వరంగల్ చౌరస్తా, నవంబర్ 26 : ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా గర్భస్థ శిశువు ఎదుగుదలను గుర్తించే టిఫా స్కానింగ్ యంత్రాలను ప్రసూతి వైద్యశాలల్లో ఏర్పాటు చేస్తున్నది. వరంగల్ సీకేఎం హాస్పిటల్కు సుమారు రూ.50లక్షల విలువైన రెండు టిఫా స్కానింగ్ యంత్రాలను అందజేసింది. శనివారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు నిర్వహించిన వర్చువల్ మీటింగ్లో యంత్రాలను ప్రారంభించారు. హాస్పిటల్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని యంత్రాలను అందించామని, వాటిని వినియోగించుకొని ప్రసూతి వైద్యసేవలను మరింత మెరుగు పరుచుకోవాలని సూచించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీకేఎం ఇన్చార్జి సూపరింటెండెంట్ పద్మ, డీఎంహెచ్వో వెంకటరమణ, ఆర్ఎంవో శ్యాంకుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అందించిన ఈ ఆధునిక యంత్ర పరికరం గర్భిణుల పాలిట భవిష్యవాణి అని అన్నారు. గర్భస్థ శిశువు శారీరక ఎదుగుదలను గుర్తించడానికి ఈ యంత్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. శారీరక లోపాలు, అవయవాల పనితీరును గమనించేందుకు ఈ యంత్రం ఉపయోగపడుతుందని చెప్పారు. కార్పొరేటర్ కల్పన పాల్గొన్నారు.