స్టేషన్ఘన్పూర్, నవంబర్ 20: ఎవరైనా మనకు సాయం చేస్తే ఏడాదో, రెండేండ్లో.. మహా అయితే ఓ ఐదేండ్లు గుర్తుపెట్టుకొంటాం. కానీ, తన పెండ్లి సమయంలో అండగా నిలిచిన కుటుంబానికి ఓ వ్యక్తి వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపారు. గతంలో తనకు ఆసరాగా నిలిచిన కుటుంబంలోని వ్యక్తికి కాళ్లు కడిగి కన్యాదానం చేసి రుణం తీర్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం తమ్మడపల్లి(జి)కి చెందిన దాసరి హన్మయ్య (55) తనకు 20 ఏండ్ల వయసున్నప్పుడు కులాంతర వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో పాలకుర్తి మండలం కిష్టాపూర్తండాకు చెందిన బుచ్చమ్మ-సోమ్లానాయక్ అన్నీ తామై నూతన జంటకు అండగా నిలిచారు. హన్మయ్య ఉన్నతస్థాయికి చేరినా ఆ కుటుంబాన్ని మరచిపోలేదు. ఎలాగైనా ఆ కుటుంబం రుణం తీర్చుకోవాలనుకునే వారు. ఈ క్రమంలో బుచ్చమ్మ-సోమ్లానాయక్ల మనుమడు స్టేషన్ఘన్పూర్ మండలం మానసింగ్తండాకు చెందిన అనిల్కు పాలకుర్తి మండలం కిష్టాపూర్ తండాకు చెందిన పూజితతో వివాహం నిశ్చయమైందని తెలుసుకున్నారు. పూజితకు తండ్రి లేకపోవడంతో హన్మయ్య ఆమెకు తండ్రిలా వ్యవహరించి కన్యాదానం చేశారు. పెండ్లి ఖర్చుల కోసం అనిల్కు రూ.5 లక్షలు ఇచ్చారు. తన పెండ్లి విషయంలో అండగా నిలిచిన కుటుంబం రుణం తీర్చుకునేందుకు కన్యాదానం చేసిన హన్మయ్యను ఇరుగ్రామాల ప్రజలు అభినందిస్తున్నారు.