పోచమ్మమైదాన్, నవంబర్ 26: ఓటరు నమోదు కార్యక్రమం ఊరూరా ముమ్మరంగా కొనసాగుతున్నది. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరై యువత ఓటుహక్కు పొందాలని కోరారు. జాబితాలో తప్పులు ఉంటే స్పెషల్ క్యాంపెయిన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శనివారం వరంగల్ పోచమ్మమైదాన్లోని ఎస్ఆర్ కళాశాలలో ఉన్న పోలింగ్ స్టేషన్ను ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, గ్రేటర్ వరంగల్ మహానగరపాలక సంస్థ కమిషనర్ ప్రావీణ్య సందర్శించారు. ఆదివారంతోపాటు డిసెంబర్ 3, 4వ తేదీల్లో కూడా స్పెషల్ క్యాంపెయిన్ ఉంటుందని ఆమె తెలిపారు. ఓటర్లకు సంబంధించిన ఇంటిపేరు, చిరునామా, ఇతర సమస్యలు పరిష్కారమయ్యేలా నమోదు ఫారాలను పూర్తి చేయించాలని అధికారులకుసూచించారు. ఈ విషయంలో ఓటర్లను అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో వరంగల్ తహసీల్దార్ సత్యపాల్రెడ్డి, ఎలక్షన్ డీటీ రవి, ఆర్ఐ జలపతిరెడ్డి, బీఎల్వోలు పాల్గొన్నారు. కాగా, వరంగల్ తూర్పులో 215, వరంగల్ మండలంలో 114 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి.
ఓటరు నమోదును వినియోగించుకోవాలి
ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటరు నమోదు కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ఖానాపురం తహసీల్దార్ జూలూరి సుభాషిణి కోరారు. ఖానాపురం, బుధరావుపేట, మంగళవారిపేటలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టిందని, అర్హులు వినియోగించుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని తెలిపారు. కార్యక్రమంలో డీటీ సృజన్కుమార్, ఆర్ఐ సత్యనారాయణ, వీఆర్ఏలు పాల్గొన్నారు. అలాగే, నల్లబెల్లి మండలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో బూత్ లెవల్ అధికారులు చేపట్టిన ఓటరు నమోదు ప్రక్రియను తహసీల్దార్ దూలం మంజుల పరిశీలించారు. మండలంలోని 29 గ్రామాల్లో ఉన్న యువతీ యువకులు కొత్తగా ఓటుహక్కు పొందాలని, మార్పులు చేర్పులు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ఐ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
చెన్నారావుపేట మండలంలో ఓటరు నమోదు ప్రక్రియను తహసీల్దార్ భన్సీలాల్ పరిశీలించారు. చెన్నారావుపేట, లింగగిరి, ఖాదర్పేటలో పర్యటించి మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవాని సూచించారు. కార్యక్రమంలో ఖాదర్పేట సర్పంచ్ కుమారస్వామి, ఆర్ఐ స్వామి, చెన్నారావుపేట వీఆర్ఏలు కృష్ణ ప్రసాద్, శోభ, రాజశేఖర్ పాల్గొన్నారు. నర్సంపేట మండలంలోని పోలింగ్ కేంద్రాల వద్ద బూత్ లెవల్ అధికారులు ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాలను డీటీ ఉమారాణి, ఆర్ఐ రజాక్, జూనియర్ అసిస్టెంట్ పెండ్లి రంజిత్కుమార్రెడ్డి పరిశీలించారు. గీసుగొండ మండలం మరియపురంలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని తహసీల్దార్ విశ్వనారాయణ ప్రారంభించారు. సర్పంచ్ అల్లం బాలిరెడ్డి, కార్యదర్శి స్వప్న పాల్గొన్నారు. నెక్కొండ తహసీల్దార్ డీఎస్ వెంకన్న అలంకానిపేటలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. అలాగే, ఆయన ట్రాన్స్కో ఏఈ భవన నిర్మాణ కోసం అవసరమైన ప్రభుత్వ స్థలాన్ని సర్పంచ్ మాదాసు అనంతలక్ష్మీ రవితో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుంటుక నర్సయ్య, కార్యదర్శి మధు పాల్గొన్నారు.