నిర్మల్ అర్బన్ ఫిబ్రవరి 14 : ప్రభుత్వ పాఠశాలలకు అన్ని హంగులను సమకూరుస్తూ విద్యావ్యవస్థను మరింత పటిష్ట పరిచేందుకు వీలుగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఊరు- మన బడి, మన బస్తీ -మన బడి కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిని ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్లో మన ఊరు- మన బడి కార్యక్రమంపై జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అయిన కెజి టు పిజి కి అనుగుణంగా అడుగులు ముందుకు పడుతున్నాయి.
ఈ మహత్తర కార్యంలో అందరూ భాగస్వాములై అంకితభావంతో పని చేయాలని కోరారు. తొలి విడతగా 3 వ వంతు పాఠశాలలో మన జిల్లాలో 735 పాఠశాలలకు గాను 260 పాఠశాలలలో మన ఊరు-మన బడి కార్యక్రమం అమలు చేస్తామన్నారు.
ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను సమాన నిష్పత్తిలో ఎంపిక చేస్తూ మౌలిక సదుపాయాల కల్పనను మెరుగుపరిచే పనులు, కార్పొరేట్ స్కూళ్లను మరిపించే విధంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.
అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు విద్యాశాఖ, ఇంజినీరింగ్ సమన్వయంతో, ప్రజాప్రతినిధుల సూచనలతో ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు త్వరితగతిన గడువు కాలంలో పూర్తి చేసి వచ్చే విద్యాసంవత్సరానికి అందేలా చూడాలన్నారు.
కార్యక్రమంలో అదనపు జిల్లా పరిషత్ జెడ్పీ చైర్ పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి, కలెక్టర్ హేమంత్ బోర్ఖడే, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, విద్యాశాఖ అధికారి ఏ రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.