‘మేం పండించిన మొత్తం వడ్లు బరాబర్ కొనాలె.., నూకలు తినాలంటూ అవమానించేలా మాట్లాడినందుకు తెలంగాణ సమాజానికి కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ బాజాప్తా క్షమాపణ చెప్పాలె..’ అంటూ అటు రైతులు, ఇటు ప్రజలంతా ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర మంత్రి హోదాలో ఉండి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ప్రజలను హేళన చేయడంపై అన్ని వర్గాల వారు భగ్గుమంటున్నారు. ఇప్పటికైనా కొనుగోళ్లపై కేంద్రం తేల్చకుంటే ధాన్యం తీసుకొచ్చి ఢిల్లీలో పోస్తామని.. మొత్తం వడ్లు కొనేదాకా ఊకునేదే లేదని హెచ్చరిస్తున్నారు. రైతులతో పెట్టుకున్న ప్రభుత్వాలేవీ బాగుపడలేదని.. సీఎం కేసీఆర్ వల్లే పుష్కలంగా నీళ్లు, 24గంటల కరంట్ వచ్చి.. ఎవుసం సంబురంగ చేసుకుంటున్న తెలంగాణ రైతుల జోలికి వస్తే బీజేపీ సర్కారుకు కూడా ‘నూకలు’ చెల్లుతాయని శాపనార్థాలు పెడుతున్నారు.
కొనుగోళ్లపై తేల్చకుంటే ధాన్యం తెచ్చి ఢిల్లీలో పోస్తం
హనుమకొండ సబర్బన్, మార్చి 27 : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వడ్ల కొనుగోలు విషయంలో వ్యవహరిస్తున్న తీరు ఘోరంగా ఉందని, ఆయన తన పద్ధతి మార్చుకోకపోతే తగిన రీతిన బుద్ధి చెబుతామని అన్ని వర్గాల వారు హెచ్చరిస్తున్నారు. ఒక కేంద మంత్రిలా కాకుండా వ్యాపారిలా మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తుతున్నారు. తెలంగాణలో పండిన ధాన్యాన్ని కొంటడో, కొనడో తేల్చకుండా ప్రజలను నూకలను తినాలనడం సమంజసం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైతులు తలుచుకుంటే ఎన్నోసార్లు ప్రభుత్వాలు కూలిపోయాయని, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి కూడా రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరిస్తున్నారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం మనుగడ సాగించినట్లు చరిత్రలో లేదని.. ఇప్పుడు బీజేపీ సర్కారు కూడా రైతులు ఉసురుతీస్తున్నదని మండిపడుతున్నారు.
తెలంగాణపై ఎందుకింత వివక్ష
కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర భారతదేశంపై ఉన్న ప్రేమ దక్షిణాది రాష్ర్టాలపై లేదని.. అందులోనూ తెలంగాణపై మరింత వివక్ష చూపుతున్నారంటూ రైతులు సహా అన్ని వర్గాలు విమర్శిస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర మంత్రి స్పష్టత ఇవ్వాల్సింది పోయి.. నూకలు తినాలంటూ రాష్ట్ర ప్రజలను, రైతులను అవమానించేలా మాట్లాడిన ప్రధాని మోదీ స్పందించకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇక్కడ ముగ్గురు ఎంపీలు ఉన్నా.. ఎవరు కూడా వడ్ల సమస్యను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి.. తమకు న్యాయం చేయలేరా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. దేశంలో 65 శాతం మంది బియ్యం తినే వారు ఉన్నారు. అయితే గోధుమ పంటను ఎక్కువగా ప్రోత్సహించేందుకే మన వడ్ల పంటలను కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్నదని రైతులు మండిపడుతున్నారు. గతంలో తమకు బాయిల్డ్ రైస్ మాత్రమే ఇవ్వాలని కోరిన ఎఫ్సీఐ ఇప్పుడు ప్రభుత్వ ఒత్తిడితోనే కొర్రీలు పెడుతున్నదని చెబుతున్నారు. ఇక్కడి వాతావరణం దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లో యాసంగి పండించే ధాన్యం నూకలే అవుతాయని గుర్తుచేస్తున్నారు. యాసంగిలో కూడా బియ్యం అయ్యేలా కొత్త వంగడాల కోసం పరిశోధనలు చేస్తున్నప్పటికీ అవి ఇంకా అందుబాటులోకి రాలేదని గుర్తుచేస్తున్నారు. కేసీఆర్ నాయకత్వంలో ఒకవైపు వ్యవసాయం పురోగమిస్తుంటే నరేంద్రమోదీ దానిని సంక్షోభంలోకి నెట్టేస్తున్నారని అంటున్నారు.
నూకలు తినేగతి పట్టలేదు..
జనగామ, మార్చి 27(నమస్తే తెలంగాణ) : ఎక్కడా లేని విధంగా పంటల సాగుకు ముందే పెట్టుబడి సాయం ఖాతాల్లో వేస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందా? అభివృద్ధి, సంక్షేమం సహా రైతులకు 24గంటల కరంటు..పుష్కలంగా సాగునీరు.. రైతుబంధు, రైతుబీమా ఇస్తూ అన్నివిధాలా ఆదుకునే తెలంగాణ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్నిరోజులు మాకు నూకలు తినేగతి రాదు. ఒకప్పుడు చేయి చాచిన మేం ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే స్థాయిలో వడ్లు పండిస్తున్నం. రైతాంగం ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న కేంద్రం ఏమైందో సమాధానం చెప్పాలి. తెలంగాణ రైతుల జోలికొచ్చిన ప్రభుత్వాలు మనుగడ సాధించిన దాఖలాలు లేవు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ వైపు రాష్ట్రం అడుగులు పడుతున్నయ్. ఇది మా తెలంగాణ ప్రజల అదృష్టం.. ధాన్యం పూర్తిస్థాయిలో కొనేదాకా పోరాటం చేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్కు అండగా రైతులోకం ఉంటుంది.
– వాతాల సుధాకర్, వడ్లకొండ
గోయల్ రాజీనామా చేయాలె..
మంత్రి అంటే ప్రజలందరికి తండ్రిలాంటి వాడు. అట్లాంటి మనిషి బాధ్యత లేకుండా మాట్లాడడం సిగ్గుచేటు. గౌరవంగ బతుకుతున్న తెలంగాణ ప్రజలను నూకలు తినాలని ఎద్దేవా చేయడం సరైంది కాదు. ఇట్లాంటి బాధ్యత తెల్వని వ్యక్తి కేంద్ర మంత్రిగా ఉండడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఆయన వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయలి. మేం గతంలో నూకలు తిన్నం, గడ్క తిన్నం అయినా ఆత్మగౌరవంతోటే బతికినం. ఏనాడూ దేహీ అని అడుక్కోలేదు. కేసీఆర్ ఫుల్ కరంటు, పుష్కలంగ నీళ్లు ఇచ్చుడు షురూ అయినంక పంటలు మంచిగ పండించుకుంటున్నం, నలుగురికి మేమే అన్నం పెడుతున్నం. మా వడ్లు కొనాల్సిందే, లేకుంటే గుణపాఠం నేర్పించి తీరుతాం.
– ఎర్రబెల్లి తిరుపతిరావు, ఉప్పల్, కమలాపూర్
క్షమాపణ చెప్పాలి
జఫర్గఢ్, మార్చి 27 : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అహంకారంతో మాట్లాడుతున్నాడు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోగా పైగా నూకలు తినండి అంటూ తెలంగాణ రైతులను, ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడడం ఆయన దురంహకారానికి నిదర్శనం. ఇప్పటికైనా గోయల్ తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. ఆ వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకోవాలి. లేకపోతే తెలంగాణ రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు.
– లోనె నాగేశ్వర్రావు, రైతు, సాగరం
రైతుల ఉసురు తగులుద్ది
ఇరవై నాలుగంటలు కష్టపడి పంటలను పండిస్తున్నం. పగలనక, రాత్రనక తిప్పలు వడుతున్నం. మట్టి బుక్కి మరీ పంటలు పండిస్తున్నం. ఇంతజేసి మేం పంటలు పండిస్తే కేంద్ర సర్కారు కొనమని మొండికేసుడు మంచి పద్ధతి కాదు. రైతులకు అన్యాయం చేసే విధంగ కేంద్రం వ్యవహరించడం సరికాదు. మేం పండించిన ధాన్యాన్ని కొని తీరాల్సిందే. లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. రైతులను ఇబ్బందులు పెట్టడం కాదు, మంచి చేసి చూపియ్యాలె. రైతులను అవమానించి మీరు ఏం సాధిస్తరు. వడ్లు కొన్నంకనే బీజేపోళ్లు మాట్లాడాలె.
– బొమ్మిరెడ్డి మహేందర్రెడ్డి, రైతు, ఎల్కతుర్తి, హనుమకొండ సబర్బన్
బీజేపీకి ‘నూకలు’ దగ్గరపడ్డయ్
సంగెం, మార్చి 27 : మేం ఏది తినాల్నో చెప్పడానికి గోయల్ ఎవరు.. మేం నూకలు తినుడు కాదు.. ఆయనకే తినిపిస్తం. ఎన్కట ఏం దొరకక ఉన్నది తిన్నం. గడ్కో, నూకలో ఏది దొరికితే అది తిని కడుపునింపుకున్నం. ఇప్పుడు తెలంగాణ మొత్తం పచ్చటి పొలాలతో నిండుగ ఉన్నది. ధాన్యపు రాశులతోటి కళకళలాడుతాంది. ఇప్పుడు నూకలు తినుడు అలవాటు చేయాలని నోటికచ్చింది మాట్లాడుతున్నడు. కేంద్రంలో పెద్ద పదవిలో ఉంది గిట్లనే మాట్లాడేది. తెలంగాణ రైతులు, ప్రజలంటే గింత చులకనా. ఇంత అహంకారం పనికిరాదు. ఆ మాట ఇన్నంక మస్తు బాధనిపిచ్చింది. ఇసొంటి మంత్రిని వెంటనే పదవి నుంచి తప్పియ్యాలె. వెంటనే క్షమాపణ చెప్పాలె. లేకపోతే ఊరూరా దిష్టిబొమ్మలు కాలవెడ్తం. లేకపోతే బీజేపోళ్లను ఊళ్లళ్లకు రానియ్యం. ధాన్యం కొనమంటే కొనరు.. గిట్ల కారెడ్డం మాట్లాడుతరు. ఇప్పటికైనా తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని మొత్తం కొనాలె. మోదీ సర్కారుకు నూకలు దగ్గరపడ్డయ్.
– గండ్రకోటి రవి, మొండ్రాయి