ఆదిలాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు ఆందోళనలు కొనసాగుతాయని.. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎలాంటి నిరసన కార్యక్రమాలకైనా సిద్ధంగా ఉండాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పేర్కొన్నారు. గురువారం ఆదిలాబాద్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను ఓర్వలేని కేంద్రంలోని బీజేపీ సర్కారు రాష్ట్రంపై కక్ష కట్టిందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పండించిన సోయాబిన్, కందులు, శనగలు, జొన్నలను రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నదని.. వడ్లను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎఫ్సీఐ నిబంధనల ప్రకారం కొనుగోలు చేయాల్సి ఉందని తెలిపారు. పంట కొనుగోళ్లకు సంబంధించి రా రైస్, బాయిల్డ్ రైస్ అంటూ మెలికలు పెడుతూ తెలంగాణ రైతులపై వివక్ష ప్రదర్శిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ నగేశ్ మాట్లాడు తూ.. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెడుతు న్న కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నదని తెలిపారు. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రౌతు మనోహర్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, జైనథ్ ఎంపీపీ మారిశెట్టి గోవర్ధన్, టీఆర్ఎస్ నాయకులు యూనిస్ అక్బానీ, లింగారెడ్డి, ప్రమోద్రెడ్డి, నల్లా రాజేశ్వర్, అజయ్, ప్రహ్లాద్ పాల్గొన్నారు.