హైదరాబాద్, మార్చి 9 (నమస్తేతెలంగాణ): కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనప్పటికీ దేశాన్ని తెలంగాణ సాదుతున్నదని ఆర్థికమంత్రి హరీశ్రావు చెప్పారు. తెలంగాణ అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ లెక్కలే చాటుతున్నాయన్నారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ జరిగింది. ఈ చర్చలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, విప్ బాల్కసుమన్, ఎమ్మెల్యే వివేకానంద పాల్గొన్నారు. అనంతరం మంత్రి హరీశ్ సమాధానమిస్తూ సీఎల్పీ నేత భట్టివిక్రమార రాజకీయ విమర్శలు చేశారు తప్ప , బడ్జెట్ మీద అవగాహనతో సూచనలేవీ ఇవ్వలేదన్నారు. రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 80 వేల ఉద్యోగాల భర్తీకి చరిత్రాత్మక ప్రకటన చేశారని కొనియాడారు. సీఎం ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా యువత ఆనందోత్సవాలు జరుపుకుంటుంటే. కాంగ్రెస్, బీజేపీ నేతలు బేజారెత్తిపోయారని విమర్శించారు.
పిన్న వయస్సు రాష్ట్రమైనప్పటికీ, తెలంగాణ జీఎస్డీపీ, తలసరి ఆదాయం, తలసరి వినియోగంలో దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర సంస్థలు, రిజర్వు బ్యాంకు అధికారికంగా ఇచ్చిన లెకలని తెలిపారు. రాష్ట్ర జీఎస్డీపీ రూ.11.54 లక్షల కోట్లకు చేరిందని చెప్పారు. ప్రజల తలసరి ఆదాయం రూ.2.78 లక్షలకు చేరిందని చెప్పారు. తలసరి విద్యుత్తు వినియోగంలోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉందని హరీశ్రావు వెల్లడించారు. ఇది అకస్మాత్తుగా జరిగింది కాదని, సీఎం కేసీఆర్ కృషి, ఆలోచన, అవినీతిరహితంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం ద్వారా ఇది సాధ్యమైందని చెప్పారు. తలసరి ఆదాయ విషయంలో తెలంగాణ 18.8 శాతం వృద్ధి రేటుతో అగ్రస్థానంలో ఉందన్నారు. తలసరి విద్యుత్తు వినియోగంలోనూ తెలంగాణ నంబర్వన్గా నిలిచిందని చెప్పారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రాథమిక అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి హరీశ్రావు దుయ్యబట్టారు.
కాంగ్రెస్ హయాంలో లంచాలు లేకుండా పనులు జరిగేవి కాదని, కాంగ్రెస్ హయాం పరిపాలన.. కింద భూమి పైన రవి.. నడుమ ఉన్నదంతా పైరవీయే. ఇదీ కాంగ్రెస్ పాలన పద్ధతి అని మంత్రి హరీశ్రావు ఎద్దేవాచేశారు. ఆనాడు అసెంబ్లీ జరుగుతుందంటే లాడ్జీలన్నీ పైరవీకారులతోనే నిండి ఉండేవని గుర్తుచేశారు. ఇప్పుడు అంతా ఆన్లైన్, డిజిటల్ పద్ధతిలోనే పారదర్శకంగా ఉన్నదని చెప్పారు. గాంధీ పేరు చెప్పుకొని ఓట్లు అడుక్కొని 50 ఏండ్లు పరిపాలించారని పేర్కొన్నారు. ఇప్పటికీ అదేవిధంగా బతుకు వెళ్లదీస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు గాంధీభవన్లో ఫొటోలు పెట్టుకొంటారని, గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం మాత్రం సాధించలేకపోయారని తెలిపారు. కాంగ్రెస్ 60 ఏండ్లలో సాధించలేని అభివృద్ధిని తెలంగాణ ప్రభుత్వం ఆరేండ్లలో సాధించిందన్నారు. నిర్మాణాత్మక విమర్శలుచేస్తే స్వీకరిస్తామని, ఇష్టానుసారం అవగాహన లేకుండా విమర్శిస్తే ప్రజలు విశ్వసించరని తెలిపారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ చేసిన సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. మీటర్లు పెడితేనే ప్రోత్సాహకాలు ఇస్తామని కేంద్రం చెబుతోందన్నారు. మీటర్లు పెడితే ఇచ్చే ప్రోత్సాహకాలు వద్దన్నామని తెలిపారు. అప్పులు తీసుకొన్న రాష్ర్టాల జాబితాలో తెలంగాణ చివరినుంచి ఐదో స్థానంలో ఉన్నదని పేర్కొన్నారు. ఇటీవల కేంద్రం అవలంబిస్తున్న విధానాల వల్లే రాష్ర్టాల అప్పులు పెరిగాయని చెప్పారు.
కేంద్రం రాష్ర్టాలకు 29.6 శాతం డెవల్యూషనే ఇస్తున్నదని మంత్రి హరీశ్ తెలిపారు. ‘బీజేపీ వాళ్లు బయట బాగా మాట్లాడుతున్నారు. కార్పొరేషన్ల కోసం ఔటాఫ్ బడ్జెట్ లోన్ తీసుకొంటారు. కార్పొరేషన్లకు 1 శాతం నుంచి 3 శాతం పెంచడానికి మోదీ అనుమతి ఇచ్చారు. ఇది కేంద్రానికి ఎంత మాత్రం సంబంధం లేదు. కానీ ఆరు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మాజీ మంత్రి, ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జాలేస్తున్నది. రాష్ట్రాలకు 41 శాతం డెవల్యూషన్ ఇవ్వాలి. అంటే రాష్ట్రాలు కట్టిన పన్నుల నుంచి కేంద్రం తిరిగి రాష్ట్రాలకు 41 శాతం ఇవ్వాలి. కాని డబ్బులు పంచాల్సి వస్తుందని, సెస్ రూపంలో కేంద్రం ఆదాయం సమకూర్చుకుంటున్నది’ అని హరీశ్రావు వివరించారు. కేంద్రం 27 లక్షల 58 వేల కోట్ల బడ్జెట్ కేంద్రం పెడితే, 5 లక్షల 38 వేల కోట్లు సెస్ రూపంలో తమ ఖాతాలో జమ చేసుకుంటున్నదని విమర్శించారు. రాష్ట్రాలకు పంచాల్సిన 41 శాతం కాకుండా 29.6 శాతం మాత్రమే రాష్ట్రాలకు అందుతున్నదని, మళ్లీ కో- ఆపరేటివ్ ఫెడరలిజం అని మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. దీన్ని ఆర్థిక సంఘం కూడా తప్పుబట్టిందని తెలిపారు. పెట్రోల్ మీద సర్చార్జి వేసి ప్రజల నుంచి రూ.3 లక్షల 3 వేల కోట్లు కేంద్రం వసూలు చేస్తున్నదని వెల్లడించారు. కేంద్రానికి తెలంగాణ రూ.3,65,700 కోట్లు కడితే, రాష్ర్టానికి మాత్రం రూ.1,93,000 కోట్లు కేంద్రం ఇచ్చిందని, దేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని మంత్రి హరీశ్ పేర్కొన్నారు.
ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ కోసం భట్టి విక్రమార్క ఒక మాట మాట్లాడలేదని మంత్రి హరీశ్రావు విమర్శించారు. దేశంలో ఎకడా లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తెచ్చి ల్యాప్స్ అనే పదం లేకుండా చేసిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద రూ.33.9 వేల కోట్లు ప్రతిపాదించామని తెలిపారు. జనాభా ప్రాతిపదికన ఈ బడ్జెట్లో 23.09 శాతం పెట్టామని అన్నారు. పేదరికాన్ని పోగొట్టాలని దళితబంధు పథకం తెచ్చి నిధులు ప్రతిపాదించినట్టు వివరించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్ ఎన్జీటీలో కొట్లాడి ఆ ప్రాజెక్టు పనులను నిలిపివేయించారని వెల్లడించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పులిచింతల కట్టవద్దని చెప్పి, అధికారంలోకి వచ్చాక తెలంగాణను ముంచి ప్రాజెక్టులు కట్టించి, నీళ్లు పారించారని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. కాళేశ్వరం ద్వారా కొత్త ఆయకట్టు, స్థిరీకరణ ద్వారా 8 లక్షల పది వేల ఎకరాలకు సాగు నీరు అందిందని, కాంగ్రెస్ హయాంలో పాలమూరు జిల్లాను వలసల జిల్లాగా మార్చారని మండిపడ్డారు. వలసలు వాపస్ తెచ్చిన ఘనత టీఆర్ఎస్దని తేల్చిచెప్పారు. 11 రాష్ట్రాల వారు తెలంగాణకు వలస వచ్చి పని చేస్తున్నారని గుర్తుచేశారు.
నిరుద్యోగంపై మాట్లాడే అర్హత బీజేపీ నేతలకు లేదని హరీశ్రావు అన్నారు. దేశంలో 15,62,962 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, ఆర్మీలో 2 లక్షలు, రైల్వేలో 3 లక్షలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 41 వేల పోస్టులు ఇలా అనేక విభాగాల్లో సుమారు 25 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. 2014 ఎన్నికల సమయంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని, ఆ లెకన ఇప్పటివరకు 15 కోట్ల ఉద్యోగాలు రావాలని గుర్తు చేశారు. 75 ఏండ్ల స్వాతంత్య్ర చరిత్రలో ప్రభుత్వ సంస్థలను అమ్మిన ఘనత ఒక బీజేపీకే చెల్లిందని, అసత్యాలు చెప్పడంలో ఆ పార్టీకి నోబెల్ బహుమతి వస్తుందని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో భారీ ఉద్యోగాల ప్రకటనతో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు సాకారం అయ్యాయి. నీళ్లు, నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముందంజలో ఉంది. తాజాగా ఉద్యోగాల ప్రకటనతో ఉద్యమ నినాదం సంపూర్ణమైంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తెలంగాణ నిరుద్యోగుల కల నెరవేరింది. ఇప్పటికే లక్షకు పైగా ఉద్యోగాలను నింపి.. మరోసారి భారీ సంఖ్యలో 91 వేల ఉద్యోగాలకు ప్రకటన ఇవ్వడంపట్ల తెలంగాణ జర్నలిస్టు ఉద్యమకారుడిగా గర్వపడుతున్నా. ములీ నిబంధనల స్ఫూర్తితో స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించడం గొప్ప విషయం.
– అల్లం నారాయణ, మీడియా అకాడమీ చైర్మన్
గతంలో కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రంలో 91,142 పైచిలుకు కొత్త ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టిన మార్చి 9 దేశ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించే రోజు. ఇంత భారీస్థాయిలో ఉద్యోగాల ప్రకటన దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదు. సీఎం కేసీఆర్ నిరుద్యోగుల ఆశాకిరణం. నిరుద్యోగులు బాగా చదువుకొని ఉద్యోగాలకు సిద్ధం కావాలి. – బోయినపల్లి వినోద్కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
ఒకేసారి 91,142 ఉద్యోగాల భర్తీ ప్రకటన చేయడం విప్లవాత్మక నిర్ణయం. దేశంలో ఏ పాలకుడు చేయని సాహసం కేసీఆర్ చేశారు. ఉద్యోగ ప్రకటనతో నిరుద్యోగ యువతలో భరోసా ఏర్పడింది. నియామకాలపై కుటిల రాజకీయాలు చేస్తున్న ప్రతిపక్షాలు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించాలి.
– జూలూరు గౌరీ శంకర్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్
సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా సర్వతోముఖంగా అభివృద్ధి చేయటానికి నిరంతరం కృషి చేస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా ఒకేసారి 80 వేలపైచిలుకు ఉద్యోగాల ప్రకటనచేసి చరిత్ర సృష్టించారు. నిరుద్యోగ యువత బంగారు భవితకు ఇదో గొప్ప అవకాశం. జోనల్ వ్యవస్థతో స్థానికులకే ఉద్యోగాలు దక్కే అవకాశం ఉంది.
– కోలేటి దామోదర్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్
తెలంగాణ పోలీస్శాఖలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు భర్తీచేస్తూ సహకారం అందిస్తున్న సీఎం కేసీఆర్కు పోలీస్శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్న. 18,344 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని యువత పోలీస్శాఖలో చేరేందుకు ముందుకు రావాలి. సమాజసేవకు పోలీస్ ఉద్యోగం గొప్ప అవకాశం.
– ఎం మహేందర్రెడ్డి, డీజీపీ
సీఎం కేసీఆర్ కార్యదక్షతకు మరో నిదర్శనం ఇది. అటెండర్ నుంచి ఆర్డీవో వరకు స్థానికులకే 95 శాతం అవకాశం కల్పించారు. భారీసంఖ్యలో ఒకేసారి ఉద్యోగ నియామకాలు చేపట్టడం హర్షణీయం. విద్యార్థి ఉద్యమ నేతగా సీఎంకు ధన్యవాదాలు.
– శుభప్రద్ పటేల్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు
91 వేలకు పైగా ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేస్తామని ప్రకటించి యువత ఉజ్వల భవితకు సీఎం కేసీఆర్ నాంది పలికారు. స్వరాష్ర్టాన్ని దశలవారీగా పునర్నిర్మిస్తున్నారు. తెలంగాణ యువత ఆకాంక్షలను నెరవేర్చడంలో మరో కీలక నిర్ణయం తీసుకొన్నారు. తెలంగాణ విద్యార్థి, యువత తరపున సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– కిశోర్గౌడ్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు
అవిభక్త ఆంధ్రరాష్ట్రంలో నీరు, నిధులు, నియామకాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలనే ఆలోచనతో నాడు కేసీఆర్ రాష్ట్ర సాధనకు కృషిచేయగా, నేడు సీఎంగా వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నారు. తాజాగా నిరుద్యోగుల కలలు సాకారమయ్యే విధంగా భారీస్థాయి ఉద్యోగ ప్రకటన చేశారు.
– తిరుపతి వర్మ, హైకోర్టు న్యాయవాది
దేశ చరిత్రలో ఇంత భారీస్థాయి ఉద్యోగ భర్తీ ప్రకటన చేసిన దాఖలాలు లేవు. నాడు అనేకమంది విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. అలాంటి విద్యార్థి, నిరుద్యోగలోకాన్ని గుర్తించి కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకొన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు తెలంగాణ వ్యతిరేకుల చేతిలో కీలుబొమ్మలు కాకుండా ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి.
– డీ రాజారాం యాదవ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు
అసెంబ్లీ సాక్షిగా ఒకే సారి 80 వేలకుపైగా ఉద్యోగాల భర్తీ ప్రకటన చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త చరిత్ర రాశారు. ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రకటన తోపాటు పదేండ్ల వయో పరిమితి పెంపు, వార్షిక క్యాలెండర్ విడుదల, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ నిర్ణయాలు సీఎం కేసీఆర్ గొప్ప మనసుకు నిదర్శనం. తెలంగాణ మోటార్ వెహికిల్ అసోసియేషన్ తరఫున, ఆర్టీఏ ఉద్యోగుల తరఫున సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– పాపారావు, తెలంగాణ మోటర్ వెహికిల్స్ ఇన్స్పెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ తీపికబురు చెప్పారు. అసెంబ్లీలో సీఎం ప్రకటన యువకుల జీవితాల్లో కొత్త ఆశలు రేకెత్తించింది. కేసీఆర్ ప్రకటనతో ఎంతోమంది తెలంగాణ ఉద్యమకారులకు మేలు జరుగబోతున్నది. బీజేపీ దేశంలో అధికారంలోకి వస్తే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని యువతను మోసం చేసింది.
– రాధారపు సతీశ్కుమార్, టీఆర్ఎస్ బహ్రెయిన్ అధ్యక్షుడు
తెలంగాణ ప్రజల మనసును అర్థం చేసుకొన్న గొప్పనేత కేసీఆర్. ఉద్యోగ నోటిఫికేషన్లు చాలా గొప్ప విషయం. కేసీఆర్ తెలంగాణకే కాదు.. యావత్ దేశానికే ఆదర్శం. ఒకప్పుడు బతుకు పోరాటం చేసిన తెలంగాణ.. ఇవాళ ఎందరికో బతుకునిస్తున్నది. ఒకప్పుడు తెలంగాణ అంటే కొందరికే సుపరిచితం. కానీ, నేడు ప్రపంచంలోని అందరికీ తెలంగాణ తెలుసు. ఈ క్రెడిట్ ముఖ్యమంత్రి కేసీఆర్కే చెందుతుంది.
– కాసర్ల నాగేందర్రెడ్డి, టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు
గురుకులాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు టీచర్లను, ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షణీయం. రాష్ట్రవ్యాప్తంగా 11,142 మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు రెగ్యులరైజ్ కానున్నది. గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల పక్షాన సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు.
– బాలరాజు, అధ్యక్షుడు, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ టీచర్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్