హనుమకొండ, డిసెంబర్ 13 : కలప స్మగ్లర్లపై అటవీ శాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. అనుమతి లేకుండా కలప రవాణా చేయొద్దని ప్రభుత్వం, అటవీ శాఖ అధికారులు ఆదేశించినా పట్టించుకోవడం లేదు. కొందరు యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నారు. తాజాగా మంగళవారం హనుమకొండ సమ్మయ్యనగర్లోని ఓ వర్క్షాపులో వరంగల్ జిల్లా అటవీ శాఖ ఫ్లయింగ్ స్కాడ్ ఆకస్మిక తనిఖీ చేసింది. అక్రమంగా ఉన్న రూ.4.71లక్షల విలువ చేసే కర్ర, ఫర్నిచర్ను స్వాధీనం చేసుకుంది. ఫ్లయింగ్ స్వాడ్ డీఎఫ్వో ఎం నాగభూషణం తెలిపిన వివరాల ప్రకారం.. సమ్మయ్యనగర్లోని ఎం ప్రభాకర్ ఇంటి ఎదుట ఒక గుడిసె వేసి వర్క్షాపు నిర్వహిస్తున్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన చిప్ప సదానందం వద్ద నుంచి జిట్రేగు, టేకు కర్రను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నాడు. కలపను ఇక్కడకు తీసుకొచ్చి సైజులు కోసి, ఫర్నిచర్ చేసి అమ్ముతున్నాడు. స్వాధీనం చేసుకున్న కర్ర మొత్తం విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.10లక్షల నుంచి రూ.15లక్షల వరకు ఉంటుందని వివరించారు. ప్రభాకర్ ఎలాంటి అనుమతి, లైసెన్స్ లేకుండా కర్రను తరలిస్తూ వర్క్షాపును నడిపిస్తున్నాడని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో జిట్రేగు కలపపై నిషేధం ఉన్నా అక్రమంగా కొనుగోలు చేసి వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. జిట్రేగు, టేకు దుంగలు, సైజులతోపాటు ఫర్నిచర్ను స్వాధీనం చేసుకొని వర్క్షాపును సీజ్ చేశామని తెలిపారు. కేసు నమోదు చేయాలని హనుమకొండ డీఎఫ్వోకు ప్రతిపాదించినట్లు నాగభూషణం తెలిపారు. ఆయన వెంట ఎఫ్ఆర్వోలు ఎం.సందీప్, పీ.భిక్షపతి, డిప్యూటీ ఎఫ్ఆర్వోలు సురేశ్, వెంకట్రాం, ఏడుకొండలు, బీట్ ఆఫీసర్ రతన్ పాల్గొన్నారు.