వయస్సుతో సంబంధం లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలపై దృష్టి పెట్టాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. వెటరన్ అథ్లెటిక్స్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కేంద్రం, రాష్ట్రంలో ఇదివరకు ఉన్న ప్రభుత్వాలు క్రీడారంగాన్ని పెద్దగా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ప్రతి నియోజకవర్గానికి ఒక స్టేడియం మంజూరు చేశారని అందులో 40 స్టేడియాలు నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా క్రీడా పాలసీ తీసుకొస్తామని తెలిపారు. నిరుపయోగంగా ఉన్న మైదానాలు.. తెలంగాణ వచ్చాకే కళకళలాడుతున్నాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో గ్రామీణ, మండల, డివిజన్, జిల్లా, రాష్ట్రంలో సీఎం కప్ పేరిట పోటీలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ తరహాలో వరంగల్ను కూడా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. కేంద్రంలో కూడా క్రీడా పాలసీ తీసుకురావాలని డిమాండ్ చేశారు. త్వరలో గచ్చిబౌలితో పాటు వరంగల్, మహబూబ్నగర్, ఆదిలాబాద్లో నేషనల్ అథ్లెటిక్స్ మీట్ మెగా ఈవెంట్లు నిర్వహించేంచేలా చర్యలు తీసుకుంటామన్నారు.
సీఎం కేసీఆర్ ప్రకటించిన 80వేల పోస్టుల్లో 20 వేల ఉద్యోగాలు పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులు ఉన్నాయని అనుభవజ్ఞులైన క్రీడాకారులంతా ఉద్యోగార్థులకు శిక్షణ ఇవ్వాలని మంత్రి సూచించారు. వరంగల్ జిల్లా అంటేనే ఉద్యమలా ఖిల్లా అని సీఎం కేసీఆర్ ఏ సభ పెట్టినా వరంగల్ నుంచే ప్రారంభించేవారని, ప్రజలంతా ఆయన వెంటే ఉన్నారని చెప్పారు. వెటరన్ అథ్లెట్లను మిగతా క్రీడాకారులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా 95ప్లస్ వెటరన్ అథ్లెట్ కత్తెరశాల కొమురయ్య(5కే రన్లో గోల్డ్మెడల్), 90 ప్లస్లో లాంగ్జంప్, షాట్పుట్లో గోల్డ్మెడల్ సాధించిన బీ శ్రీనివాస్రెడ్డిని మంత్రి సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ సుందర్రాజు, శాప్ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ అజీజ్ఖాన్, టీజీవో ఉమ్మడి జిల్లా సమన్వయకర్త జగన్మోహన్రావు, డీవైఎస్వో గుగులోత్ అశోక్కుమార్, అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి సారంగపాణి, కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ పాల్గొన్నారు.
స్పోర్ట్స్ క్యాలెండర్ రూపొందిస్తాం..: చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్
2014కి ముందు దుమ్ముకొట్టుకుపోయిన మైదానాలను స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవతో ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. వరంగల్ అభివృద్ధిలో భాగంగా క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ స్పోర్ట్స్ సిటీగా తీర్చిదిద్దుతున్నారు. రూ.7కోట్లతో జేఎన్ఎస్లో సింథటిక్ ట్రాక్ ఏర్పాటుచేశారు. మూడు నెలల క్రితమే నేషనల్ అథ్లెటిక్స్ మీట్ ఏర్పాటుచేసుకున్నాం. ప్రో కబడ్డీ కూడా నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సాహించాం. స్పోర్ట్స్ హాస్టల్, ఉమెన్స్ హాస్టల్, ఇండోర్ స్టేడియం అభివృద్ధికి రూ.10 కోట్లతో ప్రతిపాదనలు పంపాం. క్రీడా నిపుణులు, సంఘాల సలహాలు, సూచనలతో త్వరలో స్పోర్ట్స్ క్యాలెండర్ రూపొందిస్తాం. ప్రతినెలా ఒక ఈవెంట్ ఉండేలా చూస్తాం. 35-100 సంవత్సరాల వెటరన్ అథ్లెట్లు పోటీల్లో పాల్గొనడం అభినందనీయం
స్వయంకృషితో పాల్గొంటున్నారు : బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ
స్వయంకృషితో వెటరన్ అథ్లెట్స్ సత్తాచాటుతూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఎప్పుడూ ఇలా ఈవెంట్లు నిర్వహించేలా చూస్తాం. త్వరలో క్రీడా పాలసీ రూపొందిస్తాం. సీఎం కేసీఆర్ క్రీడలను ఎంతగానో ప్రోత్సాహిస్తున్నారు. అందుకే మైదానాలు సందడిగా కనిపిస్తున్నాయి. 90వేల ఉద్యోగాల్లో క్రీడాకారులకు కూడా అవకాశం కల్పిస్తాం.
వరంగల్లోనూ ఈవెంట్స్ : నన్నపునేని నరేందర్, తూర్పు ఎమ్మెల్యే
హైదరాబాద్ తరహా వరంగల్లో ఈవెంట్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ అన్ని క్రీడలు నిర్వహించేలా మంత్రి దృష్టి పెట్టాలి. 95 ఏళ్ల వయస్సులోనూ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొనడం సంతోషంగా ఉంది.