తొర్రూరు, ఏప్రిల్ 5 : ‘మన ఊరు-మన బడి’ ద్వారా సర్కారు పాఠశాలలకు మహర్దశ పట్టనుందని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. తొర్రూరు మండలం కంఠాయపాలెం ప్రాథమిక పాఠశాలలో ‘మన ఊరు-మన బడి’లో భాగంగా రూ.21లక్షలతో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ‘మన ఊరు-మన బడి’ని సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పారు. కార్యక్రమం కింద పాఠశాలల్లో నీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, విద్యుత్, ఫర్నిచర్, పెయింటింగ్, గ్రీన్చార్ట్ బోర్డులు, కాంఫౌండ్ వాల్స్, డైనింగ్ హాల్, డిజిటల్ క్లాసులు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలవుతుందన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.7,289 కోట్లతో ఈ కార్యక్రమం చేపట్టిందని వివరించారు. తొలి విడుత 9,123పాఠశాల్లో 12 రకాల సదుపాయాలు కల్పించేందుకు రూ.3,497 కోట్ల ఖర్చు చేస్తున్నామని చెప్పారు. పాఠశాలల్లో పనులను స్థానిక ప్రజాప్రతినిధులు పర్యవేక్షించాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తూ అధికంగా నిధులు కేటాయిస్తున్నదని గుర్తు చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంగ్లిష్ మీడియంలో చదివించే రోజులు త్వరలోనే వస్తాయని చెప్పారు. పాలకుర్తి నియోజకవర్గంలో తొలి విడుత 104 పాఠశాలల్లో మన ఊరు-మన బడిని అమలు చేస్తున్నామన్నారు. పాలకుర్తి మండలంలో 24, తొర్రూరులో 18, కొడకండ్లలో 11, పెద్దవంగరలో 12, దేవరుప్పులలో 18, రాయపర్తిలో 21 పాఠశాలలు తొలి విడుతలో ఎంపికయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో యువత, మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా అని ప్రజలు ఆలోచించాలని సూచించారు. తొర్రూరు మండలంలోని గుర్తూరు నుంచి మడిపల్లి వరకు రోడ్డు నిర్మాణానికి రూ.4.53కోట్లు, తొర్రూరు నుంచి కంఠా యపాలెం వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.2.10 కోట్లు, అమ్మాపురం శివారు బ్రిడ్జి నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.
రూ.95వేల కోట్లతో పథకాలు : మంత్రి సత్యవతి
రాష్ట్రంలో రూ.95వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు మంత్రి సత్యవతిరాథోడ్ పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధిలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందన్నారు. మన ఊరు-మన బడి ద్వారా రాష్ట్రంలోని 26వేలకు పైగా పాఠశాలల్లో మౌలిక వసతులు సమకూరుతాయని, కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. కలెక్టర్ శశాంక మాట్లాడుతూ సరైన సౌకర్యాలు లేని సమయంలోనే తాను ప్రభుత్వ పాఠశాలలో చదివి అత్యున్నత సర్వీస్ సాధించానని, ప్రభుత్వం ప్రస్తుతం సమకూరుస్తున్న సౌకర్యాలతో విద్యార్థులు ఉన్న లక్ష్యాలను సాధించాలని అభిలషించారు. కార్యక్రమంలో మానుకోట జడ్పీ చైర్ పర్సన్ ఆంగోతు బిందు, ట్రైనీ కలెక్టర్ అభిషేక్ అగస్త్య, ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, సర్పంచ్ నరేడ్ల శ్రీపాల్రెడ్డి, ఎంపీటీసీ పల్లె దేవమ్మ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పసుమర్తి శాంత, రైతు బంధు మండల కో-ఆర్డినేటర్ అనుమాండ్ల దేవేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, డీఈవో అబ్దుల్ హై, మండల ప్రత్యేకాధికారి నర్మద, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ నాగవాణి, హెచ్ఎం జయప్రద, గ్రామీణాభివృద్ధి కమిషన్ రాష్ట్ర డైరెక్టర్ ఎల్.వెంకటనారాయణగౌడ్, వైస్ ఎంపీపీ శ్యాంసుందర్రెడ్డి, వైస్ చైర్మన్ సురేందర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, నాయకులు డాక్టర్ సోమేశ్వర్రావు, రామ సహాయం కిశోర్రెడ్డి పాల్గొన్నారు.