నర్సంపేట/చెన్నారావుపేట, మార్చి 20: మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో ఉద్యమించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కోరబోయిన కుమారస్వామి పిలుపునిచ్చారు. నర్సంపేటలోని అమరవీరుల స్తూపం వద్ద మల్లు స్వరాజ్యం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మల్లు స్వరాజ్యం తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం సర్కారును గడగడలాడించిందన్నారు. మల్లు స్వరాజ్యం ఇంటిని నిజాం సర్కారు తగులబెట్టినా వెనుకంజ వేయలేదని గుర్తుచేశారు. స్వరాజ్యం ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో జరిగిన సాయుధ పోరాటాల్లో పని చేశారని వివరించారు. నాడు దొరల దురహంకారాన్ని పాటల ద్వారా చైతన్యం చేశారన్నారు.
ఆంధ్ర మహాసభ పిలుపుతో తన భూమిలో పండిన ధాన్యాన్ని పేదలకు పంచి పెట్టారని వెల్లడించారు. కార్యక్రమంలో హన్మకొండ శ్రీధర్, ముంజాల సాయిలు, పిండి రాములు,గొట్టం కుమార్, మద్ది అశోక్, చింతకింది శోభన్, ముంజాల రమేశ్, మండల అశోక్, శ్రీనివాసరెడ్డి, గాదరి మల్లయ్య, ఎండీ ఫరీదా, వజ్జంతి విజయ, నాగమణి, రాజశేఖర్, వీరన్న, శివకుమార్, సాయికుమార్ పాల్గొన్నారు. అలాగే, చెన్నారావుపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంసీపీఐయూ నాయకుడు జన్ను రమేశ్ మాట్లాడుతూ బానిసత్వం నుంచి ప్రజలను విముక్తి చేసిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతి కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటన్నారు. ఆయన వెంట సాంబయ్య, చంద్రయ్య, రెడ్యానాయక్, మహేశ్కుమార్, వంశీ, బాబురావు ఉన్నారు.
స్వరాజ్యం చూపిన దారిలో నడువాలి
ఖానాపురం/సంగెం/కాశీబుగ్గ: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతి దేశానికి తీరని లోటని సీపీఎం మండల కార్యదర్శి మంజాల సాయిలు అన్నారు. అశోక్నగర్లో స్వరాజ్యం చిత్రపటానికి పూలమాల వేసి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె బతికున్నంతకాలం పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యే అయినా ఆమె గడిపిన సాధారణ జీవితం నేటి తరం రాజకీయ నాయకులకు ఆదర్శమన్నారు. మల్లు స్వరాజ్యం చూపిన దారిలో సీపీఎం నేతలు నడువడమే ఆమెకు నిజమైన నివాళి అన్నారు. కార్యక్రమంలో ముంజాల రమేశ్, గొట్టం కుమార్, తిరుపతి, రాములు, అశోక్ పాల్గొన్నారు. అంతేకాకుండా సంగెం వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంసీపీఐ(యూ) మండల కార్యదర్శి ఎండీ ఇస్మాయిల్ మాట్లాడుతూ మల్లు స్వరాజ్యం పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం పోరాడారని కొనియాడారు.
ఆయన వెంట సీఐటీయూ నాయకులు దుబ్బాక రాజు, రేణుక, రామారావు, గద్దల చేరాలు, బాబు ఉన్నారు. కాశీబుగ్గలో బీకేఎంయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు తాటిపాముల వెంకట్రాములు మాట్లాడుతూ మల్లు స్వరాజ్యం అందించిన పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలని బీకేఎంయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు తాటిపాముల వెంకట్రాములు పిలుపునిచ్చారు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం తుదిశ్వాస విడిచే వరకూ ఆమె అంకితభావంతో, నిస్వార్థంగా పని చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.