మేడ్చల్, డిసెంబర్ 27: చెత్తను ఇంటి బయట వేయకుండా స్వచ్ఛ వాహనాలకు అందించి, పరిసరాల పరిశుభ్రతకు పాటుపడాలని మేడ్చల్ మున్సిపల్ చైర్ పర్సన్ దీపికా నర్సింహా రెడ్డి తెలిపారు. మేడ్చల్ మున్సిపాలిటీ 4వ వార్డు పరిధి… కిష్టాపూర్లో స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా కౌన్సిలర్ తుడుం గణేష్ ఆధ్వర్యంలో త్రీ బిన్ సిస్టమ్ పై అవగాహన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటిని ఉంచిన విధంగా పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచాలని, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయరాదని సూచించారు. తడి, పొడి, హానికరమైన చెత్తను వేరు చేసి మూడు చెత్త బుట్టల్లో వేయాలని తెలిపారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించి జ్యూట్, క్లాత్ బ్యాగులను వాడాలని కోరారు. అనంతరం ఇండ్లలోనే కంపోస్టింగ్ ఎరువు తయారీ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అహ్మద్ షఫీఉల్లా, శానిటరీ ఇన్స్పెక్టర్ రాంచందర్, సిబ్బంది పాల్గొన్నారు.