ఖిలావరంగల్, నవంబర్ 30 : రైతులకు ఇబ్బంది కలుగకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. మంగళవారం ఖిలావరంగల్ మండలం బొల్లికుంట గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి తేమ శాతాన్ని పరిశీలించారు. యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని, ఈ విషయమై వ్యవసాయాధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో గన్ని సంచులు, టార్పాలిన్లు సిద్ధంగా ఉంచుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. కార్యక్రమంలో 17వ డివిజన్ కార్పొరేటర్ జీ బాబు, డీసీవో సంజీవరెడ్డి, ఏవో విజ్ఞాన్, ఏఈ సత్యప్రకాశ్, డీటీ సంధ్య, పీఏసీఎస్ వైస్ చైర్మన్ సోల్తి భూమాత రామస్వామి, ఏఎంసీ డైరెక్టర్ తుమ్మ రవీందర్రెడ్డి, సీఈవో మైదం కుమారస్వామి, వేమనరెడ్డి, దామోదర్, వీరారెడ్డి, సోల్తి నరేందర్, బొజ్జం సుధాకర్, ఎల్లగౌడ్, రవీందర్, మురళి, భాస్కర్, శ్రీధర్ పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజన కార్మికుల వినతి
ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారు చేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్కు వినతిపత్రం అందచేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో లక్ష్మి, రాజేశ్వరి, ధనలక్ష్మి, ఊర్మిల, మేరి, రమ, స్వర్ణలత, ఐలమ్మ ఉన్నారు.
పర్వతగిరిలో..
పర్వతగిరి, నవంబర్ 30 : కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ గోపి ఆదేశించారు. మండలంలోని నారాయణపురం, రోళ్లకల్లు, వడ్లకొండ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కాంటాల నిర్వహణకు పరిశీలించారు. పలువురు రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఇబ్బందులుంటే జిల్లా కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. రైతుల వివరాలు నమోదు చేసుకుని సకాలంలో డబ్బులు అందేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ సంజీవరెడ్డి, సివిల్ సప్లయ్ డీఎం భాస్కర్రావు, పీఏసీఎస్ సీఈవో సురేశ్, సర్పంచ్ కొత్తూరు రామ్మోహన్ పాల్గొన్నారు.
ప్రత్యేక తరగతులు నిర్వహించండి
పదో తరగతిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని కలెక్టర్ గోపి సూచించారు. మండలంలోని ఉప్పరపల్లి ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను ఆయన బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత విద్యాసంవత్సరంలో కరోనా కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు సాధారణ తరగతులతో పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. విద్యార్థుల్లో అభ్యసనా సామర్ధ్యాలు పెంపొందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి పలు పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఆయన నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. శుభ్రమైన తాగునీటిని అందించాలన్నారు. నాణ్యత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట హెచ్ఎం లలిత్కుమార్, రాజేశ్వరి, ఉపాధ్యాయులు శ్రీనివాస్, శ్రీధర్, రాజు, అనురాధాదేవి, రామాచారి, వీరస్వామి, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.