదరిపై రజాకార్లు అత్యాచారానికి పాల్పడినప్పుడు ఉడుకునెత్తురుతో ఊగిపోయిండ్రు. పోయి గా పట్వారి ఇంటిని కూల్చేసిండ్రు. అటెన్క గా జాగల మక్కజొన్న పంటేసిండ్రు.
పొద్దు గూకినంక. గుడిసె ముందు ఆకిట్ల.. తాటాకు పందిరి కింద.. నుల్క మంచం మీద కూచున్నడు నర్సయ్య.
ఎదురుంగ కింద కూచున్న ఐలమ్మ దిక్కు చూసుకుంట..
“పొద్దుగాల గడీకి రానందుకు దొరసాని మస్తు కోపంగున్నది” అన్నడు.
భర్త మాటలు పట్టించుకోకుండా..
“మల్లంపల్లికి పోయచ్చిన. గా ఊరి కొండలరావు దొరను భూమి మఖ్త
(కౌలు)కు ఇమ్మంటే.. ఇత్తనన్నడు” అన్నది ఐలమ్మ.
‘మొండిది. మతికచ్చిందంటె ఇడ్సివెట్టది’ అని మనసుల అనుకుంట..
“గియన్ని మనతోని అయితయా?” అన్నడు పైకి.
“పిలగాండ్లు పెరుగుతున్నరు. ఖర్సులు మోపెడు గావట్టె! దొర గడీల ఎట్టిసేసుకుంట.. ఇంకెన్నేండ్లు గిట్ల జానెడు బతుకు
బతుకుడు?”.
“రాతెట్లుంటే గట్లయితది. భగమంతుడు మన నుదిటి రాత గట్లనే రాసి వంపిండేమో గీ భూమ్మీదికి!”..
నర్సయ్య నోటి వెంట వేదాంతం ఉరికచ్చింది.
“మనం గిట్లనే సూసుకుంట గూసుంటే.. ఆళ్లు గట్లనే జేత్తరు. మన బతుకును మనమే సక్కగ జేసుకోవాలె. నాకు ఎర్కయ్యింది గంతే!”.. తన మనసులోని మాటను నిర్భయంగా జెప్పింది ఐలమ్మ.
“గా ఊరికి వోయి కౌలుకు సేసుడా?”.
“గట్లేంగాదు గని.. గా దొరకు మనూర్ల నలభై
ఎకురాలు ఉందట”.
“గదంత మనతోనేడ అయితది?” నిట్టూర్చిండు నర్సయ్య.
“గదయితదా.. గిదయితదా..? అని కూసుంటే ఏదీ గాదు గని. మనతోని అయినకాడికి, కొన్నెకురాలైతే దున్నుకుందం”.
ఇగ చప్పుడు చెయ్యలేదు నర్సయ్య.
పాలకుర్తి పట్వారి శేషగిరిరావు ఇంటి గుమ్మానికి ఎదురుంగ చేతులు కట్టుకుని నిలవడ్డరు ఐలమ్మ, నర్సయ్య.
పాలేరు లోపలికి వోయి ఈళ్లచ్చిండ్రని పట్వారికి చెప్పిండు.
లోపల పనేం లేకపోయినా గీళ్లను బగ్గసేపు గట్లనే నిలవెట్టి.. నింపాదిగ బయటికచ్చిండు పట్వారి.
“దండాలు..!”.. పట్వారి కనవడంగనే రెండు చేతులెత్తి.. వంగి వంగి దండం బెట్టిండు నర్సయ్య.
ఐలమ్మ పట్వారి దిక్కు చూడలేదు.
“రమ్మన్నరట పట్వారి!” అన్నడు నర్సయ్య.
“రేపట్సంది మా పొలాలు కోతలు షురూ జేత్తున్నం. మనుషులు తక్కువ వడ్డరు”.
“గట్లనా!?”.
“మీ ఇంటోళ్లందరు రేపు మా పొలం పనికి రావాలె!” హుకుం జారీ చేసిండు పట్వారి.
నర్సయ్య కంటే ముందే ఐలమ్మ గొంతు విప్పింది..
“మల్లంపల్లి బూసామి బూమి కౌలుకు తీసుకున్నం. గా పొలం కోతలే ఇంక గాలేదు!” అంటూ..
“గవన్ని జెప్తరా ఐలమ్మ! పట్వారి పిలిత్తె రావాలె గని..” చికాగ్గా అన్నడు పట్వారి.
“కానూనుందా యాడనన్నా!”..
“సంగంల జేరినవు గద.. గాయింత మాట్లాడకుంటెట్ల గని”..
“మామీద నీ జులుం ఏంది పట్వారీ?”.
“పనికి రాకపోతే ఏమైతదో ఎర్కేనా?”.. కన్నెర్ర జేసిండు.
“ఆ.. ఏం గాదు!”.. పట్వారికి బిగ్గరగా జవాబిచ్చి..
భర్త చేయి వట్టుకొని.. “రా అయ్యా!” అనుకుంట ఎన్కకు దిరిగింది.
ఎన్కనుంచి పాము బుస ఇనవడలేదు ఐలమ్మకు.
గడీల ఆరుబయట వాలుకుర్చీల గూసున్నడు విస్నూరు దేశ్ముఖ్ రాపాక రామచంద్రారెడ్డి.
ఎదురుంగ చేతులు కట్టుకొని నిలవడ్డడు పట్వారి శేషగిరిరావు.
“గా ఐలమ్మ కుటుంబం మొత్తం ఆంధ్ర మహాసభ సంగంల జేరిండ్రట దొరా!”.. వినయంగ చెప్పిండు.
“ఇనవడ్డది.. ఇనవడ్డది!”.
“గా ఐలమ్మ గూడ బగ్గ ఉషారైతంది దొరా!”.
“ఏం జేత్తంది?”.. కుడి చేత్తో మీసాలు దువ్వుకుంటూ అడిగిండు రామచంద్రారెడ్డి.
“ఊల్లె అందర్ని మాయ మాటల్తోని ఆకట్టుకుంటంది”.
“గీ ఊరికి కోడలుగ అచ్చిన ఐలమ్మ మాయమాటలు గూడ మనోళ్లు ఇంటున్నరా?”.. ఆశ్చర్యపోయిండు రామచంద్రారెడ్డి.
“వాళ్లు ఇనేటట్టు చెప్తున్నది. మనసొంటోల్ల మీదికి ఎర్గనట్టు ఉసిగొల్పుతంది దొరా!”.. బాగా నూరి పోసిండు పట్వారి.
పండ్లు పటపట కొరుక్కుంట..
“గా సంగం అగ్రనాయకులందరి మీద కోర్టుల కేసేయించు పట్వారీ!” అన్నడు రామచంద్రారెడ్డి.
వినయంగ తల ఊపిండు పట్వారి శేషగిరిరావు.
సాలోచనగా తలపంకిస్తూ..
“పనిలో పని.. గా ఐలమ్మను గూడ గా కేసుల ఇరికించు. ఒక పనైపోతది!”.. ఆదేశించిండు
రామచంద్రారెడ్డి.
“గట్లనే దొరా!” తలూపిండు పట్వారి శేషగిరిరావు.. దొర కంటపడకుండా వంకరగా నవ్వుతూ.
ఆంధ్ర మహాసభ సంగం కార్యకలాపాలు చురుగ్గా జరుగుతున్నయి.
సంగపోల్లు ఎప్పుడు సభ జరిపినా ఐలమ్మ గా సభకు పోయేది. తన మాటలతో మహిళలను ఉత్తేజపరిచేది.
“మడిసికి దైర్నం, తెగింపు ఉండాలె! బానిస బతుకులు ఎన్నేండ్లు బతుకుడు? దొరలే మనుషులు గని, మనం మనుషులం గాదా? ఎట్టి సాకిరిని మట్టువెట్టుండ్రి! గొడంత సొంత బూమి కోసం ఆరాట పడుండ్రి. మట్టితోనే మనిషికి బతుకు!” అంటూ జనంలో ఆలోచనలు రేకెత్తించేది. ఆవేశం రగిలించేది. వారిలో పోరాట స్ఫూర్తిని అణువణువునా నింపేది.
గిసువంటి పనులే.. దొరకు మింగుడు పడ్తలేవు.
“కొండా లక్ష్మణ్ బాపూజీ సహకారంతో ఐలమ్మకు అనుకూలంగ తీర్పచ్చింది దొరా!”.. రామచంద్రారెడ్డికి ఉప్పందించిండు పట్వారి శేషగిరిరావు.
దేశ్ముఖ్ రాపాక రామచంద్రారెడ్డి రగిలిపోతున్నడు.. గీ విషయం ఎరుకైనంక.
తను వేయించిన కేసు ఓడిపోవడంతో అతని అహంమీద దెబ్బ కొట్టినట్టు అయ్యింది.
దొర ఏం మాట్లాడక పోయేసరికి..
“గిది రెండో మల్క దొరా! మనం కేసు ఓడిపోవుడు”.. గుర్తుచేసి అగ్నికి ఆజ్యం పోసిండు పట్వారి.
“మనూరికచ్చిన ఒక ఆడ మనిషి నన్ను, నా గడీని సవాల్ జేసుడేంది?”.
“గిప్పుడు సవాల్ చేస్తున్నది ఐలమ్మ ఒక్కతే కాదు దొరా! ఆమె ఎనుకాల పెద్ద దండే తయారైంది”.
మెలమెల్లగా విసునూరు దేశ్ముఖ్ రామచంద్రారెడ్డికి కాక పుట్టిస్తున్నడు పట్వారి శేషగిరిరావు.
“గీ అలగా జనం ఆమె ఎంట నడుసుడేంది?”.
“కాలెత్తి నలిపేసే దాకా చీమలదండు కదుల్తనే ఉంటది దొరా!”.
భగభగ మండిపోయిండు రామచంద్రారెడ్డి.
మనిషి శివాలెత్తి పోతూ..
“చేతులు కట్టుకుని ఊకునేది లేదు”.. అంటూ ఆవేశంతో రగిలి పోయిండు.
పట్వారికి గూడ కావల్సిందదే!
“ఐలమ్మను మెసలకుంట జేయాలె.. సర్వ నాశనం జేయాలె!”.
ఒక సరికొత్త పథకం పట్వారి మదిలో ఊపిరి పోసుకుంటుండగా.. దొరకు వంగి వంగి నక్క వినయంతో దండాలు పెడుతూ అక్కడినుంచి వెళ్లిపోయిండు.
“గా రాపాక రామచంద్రారెడ్డి మన కుటుంబం మీద పగవట్టినట్టున్నడు!”.. భార్య ఐలమ్మ ముందర వాపోయిండు నర్సయ్య.
“బయమైతందా?” ప్రశ్నించింది ఐలమ్మ.
“గా పెద్దోళ్లతోని పేదోళ్లం మనకెందుకు సెప్పు?”.
“మన ఇసయం మనం కాకపోతే మల్లెవలు పట్టించుకోవాలె.. సెప్పు?”.. భర్త కండ్లలోకి సూటిగా చూస్తూ ప్రశ్నించింది ఐలమ్మ.
“కేసుల మీద కేసులు వెట్టి బెదరగొట్టాల్నని సూత్తున్నడు. గీ కేసులల్ల వోడిపేయిండు. మల్లేం జేత్తడో అని నా బాధ!”.
“ఇంకేం జేత్తడు? తలదీసి గడీకి ఏలాడ దీత్తడా? సూద్దాం! పోరు సంద్రంల దిగినం. మునిగినా.. తేలినా.. జనం కోసమే గద”.
బెదురే లేని ఐలమ్మ ఆత్మ స్థయిర్యానికి.. బదులుగా తలూపిండు నర్సయ్య.
“పట్వారీ! ఆంధ్ర మహాసభ సంగం పట్టు కోల్పోవాల్నంటే అందులోని సభ్యులను దొంగదెబ్బ తీయాలె!”.. ఓ పన్నాగం పన్నిండు దేశ్ముఖ్.
“ఎట్లంటరు?” అమాయకంగ అడిగిండు పట్వారి.
“మనిషి గొడన్ని పైసలు జమైతే ఎగుర్తడు. ముందుగాల ఐలమ్మ కుటుంబాన్ని ఆర్థికంగా పడ గొట్టాలె”.
“మీరెట్లంటె గట్లనే!”.
“ఐలమ్మ కౌలుకు తీసుకున్న గా బూమినైతే ముందుగాల నా పేరుమీద రాయుండ్రి!”.
నసిగిండు పట్వారి.
“నీకందేటియి అందుతయ్ గని. నేను
జెప్పింది చెయ్యి!”.
తలూపిండు పట్వారి.
“గీ మల్క మనూరి పొలాలన్నీ మంచిగనే పండినయ్. బగ్గ దినాలకు రైతు మొకం మీద జరంత నవ్వు మొలిసేటట్లు..!”.. అన్నడు చిట్యాల నర్సయ్య.
“అవును మల్ల. ఏ పొలం కాడ జూసినా వరి కోతలే కోతలు! మొదాలుకు మొదాలు వరి నాట్లేసినోళ్లు కోతలు మొదలు వెట్టిన్రు. కల్లం పనులు గూడ జరుగుతున్నయ్” బదులిచ్చింది ఐలమ్మ.
చిట్యాల ఐలమ్మ, నర్సయ్య దంపతులు కైకిలోళ్లతోని గల్సి తమ పొలం కాడ వడ్లు తూర్పార బడుతున్నరు.
ఎండ సుర్రు మంటంది.
నెత్తిమీంచి కారి.. కింద వడుతున్న గాల్ల సెమట సుక్కలు తాకుతంటె.. వడ్లగింజలు పరవశించిపోతూ జాతరలోని చిన్నపిల్లల లెక్క సంబురంగ కుప్పలోంచి ఎగిరెగిరి వడుతున్నయ్.
గంభీరమైన మొకం, చింత నిప్పుల్లెక్కున్న కండ్లతోని దొర జీతగాళ్లు.. రౌడీ సమూహంతో కలిసి గప్పుడురికచ్చిండ్రు గా కల్లం కాడికి. పొడవాటి కంకకర్రలు చేతుల వట్టుకొని నేలను గొట్టుకుంట.
ఎత్తుగ బలంగ ఉన్న పాలేరు దుబ్బడు ఎడ్మ చేత్తోని మీసాలు మెలేసి..
“ఆరి నర్సిగా! గీ బూమి దొరదట. తన పంట బాపతు అడ్లు తీసుకురమ్మని మమ్మల్ని పంపిండు గాదుర!”.. వడ్ల కుప్ప కాడ నర్సయ్యకు ఎదురుంగ నిలవడి గట్టిగ కేకలేసిండు.
పారతోని వడ్లు కుప్పదిక్కు లాగుతున్న నర్సయ్య పనాపి ఏదో అనబోయిండు.
చేతిలో ఉన్న చాట కింద పడేసింది ఐలమ్మ.
కొంగు నడుం చుట్టు దిప్పి బొడ్లె దోపుకొంది. పక్కనున్న కొడవలి చేత బట్టింది.
చిరుతపులి లెక్క దుబ్బయ్య దగ్గరికి ఉరికచ్చింది.
నుదుటిన దిద్దిన కుంకుమ లెక్క ముకమంత ఎర్రగ జేసుకుని..
“నకరాలు జేత్తున్నరా? బాజాప్త కౌలుకు తీసుకున్నం. కట్టపడ్డం. పంట పండించుకున్నం! పండిన గీ పంట మాది! మద్దెన గా దొరెవ్వలు? పంట గాయినకు ఇచ్చుడేంది?”.. అచ్చం పోశవ్వ తల్లే ఎదురుంగ నిలవడ్డట్టు గర్జిస్తున్న ఐలమ్మను జూసిన దుబ్బయ్య.. ఉన్నపళంగ ఒక్కడుగు ఎన్కకేసిండు.
నీళ్లు నములుకుంట..
“నువ్వేమంటవ్? నర్సయ్య బావా!” అని నర్సయ్య దిక్కు చూసిండు.
భార్య ఐలమ్మ మాటలల్ల వేగుచుక్క లెక్క పొడిచిన ధైర్యాన్ని చూసి అబ్బురపడుతున్న నర్సయ్య నోట్లోంచి ఒక్కమాట రాలేదు.
గాడున్న పనోళ్లందరికీ ఇనవడేటట్టు..
“గీ మాటే ఖరారు గద!” అన్నడు దుబ్బయ్య గట్టిగ.
“ఏంది ఖరారు? ఎవల తాత జాగీరు గాదు!”..
శివమెత్తినట్టు ఐలమ్మ ఎత్తిన కొడవలి దిక్కు చూసుకుంట ఎన్కకు మర్లిండు దుబ్బయ్య.. రౌడీమూక తోని.
ఐలమ్మ కష్టపడి పండించిన పంటపై దేశముఖ్ కన్నుపడి, ఐలమ్మ పంటపై దాడి చేయబోయిండని తెలుసుకున్న ఆంధ్ర మహాసభ కార్యకర్తలు దగ్గరుండి తామే కూలీలై మిగిలిన పంట పనులు చేసిండ్రు.
భీంరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, చకిలం యాదగిరి లాంటి ఆంధ్ర మహాసభ సంఘం ప్రముఖులు స్వయంగా ధాన్యపు బస్తాలను భుజాలపై మోసిండ్రు.
“అవ్వా! పట్వారి మన ఇంటిని తగుల
బెట్టించిండట్నే!”..
చాకిరేవు కాడున్న తల్లికి చెప్పిండు ఐలమ్మ కొడుకు, పొలం కాడినుంచి ఉరికచ్చి.
“మనల్నేమీ సేయలేక గిసువంటి పనికి పూనుకుంటడా?”..
కండ్లెమ్మట నీళ్లచ్చినయి ఐలమ్మకు.
“దొర వంపిన రౌడీలు మనింట్ల నుంచి పైసలు, ధాన్యం ముందుగాల్నే ఎత్తుకు పోయిండ్రట”.
“నన్నిట్ల కట్టాలు వెడితెనన్న సంగం నుంచి బయటికి అత్తననుకున్నరేమో? నేనే నిలువెత్తు ఎర్రజెండను. ఇంక గాల్లేంజేత్తరో సూత్త! నేనే నిలువెత్తు తిరుగుబాటును. జనం కోసం పోరాటం జేత్తున్న నన్ను సంపుతరేమో సూత్త! ఎట్టి సాకిరీ నుంచి జనాన్ని విముక్తి సేసేటందుకు సావుకైనా సిద్ధంగున్న”.. చెయ్యెత్తి పిడికిలి బిగించింది ఐలమ్మ.
ఇల్లు కాలి బూడిదైనా ఐలమ్మ కొడుకులు నోరు మెదపలేదు. కానీ, తమ సోదరిపై రజాకార్లు అత్యాచారానికి పాల్పడినప్పుడు ఉడుకునెత్తురుతో ఊగిపోయిండ్రు. పోయి గా పట్వారి ఇంటిని కూల్చేసిండ్రు. అటెన్క గా జాగల మక్కజొన్న పంటేసిండ్రు.
కాలం ఒక్క తరీఖ ఉండదు.
గీ కారణాలతోని ఐలమ్మ ఇద్దరు కొడుకులను, భర్తను జైలుపాలు చేయించిండ్రు.
అయినా ఐలమ్మను వదల్లేదు పాలకుర్తి దొర రామచంద్రారెడ్డి.
మెల్లమెల్లగ జనంల తన ఉనికికి భంగం కలిగి, దొరతనం ఉట్టికి ఎక్కుతుండటంతో ఐలమ్మను గడీకి పిలిపించిండు.
“గీడ గిప్పుడే నిన్ను సంపుత! ఎవలత్తరో సూత్త!” అని బెదిరించుకుంట కోపంతో రగిలిపోయిండు ఐలమ్మ కంట వడంగనే.
గా మాటలకు బెదిరిపోలేదు ఐలమ్మ.
“నన్ను సంపితే నా కొడుకులు ఊరుకుంటరా?
సంగపోల్లు నిన్నిడిసి పెడ్తరా? గీ జనం నిన్ను
బతకనిత్తరా?”..
గడీ దద్దరిల్లేటట్టు పులిబిడ్డ లెక్క అరిచింది ఐలమ్మ.
ఆమె ధైర్యానికి రామచంద్రారెడ్డి నిరుత్తరుడు అయ్యిండు.
“నన్నాపినంత మాత్రాన గీ పోరు ఆగది. ఎట్టి నుంచి విముక్తి కోసం జనానికి పోరాటం జేసుడు నేర్పిన! ఎట్టి సాకిరిపై తూటా గురి వెట్టుడెట్లనో బందూకు తర్ఫీదిచ్చిన! ఎప్పటికైనా గీ నిజాం పాలన మట్టి కొట్టుకుపోవుడే! దొరతనం గీ గడీ గోడలల్ల పాతరవుడే!”..
గడీల ప్రతిధ్వనించిన ఐలమ్మ మాటలకు దొరకు గుండెల దడ వుట్టింది.
ఐలమ్మ సవాల్ విసిరి.. ధీర వనిత లెక్క పౌరుషంగ గడి దాటుతుంటె.. రామచంద్రారెడ్డి ఏం చేయలేక నిస్సత్తువగా చతికిలపడి పోయిండు.
కణకణ మండే నిప్పురవ్వ లెక్క ఎగిసిపడుతూ.. జలజల పారే నీటి లెక్కపరుగులు వెడుతూ..
ధీరవనిత చిట్యాల ఐలమ్మ గడీ కంచుకోట దాటుతూ.. వడివడిగా కదిలిపోతున్నది.
తూర్పున పొడిచే పొద్దు సాయంత్రానికి పడమటిన అస్తమిస్తుంది.
అది ప్రకృతి ధర్మం!
తరతరాలకు సరిపడా పోరాట స్ఫూర్తిని ప్రజల గుండెల్లో నింపి.. వార్ధక్య దశలో అనారోగ్య కారణాలతో ఐలమ్మ భౌతికంగా అంతర్ధానమైనా..
ఆమె అమరురాలు! అజేయురాలు!!
మరణానంతరం మార్గదర్శకురాలిగా పాలకుర్తిలో ఆమె స్మారకస్తూపం, స్మారక భవనం నిర్మితమయ్యాయి.
ఆమె చూపిన ఉద్యమబాట నిత్య చైతన్య విప్లవ గీతికై.. తాడిత పీడిత జనం గుండెల్లో పల్లవిస్తుంటుంది.
ఇప్పటికీ.. ఎప్పటికీ..
కిష్టాపురంలో ఓరుగంటి వారింట ఆడబిడ్డగా పుట్టిన ఐలమ్మ.. పాలకుర్తిలో చిట్యాల వారింట కోడలిగా అడుగుపెట్టి.. తెగింపుతో వెట్టిచాకిరీకి ముగింపు పలికించి.. తన విలక్షణ జీవన ప్రస్థానాన్ని చరిత్రలో ఒక ప్రత్యేక పుటగా చిరస్మరణీయం చేసుకున్నది.
ఎనుగంటి వేణుగోపాల్
ఎనుగంటి వేణుగోపాల్ స్వస్థలం జగిత్యాల. ఎంఏ (తెలుగు), ఎంఏ(సోషియాలజీ) చేశారు. ప్రస్తుతం సారంగాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఇప్పటివరకూ 172 పైగా కథలు, నాలుగు నవలలు రాశారు. ఆధ్యాత్మికత, వ్యక్తిత్వ వికాసం, సినిమాలు, సాహిత్యానికి సంబంధించి పలు వ్యాసాలు వెలువరించారు. అమ్మా నాన్న (పేరెంట్స్ కథలు), గోపాలం (హాస్య కథల సంపుటి), నవరసభరితం (నవరసాలపై కథలు), నాలుగు పుటలు (నాలుగు పార్శ్వాల కథలు), బుజ్జిగాడి బెంగ (పిల్లల సాంఘిక కథలు), నాలుగు మెతుకులు పుస్తకాలు పాఠకాదరణ పొందాయి. అమ్మ నాన్న పిల్లలు (పిల్లలపై వ్యాసాలు), విజయానికి అన్నీ మెట్లే (వ్యక్తిత్వ వికాస వ్యాసాలు) శీర్షికలతో వ్యాస సంపుటాలను ప్రచురించారు. ఈయన రచనలను వివిధ సంస్థలు 13 పుస్తకాలగా ప్రచురించాయి.
ఎనుగంటి వేణుగోపాల్
94402 36055