కాశీబుగ్గ, మే 14: యువతీ యువకుల కోసం 90 రోజులపాటు నిర్వహించే శిక్షణ శిబిరాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ గోపి సూచించారు. వరంగల్ 3వ డివిజన్లోని ఆరెపల్లి పోస్టుమెట్రిక్ హాస్టల్(పీఎంహెచ్)లో ఏటూరునాగారం ఐటీడీఏ ఆధ్వర్యంలో గ్రూప్స్ కోచింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ శనివారం సెంటర్ను ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం ఆయన ఉద్యోగార్థులకు తన అమూల్యమైన సలహాలు అందించారు. సివిల్స్లో తన స్వీయ అనుభవాలను అభ్యర్థులకు అలవోకగా అర్థమయ్యేలా వివరించారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. యువతీ యువకుల నుంచి సమాచారం సేకరించాలని, ఫీడ్బ్యాక్ బాక్స్ను ఏర్పాటు చేయాలని సెంటర కన్వీనర్కు సూచించారు. వైఫై, ప్రింటర్ అవసరమైతే తనకు సమాచారం ఇవ్వాలన్నారు. దాదాపు 45 నిమిషాలపాటు కలెక్టర్ శిక్షణకు హాజరైన వారితో మమేకమయ్యారు. కార్యక్రమంలో వరంగల్ డీటీడీవో జహీరుద్దీన్, సెంటర్ కన్వీనర్ బీ సురేందర్రెడ్డి, ఎల్లయ్య, గోపాల్రావు పాల్గొన్నారు.
ఉర్సు ప్రసూతి దవాఖాన తనిఖీ
ఖిలావరంగల్: ఉర్సులోని ప్రభుత్వ ప్రసూతి దవాఖానను కలెక్టర్ గోపి ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖాన ఆవరణను పరిశీలించారు. అనంతరం ఉద్యోగులు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. శస్త్ర చికిత్సలు లేని ప్రసవాలు జరిగే విధంగా కృషి చేయాలని వైద్యులకు సూచించారు. అలాగే, వైద్యలతోపాటు సిబ్బంది నిర్ణీత సమయం వరకు పని చేయాలని ఆదేశించారు. అనంతరం రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు.