కరీమాబాద్, డిసెంబర్ 10: గత ప్రభుత్వాల హయాంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఎస్ఆర్ఆర్తోటలో టీఆర్ఎస్ ప్రభుత్వం మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నది. కాలనీల్లో సీసీరోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణం చేపడుతూ అభివృద్ధే లక్ష్యంగా కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తున్నది. నగరంలోని ప్రతి కాలనీలో అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. దీంతో గుంతలమయంగా ఉన్న రోడ్లు ప్రస్తుతం అద్భుతంగా మారుతున్నాయి. వరంగల్ మహానగరపాలక సంస్థ పరిధిలోని అండర్ రైల్వేగేట్ ప్రాంతంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. వీటితోపాటు పలు పనులకు ప్రణాళికలు జరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ వేగవంతంగా చేపట్టాలని అధికారులకు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా వరంగల్ 32వ డివిజన్లోని ఎస్ఆర్ఆర్తోట అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నది. ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచని తమ కాలనీలో పనులు చేపట్టడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి కాలనీలో సీసీరోడ్ల నిర్మాణంతోపాటు డ్రైనేజీ పనులు చేపడుతూ ప్రజలకు పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించే దిశగా చర్యలు చేపట్టారు. పలుచోట్ల కమ్యూనిటీ భవనాలు, కల్వర్టుల నిర్మాణం చేపడుతూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తున్నది.
డివిజన్ అభివృద్ధే లక్ష్యంగా..
ప్రభుత్వ సహకారంతో డివిజన్లో అభివృద్ధి పనులు చేపట్టాం. సుమారు రూ. 2.5 కోట్లతో పనులకు శ్రీకారం చుట్టాం. ఎస్ఆర్ఆర్తోటలోని ప్రతి కాలనీలో రోడ్లు, మురుగు కాల్వలు, కల్వర్టుల నిర్మాణం చేపడుతున్నాం. నూతనంగా వెలుస్తున్న నిర్మాణాలకు అనుగుణంగా వసతులు కల్పిస్తున్నాం. ప్రభుత్వం అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ఏళ్ల తరబడిగా అభివృద్ధికి నోచని కాలనీల్లో ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టింది. ప్రభుత్వ చొరవతో డివిజన్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నాం.
– పల్లం పద్మ, 32వ డివిజన్ కార్పొరేటర్