మహబూబ్నగర్ అర్బన్, ఫిబ్రవరి 15 : రాష్ట్రం లో వచ్చే రెండేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన కార్పొరేటర్లు మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లో బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ గెలుపొందిన కార్పొరేటర్లను అభినందించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని తాను రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న సమయంలో ఇదే విషయాన్ని ప్రజలు చెప్తున్నారని గుర్తు చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో మీ డివిజన్లో ఇచ్చిన హామీలను పూర్తి చేసేందుకు తప్పకుండా సహకరిస్తామన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజా సమస్యలపై పాలక పక్షాన్ని నిలదీయాలని సూచించారు. సిరిసిల్ల, సిద్దిపేటకు దీటుగా మహబూబ్నగర్ను మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అభివృద్ధి చేశారు. మిగిలిపోయిన పనులను ప్రభుత్వం వచ్చిన వెంటనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ప్రభుత్వంలో మీ మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మంచి స్థానంలో ఉం టారు. మీ గెలుపు కోసం ఆయన అహర్నిశలు కృషి చేశారు. శ్రీనివాస్గౌడ్కు అండగా నిలబడాలన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో చాలా మంది కార్పొరేటర్లు తక్కువ ఓట్లతో ఓడిపోయారు. ఓడిన అభ్యర్థులకు భవిష్యత్లో మంచి స్థానం కల్పిస్తామని తెలిపారు.