వరంగల్ చౌరస్తా, నవంబర్ 30: ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా టీఆర్ఎస్ సర్కారు మరో అద్భుత పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నది. జన్యుపరమైన వ్యాధుల(నాన్ కమ్యూనికల్ డిసీజెస్ (ఎన్సీడీ))తో బాధపడుతున్న రోగులకు నెలనెలా కిట్ల రూపంలో మందులను అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టనుంది. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారిలో ఎక్కువ శాతం మందులు కొనలేని వారు ఉన్నారు. ఈ కారణంగా మందులు వాడలేకపోతున్నారని అధికారులు గుర్తించారు.
అలాంటి నిరుపేదలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు ఎన్సీడీ కిట్ల రూపంలో మందులు అందించనున్నారు. రక్తపోటు(బీపీ), మధుమేహం(షుగర్) లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి తెలంగాణ సర్కారు ప్రతినెలా మందులను ఉచితంగా అందించడానికి కార్యాచరణ చేపట్టింది. ఇప్పటికే జిల్లాల వారీగా వివరాలు సేకరించినట్లు సమాచారం. జిల్లావ్యాప్తంగా 66,622 మంది బాధితులను గుర్తించారు. వీరిలో 45,894 మంది రక్తపోటు, 20,728 మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు తెలింది. వారి వివరాలను సంబంధిత జాతీయ ఆరోగ్య నివేదికలో నమోదు చేసినట్లు డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ తెలిపారు. బాధితులకు అందించే కిట్లలో వ్యసనాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై వివరిస్తూ ప్రత్యేకంగా తయారు చేసిన బ్యాగ్లో అమర్చబడి ఉంటాయి.
నివేదికలో పొందుపరుస్తున్నాం
ఇప్పటి వరకు జిల్లాలో సుమారు 66,622 మంది దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నట్లు గుర్తించాం. బీపీ, షుగర్తో బాధపడుతున్న వారి వివరాలను జాతీయ ఆరోగ్య నివేదికలో పొందుపరిచాం. ప్రభుత్వం కోరిన వెంటనే నివేదికను అందిస్తాం.