పోచమ్మమైదాన్, నవంబర్ 13 : తెలంగాణ పలుకుబడుల భాషకు పట్ట కట్టాలని నినదిస్తూ, ప్రజల్లో చైతన్యదీప్తిని వెలిగించి, జీవితాంతం వారి గొంతుకగా కాళోజీ సోదరులు జీవించారని కాళోజీ స్మారక పురస్కార గ్రహీత డాక్టర్ నలివెల భాస్కర్ అన్నారు. హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాలలో కాళోజీ సోదరుల యాది సభ నాగిళ్ల రామశాస్త్రి అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ స్మారక పురస్కారాన్ని అందుకున్న డాక్టర్ భాస్కర్ మాట్లాడుతూ ఓరుగల్లు నేల ఎంతో గొప్పదని, ఎందరో కవులకు జన్మనిచ్చిందన్నారు. వెన్నలాంటి హృదయం కలిగిన కాళోజీ సోదరులు ఇక్కడి వారు కావడం ఎంతో అదృష్టమన్నారు. బతుకు కమ్మదనాన్ని చెమ్మగిల్లిన కన్నులతో మాత్రమే చూడాలని కవి కాళోజీ నారాయణరావు అన్నారని గుర్తు చేశారు.
నా గొడవ పేరిట సమకాలిన సామాజిక సమస్యలపై నిర్మోహమాటంగా, నికచ్చితంగా, కటువుగా స్పందిస్తూ పాఠకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తి గడించిన కాళోజీ స్ఫూర్తిని ఈ తరం యవకులు అందిపుచ్చుకోవాలని సూచించారు. కాళోజీ సోదరులు తెలుగులో మాత్రమే కాదు ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీషు భాషల్లో కూడా రచనలు చేసి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారన్నారు. కాళోజీ సోదరులుగా అనగానే వద్దిరాజు సోదరులు, దాశరథి సోదరులు, శేషాద్రి సోదరులు గుర్తుకు వస్తారని, వీరందరూ నిస్వార్థంగా సేవ చేసి ప్రజల్లో స్థానం సంపాదించుకున్నారన్నారు. తాను కాళోజీ పురస్కారం తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాగా, కాళోజీ రచించిన కథలను సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అంపశయ్య నవీన్ ఇంగ్లీషులో అనువదించి, పుస్తకరూపంలోకి తీసుకురాగా, వాటిని వేదికపై ఆవిష్కరించారు. అలాగే, కాళోజీ రామేశ్వర్రావు స్మారక పురస్కారాన్ని డాక్టర్ జాహిద్ అలీఖాన్కు అందజేశారు. కార్యక్రమంలో వీఆర్ విద్యార్థి, పొట్లపల్లి శ్రీనివాసరావు, డాక్టర్ ఎన్వీఎన్ చారి, డాక్టర్ కొప్పుల మల్లేశం, తాజ్ ముష్తర్, డాక్టర్ పాండుల సాయిలు, గన్నమరాజు గిరిజామనోహరబాబు, రామా చంద్రమౌళి, అన్నవరం దేవేందర్, ఆగపాటి రాజ్కుమార్, తాడిచర్ల రవి, డాక్టర్ శ్యామల, డాక్టర్ సుజాత పాల్గొన్నారు.
పీవీ ఇంటిని మ్యూజియం చేయాలి
భీమదేవరపల్లి : మాజీ ప్రధాని దివంగత పీవీ నర్సింహారావు స్వగ్రామమైన వంగరలోని ఇంటిని మ్యూజియంగా అభివృద్ధి చేయాలని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నలిమెల భాస్కర్ అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన కవులతో కలిసి పీవీ ఇంటిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావి తరాలకు స్ఫూర్తి కలిగించే విధంగా పీవీ జీవన స్మృతులను భద్రపరచాలని కోరారు. ఆయనతో పాటు తెలంగాణ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్, కవులు అన్నవరం దేవేందర్, బూర్ల వెంకటేశ్వర్లు, కూకట్ల తిరుపతి, తెలంగాణ రచయితల వేదిక బాధ్యులు కందుకూరి అంజయ్య, సీవీ కుమార్, దామరకుంట శంకరయ్య, పెనుకొండ బసవేశ్వర్ ఉన్నారు.