హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): జర్నలిస్టుల కోసం మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించే శిక్షణ తరగతుల్లో ఇకపై ‘వాతావరణ మార్పులు’ అంశాన్ని కూడా చేర్చుతామని మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బషీర్బాగ్లోని సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంలో నిర్వహించిన ‘వాతావరణ మార్పులు- జర్నలిస్టులకు శిక్షణ’ వర్క్షాప్ శుక్రవారం ముగిసింది. యూఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్, వ్యూస్ ఇండియా ఆధ్వర్యంలో టీయూడబ్ల్యూజే సహకారంతో జరిగిన ఈ కార్యక్రమానికి శ్రీనివాస్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే రుతువుల క్రమం మారిపోయిందని, ఇలాంటి వాతావరణ మార్పుల ప్రభావాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆయన సూచించారు. ఇందులో జర్నలిస్టులే ముఖ్య పాత్ర పోషించాలని, ఈ వర్ షాప్లో శిక్షణ పొందిన పాత్రికేయులు ఈ అంశాలను క్షేత్ర స్థాయికి తీసుకెళ్లాలని కోరారు. యూఎస్ కాన్సులేట్ జనరల్ సీపీఆర్వో అలెగ్జాండర్ మెక్ లార్సన్ మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలపై ప్రజలను ఎప్పటికప్పడు అప్రమత్తం చేసేందుకు పాత్రికేయులు తమ వంతు కృషి చేయాలని కోరారు. అనంతరం ప్రింట్, టీవీ, డిజిటల్ మీడియా విభాగాల్లో పర్యావరణ మార్పులపై కథనాలు రాసిన పాత్రికేయులకు ‘ఉత్తమ ైక్లెమేట్ జర్నలిస్ట్’ అవార్డులను అందజేసింది. ప్రింట్ విభాగంలో నమస్తే తెలంగాణ స్టేట్ బ్యూరో డిప్యూటీ చీఫ్ రిపోర్టర్ కాసాని మహేందర్ రెడ్డి ఈ అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యూస్ ఈడీ భీమారావు, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, సీనియర్ పాత్రికేయులు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.