మహబూబాబాద్, నవంబర్15 (నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనబోమని కేంద్రప్రభుత్వం తెగేసి చెప్పడంతో ప్రత్యామ్నాయ పంటల వైపు అన్నదాతలను మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వంచర్యలు తీసుకుంటున్నది. వరి కంటే ఎక్కువ ఆదాయం వచ్చే పంటలు ఎన్నో ఉన్నాయని, యాసంగిలో రైతులు ఆ దిశగా ఆలోచించాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఊరూరా సదస్సులు పెట్టి అవగాహన కల్పిస్తున్నారు. వరికి బదులు బెండ, గోరుచిక్కుడు, దోస, టమాట, వంగ పంటలతో పాటు పుచ్చ, కర్బూజ, పప్పుదినుసులు, నూనెగింజల వంటివి సాగుచేయాలని చెబుతున్నారు. ఇప్పటికే కూరగాయలు పండిస్తూ అధిక లాభాలు పొందుతున్న రైతులను ఉదహరిస్తున్నారు. వరి ఎకరాకు అన్ని ఖర్చులు పోను రూ.20వేల వరకు మాత్రమే ఆదాయం వస్తుందని, అదే కూరగాయలతో అన్ని ఖర్చులు పోను ఎకరాకు ఒక పంటకు రూ.50వేల నుంచి 60వేల వరకు ఆదాయం పొందవచ్చని చెబుతున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉంటే ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుందని, రేట్లు తక్కువగా ఉన్నా ఎకరాన కనీసం రూ.40వేల వరకు తప్పక వస్తాయని అధికారులు భరోసా ఇస్తున్నారు. ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తుండడం వల్ల చాలామంది రైతులు యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
మూడు పంటలు తీస్తున్న..
వరితో పోలిస్తే కూరగాయాల సాగులో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుంది. నేను ఐదేళ్లుగా బీర, కాకర, టమాట పండిస్తున్నా. నాకున్న 4 ఎకరాల భూమిలో ఏడాదికి మూడు పంటలు తీస్తున్న. ప్రతి పంటకు ఎకరాకు రూ.40వేల వరకు పెట్టుబడి అవుతుంది. దిగుబడి సుమారు 60 నుంచి 80 క్వింటాళ్లు వస్తుంది. క్వింటాకు రూ.3వేల నుంచి రూ.4500 ధర ఉండడంతో ఎకరాకు రూ.1.80 లక్షల నుంచి రూ.2.70లక్షల వరకు ఆదాయం వస్తుంది. అన్ని ఖర్చులు పోను ఎకరాకు రూ.60 నుంచి రూ.80 వేల వరకు ఆదాయం వస్తుంది. ఈ లెక్కన ఏడాదికి రూ.2.40లక్షల నుంచి రూ.3లక్షల వరకు ఆదాయం వస్తుంది. వరి కంటే కూరగాయల పంటలకు ఖర్చు తక్కువ.. ఆదాయం ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయ అధికారుల ప్రోత్సాహంతో నాలుగైదేళ్లుగా కూరగాయలు మాత్రమే పండిస్తున్నా.
కూరగాయలు మేలు
ఎకరాలో వరిపంట వేస్తే పెట్టుబడి, కూళ్లు, ఇతర ఖర్చులు పోను రూ.20 వేల ఆదాయం వస్తుంది. అదే కూరగాయలు సాగు చేస్తే పెట్టుబడి, కూళ్లతో పాటు అన్ని ఖర్చులు తీసేస్తే రూ.50వేల నుంచి రూ.60వేల వరకు ఆదాయం వస్తుంది. మార్కెట్లో కూరగాయల ధర తక్కువగా ఉన్న కూడా ఎకరాకు రూ.40వేలకు ఆదాయం కచ్చితంగా వస్తుంది. బెండ, గోరుచిక్కుడు, దోస, టమాట, వంగ పంటలు సాగు చేస్తే అధికంగా ప్రయోజనం ఉంటుంది. యాసంగిలో వరికి బదులు ఉద్యాన పంటలు వేయాలని అన్ని మండలాల్లో పర్యటించి రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. వీటితోపాటు ఆయిల్పామ్ వైపు దృష్టి సారించాలని కోరుతున్నా.