పోచమ్మమైదాన్, నవంబర్ 26: కేంద్రంలోని బీజేపీ సర్కార్ రాజ్యాంగ విలువలను విధ్వంసం చేసిందని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉద్యమించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. పోచమ్మమైదాన్లోని అబ్నూస్ ఫంక్షన్ హాల్లో సీపీఐ శిక్షణ తరగతుల ముగింపు సమావేశంలో శనివారం ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజ్యాంగ విలువలు పతనమవుతున్నట్లు తెలిపారు. ఈడీ, ఈసీ, సీబీఐ, ఐటీ వంటి స్వతంత్య్ర సంస్థలను మోదీ ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకుని ప్రతిపక్ష పార్టీల రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులపై దాడులు చేయిస్తున్నదని ధ్వజమెత్తారు.
రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ప్రధాని.. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రతిపక్ష ముక్తిభారత్ అనేలా వ్యవరిస్తున్నారని విమర్శించారు. ఇందులో భాగంగానే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎనిమిది రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేశారని ఆరోపించారు. అలాగే, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్తోపాటు తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ, షిండేలాంటి వారు పుట్టుకొస్తున్నారని ఎద్దేవా చేశారు. తమ మాట వినని రాష్ట్ర ప్రభుత్వాలపై గవర్నర్ల వ్యవస్థ ద్వారా పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తుందని ధ్వజమెత్తారు. గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని కోరుతూ డిసెంబర్ 7న సీపీఐ ఆధ్వర్యంలో చలో రాజ్భవన్ కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించారు. సమావేశంలో పార్టీ నాయకులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, మేకల రవి, షేక్బాషామియా, పనాస ప్రసాద్, దండు లక్ష్మణ్, గుండె బద్రి, రహేలా, జన్ను రవి, సండ్ర కుమార్, శనిగరపు దేవరాజు, మంద ఐలయ్య పాల్గొన్నారు.