గంగాధర: నారాయణపూర్ రిజర్వాయర్ పరిధిలోని గ్రామాల ప్రజలు అభద్రతకు గురికావొద్దని, వారికి అండగా ఉంటామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని నారాయణపూర్ రిజర్వాయర్ను పరిశీలించి, రిజర్వాయర్ కట్ట ఎత్తును పెంచి ఆధునీకరించేందుకు కృషి చేస్తానన్నారు. మధురానగర్ వద్ద నారాయణపూర్ రిజర్వాయర్ కుడి కాలువను పరిశీలించారు.
సోమవారం నుంచి పనులను ప్రారంభిస్తామని అధికారులు ఎమ్మెల్యేకు తెలుపగా పనులు త్వరగా జరిగేలా చూడాలని సూచించారు. రిజర్వాయర్ పరిధిలోని నారాయణపూర్, చెర్లపల్లి(ఎన్), మంగపేట కింద ముంపునకు గురవుతున్న నిర్వాసితులకు పరిహారం అందేలా చూస్తానని హామీఇచ్చారు. కుడికాలువపై మధురానగర్ వద్ద జగిత్యాల రోడ్డులో బాక్స్టైప్ కల్వర్టు, వేములవాడ రోడ్డులో బ్రిడ్జి నిర్మిస్తామన్నారు.
మల్యాల మండలం పోతారం ఎడమ కాలువ నిర్మాణ పనులను కాంట్రాక్టర్ మధ్యలోనే వదిలేసి వెళ్లడంతో నూతనంగా టెండర్లు పిలిచి తిరిగి పనులను ప్రారంభించాలని అధికారులకు ఆయన సూచించారు. అనంతరం గంగాధర మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇరిగేషన్ శాఖ సీఈ సుధాకర్రెడ్డి, ఎస్ఈ అశోక్, ఈఈలు శ్రీనివాస్గుప్తా, సంత్ప్రకాశ్, డీఈ అలీమ్, గంగాధర సింగిల్ విండో అధ్యక్షుడు దూలం బాలగౌడ్, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ పుల్కం నర్సయ్య, సర్పంచ్లు నవీన్రావు, మడ్లపెల్లి గంగాధర్, యండీ నజీర్, జోగు లక్ష్మీరాజం, నాయకులు తోట మహిపాల్, మ్యాక వినోద్ ఉన్నారు.