ఖిలావరంగల్, మార్చి 26: ఓరుగల్లుకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతి, పురావస్తు శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. శనివారం ఖిలావరంగల్ మధ్యకోటలోని రాష్ట్ర మ్యూజియంలో రూ.3కోట్ల నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వరంగల్ను హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. చిన్న జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత హనుమకొండ, వరంగల్ జిల్లాలకు మెడికల్ కళాశాలలు, రూ.1,100 కోట్లతో చేపట్టే మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు నిధులు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు. కేవలం వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ రూ.3వేల కోట్లకు పైగా నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం ఎంతో గర్వం గా ఉందన్నారు. తెలంగాణ రాక ముందు 15 గురుకులాలు ఉంటే ఇప్పుడు వందల సంఖ్యలో ఉన్నాయని తెలిపారు. రామప్పకు యునెస్కో గుర్తింపు లభించిందంటే తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేసిన కృషే కారణమని కొనియాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణపై చిత్తశుద్ధి లేదన్నారు. గుడికి ముందు 30 ఏళ్లు రాజకీయం చేశారని, ఇప్పుడు అదే పేరుతో రాజకీయాలు చేస్తున్నారని, కులం, మతం పేరు తో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని తెలిపారు. కులానికి, గుడికి, సంఘానికి పైసా కూడా ఇవ్వకుండా మాటలతోనే పజలను మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వరంగల్లో కళాకారుల కోసం కళాక్షేత్రం, పర్యాటకుల కోసం హరిత హోటల్ నిర్మిస్తామని తెలిపారు.
కేసీఆర్ సీఎం అయ్యాకే తెలంగాణ అభివృద్ధి : ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్
కేసీఆర్ సీఎం అయ్యాకే తెలంగాణ అభివృద్ధి జరిగిందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. ఓవైపు అన్ని రంగాల్లో అభివృద్ధి, మరోవైపు సంక్షే మ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. గోల్కొండ ఖిలా, చార్మినార్, వేయిస్తంభాల ఆలయం, ఖిలావరంగల్ సమైక్య రాష్ట్రంలో కనుమరుగు కాగా, సీఎం కేసీఆర్ వాటికి ప్రత్యేక గుర్తింపు వస్తున్నదని తెలిపారు. ఎమ్మెల్యే నరేందర్తో రాజకీయ పోటీ లేదని, కేవలం అభివృద్ధిలోనే పోటీ ఉందన్నారు. నాడు సీఎం కిరణ్కుమార్రెడ్డి కోటకు వచ్చినప్పుడు వేదికపైనే ధర్నాకు దిగిన ఘటన గుర్తుచేశారు.
అభివృద్ధిని ప్రజలు స్వాగతిస్తున్నారు : తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలు స్వాగతిస్తున్నారని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఈ నియోజకవర్గానికి రూ.3,248 కోట్లు నిధు లు అభివృద్ధి పనులకు కేటాయించారని తెలిపారు. కొందరు పనులను అడ్డుకునేందుకు పిచ్చి రాజకీయాలు చేస్తున్నారన్నారు. కోటకు ప్రతీ ఆదివారం 10 వేల మంది పర్యాటకులు వస్తున్నారన్నారని మంత్రి శ్రీనివాస్గౌడ్ దృష్టికి తీసుకువెళ్లారు. వరంగల్ మండలంలో కలెక్టరేట్, ఖిలావరంగల్ మండలంలో ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. అలాగే గౌడ కమ్యూనిటీ భవనం కోసం రూ.కోటి నిధులు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే కృషి ఫలితమే వరంగల్ జిల్లా : ఎమ్మెల్సీ బండా ప్రకాశ్
వరంగల్ జిల్లా ఏర్పడడానికి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కృషే ప్రధాన కారణమని ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ అన్నారు. కోటలోని చారిత్రక కట్టడాలు కేంద్రం ఆధీనంలో ఉన్నందున అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయదని, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పనులను అడ్డుకుంటుందన్నారు. కోటలో 10 ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. 38వ డివిజన్ కార్పొరేటర్ బైరబోయి ఉమా దామోదర్ అధ్యక్షత వహించగా కలెక్టర్ బీ గోపి, కుడా చైర్మన్ సుదరరాజు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. కాగా, టీఎన్జీవోస్ జిల్లా ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తుశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గజ్జల రాంకిషన్, గాజే వేణుగోపాల్, సంయుక్త కార్యదర్శి రామకృష్ఱ, మెడికల్ ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్, సిటీ అధ్యక్షుడు వెలిశాల రాజు ఉన్నారు.
టూరిజం హబ్గా అభివృద్ధి చేస్తా
వరంగల్ జిల్లాను టూరిజం హబ్గా అభివృద్ధి చేస్తానని రాష్ట్ర అబ్కారీ, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పర్యాటక, పురవాస్తు శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శనివారం పోచమ్మమైదాన్లోని కాంప్లెక్స్ స్థలంలో హరితహోటల్ నిర్మాణం కోసం ప్రతిపాదించిన స్థలా న్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ కల్చరల్ కాంప్లెక్స్తోపాటు హరిత హోటల్ నిర్మాణం చేపడుతామని, ఎస్టిమేషన్ కోసం సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. గౌడ సంఘం నాయకులతోపాటు పలువురు కార్పొరేటర్లు మంత్రి శ్రీనివాస్గౌడ్ను సన్మానించారు.