హనుమకొండ చౌరస్తా, నవంబర్ 14: ప్రో కబడ్డీ తరహాలో మార్చి నుంచి ప్రో ఖోఖో లీగ్ మ్యాచ్లు ప్రారంభించనున్నట్లు ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి మహేంద్రసింగ్ త్యాగి అన్నారు. వరంగల్ జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండ జేఎన్ఎస్లో మూడు రోజుల పాటు జరిగిన 30వ సీనియర్ సౌత్జోన్ జాతీయస్థాయి ఖోఖో చాంపియన్షిప్ ఆదివారం ముగిసింది. పోటీల్లో పురుషుల విభాగంలో కేరళ, మహిళల విభాగంలో కర్ణాటక జట్టు చాంపియన్షిప్ సొంతం చేసుకోగా, తెలంగాణ జట్టు క్రీడాకారులు ప్రతిభ చూపి మూడో స్థానంలో నిలిచారు.
టెక్నిక్స్తో ఆడితే మంచి భవిష్యత్
క్రీడాకారులు ప్రతి మ్యాచ్లో అత్యంత ప్రతిభ ప్రదర్శించారని క్రమశిక్షణ, టెక్నిక్స్తో ఆడితే మంచి భవిష్యత్ ఉంటుందని మహేంద్రసింగ్ త్యాగి అన్నారు. ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వివిధ రాష్ర్టాల క్రీడాకారులు జట్టు గెలుపు కోసం చివరి దాకా పోరాడారని ప్రశంసించారు. క్రీడాకారులకు కోచ్లు వెన్నెముకగా నిలుస్తున్నారని, రూల్స్ను పాటిస్తూ వారికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం మార్పులకనుగుణంగా క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటూ ప్రతిభ చాటి తమ రాష్ర్టాలకు పేరుప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. సాధించిన పతకాలను, క్రీడాకారుల ప్రతిభను వాట్సాప్ లాంటి సోషల్ మీడియాల్లో పోస్టు చేసి ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలువాలన్నారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినందుకు వరంగల్ జిల్లా ఖోఖో అసోసియేషన్ను త్యాగి అభినందించారు. అనంతరం విజేతలకు ట్రోఫీతో పాటు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా, రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, కార్యదర్శి తోట శ్యాంప్రసాద్, ఖోఖో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కోట్ల రామకృష్ణ, హ్యాండ్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్కుమార్, తమిళనాడు ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి నెల్సన్ సామిల్, సౌత్జోన్ ఖోఖో కమిటీ చైర్మన్ ఎం.సీతారామిరెడ్డి, నల్లగొండ కార్యదర్శి ఎన్.కృష్ణమూర్తి, సంయుక్త కార్యదర్శి మహమ్మద్ అతికుల్లా, ఉపాధ్యక్షుడు కత్తి కుమారస్వామి, ఖమ్మం అధ్యక్షుడు పి.రామయ్య, నిజామాబాద్ కార్యదర్శి జి.సాగర్రెడ్డి, వీర రాఘవయ్య, వరంగల్ జిల్లా ఖోఖో అసోసియేషన్ కోశాధికారి బన్న విజయ్కుమార్, హ్యాండ్బాల్ కోచ్ బొడ్డు విష్ణువర్ధన్ పాల్గొన్నారు.
విజేతలుగా నిలిచిన కేరళ, కర్ణాటక
30వ సీనియర్ సౌత్జోన్ జాతీయస్థాయి ఖోఖో చాంపియన్షిప్ హోరాహోరీగా కొనసాగింది. పురుషుల విభాగంలో కేరళ జట్టు విజేతగా నిలిచింది. 2వ స్థానంలో కర్ణాటక, 3వ స్థానంలో తెలంగాణ, 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ జట్టు నిలిచింది. మహిళల విభాగంలో కర్ణాటక జట్టు మొదటిస్థానంలో నిలువగా, 2వ స్థానంలో కేరళ, మూడోస్థానంలో తమిళనాడు, 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ జట్టు నిలిచింది. కాగా పురుషుల విభాగంలో తెలంగాణ జట్టు మూడోస్థానంలో నిలువడం విశేషం. ఇందులో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫెడరేషన్ కప్లో పాల్గొంటాయని నిర్వాహకులు తెలిపారు.