హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ప్రజల సంపద, ఆస్తులను కొల్లగొట్టే తెలివి తమకు లేదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుడు రాజగోపాల్రెడ్డిని ఉద్దేశించి చురకలంటించారు. సంపదను పెంచడం.. ప్రజలకు పంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో మాదిరిగా కొంతమందికే పంచే కార్యక్రమం చేయబోమని పేర్కొన్నారు. బొగ్గు గనుల వేలంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ ఇతర రాష్ర్టాలకు విస్తరిస్తుంటే కాంగ్రెస్ నేత చెత్త ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. నైని బొగ్గు బ్లాక్ విలువ మొత్తమే రూ.50 వేల కోట్లు ఉండదని, ఇందులో రూ.50 వేల కోట్ల కుంభకోణం జరిగిందంటూ ఆరోపించారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణి పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. కేంద్రం త్వరలో మరో 14 బొగ్గు బ్లాక్లను వేలం వేసే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. బీజేపీ ప్రభుత్వం ‘బేచో ఇండియా’ కార్యక్రమాన్ని మొదలుపెట్టిందని కాంగ్రెస్ సభ్యుడు దుద్దిళ్ల శ్రీధర్బాబు విమర్శించారు. ఇందులో భాగంగానే సింగరేణి బొగ్గు గనులను వేలానికి పెట్టిందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాల కారణంగా సింగరేణి టర్నోవర్ రూ.15,500 కోట్ల నుంచి రూ.24 వేల కోట్లకు , లాభాలు రూ.400 కోట్ల నుంచి రూ.1,600 కోట్లకు పెరిగాయని టీఆర్ఎస్ సభ్యుడు కోరుకంటి చందర్ చెప్పారు.