శ్రీరాంపూర్, నవంబర్ 1 : సింగరేణి గనుల రక్షణకే కార్మిక సంఘాలు ఐక్య పోరాటాలకు దిగాయని ఆయా సంఘాల నాయకులు స్పష్టం చేశారు. శ్రీరాంపూర్ ఆర్కే-6 గనిపై బుధవారం సింగరేణి కార్మిక సంఘాల నాయకులు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారు. కార్మికులు సమ్మెకు సన్నద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్, ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్ప్రసాద్, ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి ముస్కె సమ్మయ్య, హెచ్ఎంఎస్ ఉపాధ్యక్షుడు జీవన్జోయెల్, సీఐటీయూ అధ్యక్షడు రాజిరెడ్డి, బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య పాల్గొని మాట్లాడారు. వివిధ పార్టీలు, కార్మిక సంఘాలు సింగరేణి సంస్థ పరిరక్షణకు, కార్మికుల హక్కుల సాధనకు ఐక్య పోరాటాలకు నిర్ణయించాయన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్మిక వ్యతిరేక విధానాలు, పారిశ్రామిక వ్యతిరేక నిర్ణయాలు, గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణిలో ఈ నెల 9 నుంచి 11 వరకు 72 గంటల సమ్మెకు పిలుపునిచ్చినట్లు చెప్పారు. కోలిండియా యాజమాన్యం ఈ నెల 13న సింగరేణి సంస్థకు ఇవ్వాల్సిన 4 బొగ్గు బ్లాకులను వేలం వేయాలని తీసుకున్న నిర్ణయాన్ని కార్మిక సంఘాలన్నీ ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాయని పేర్కొన్నారు. బొగ్గు పరిశ్రమను నిర్వీర్యం చేసేందుకు దేశంలోని 88 గనులను ప్రైవేట్ బహుళజాతి సంస్థలకు ఇవ్వాలని కేంద్రం కుట్ర చేస్తున్నదన్నారు. వెంటనే గనుల ప్రైవేటీకరణ, వేలం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థ 2015 నుంచి బొగ్గు అన్వేషణ విభాగం రూ.750 కోట్లు ఖర్చు చేసి 14 గనుల నిక్షేపాలు కనుగొన్నదన్నారు. వేలం వేయాలనుకునే బ్లాకులకు కూడా సంస్థ రూ.70 కోట్లు ఖర్చు చేసి, అన్ని అనుమతులు కోరిందని తెలిపారు. సింగరేణిలో 12 డిమాండ్లతో సమ్మె నోటీసు ఇచ్చినట్లు వెల్లడించారు. సింగరేణిలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. సింగరేణిలో పనిచేస్తున్న 30 వేల మంది కార్మికులకు కేంద్ర హైపవర్ కమిటీ సూచన మేరకు వేతన ఒప్పందం అమలు చేయాలని, ఇప్పటికే సుప్రీంకోర్టు వేతనాలు ఇవ్వాలని ఆదేశించినా సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నదని ఆరోపించారు. వెంటనే కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు చెల్లించాలని కోరారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ కేంద్ర ఉపాధ్యక్షుడు అన్నయ్య, మల్లారెడ్డి, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు కే సురేందర్రెడ్డి, కేంద్ర చర్చల ప్రతినిధులు ఏనుగు రవీందర్రెడ్డి, వీరభద్రయ్య, ఏఐటీయూసీ కార్యదర్శి ఎం కొమురయ్య, చంద్రమోహన్, ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు జే శంకర్రావు, ప్రధాన కార్యదర్శి సమ్మయ్య, హెచ్ఎంఎస్ కార్యదర్శి గోళ్ల సత్యనారాయణ, బీఎంఎస్ ఉపాధ్యక్షుడు పేరం రమేశ్, సీఐటీయూ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు భాగ్యరాజ్, చంద్రశేఖర్, టీబీజీకేఎస్ ఏరియా చర్చల ప్రతినిధి వెంగళ కుమారాస్వామి, బ్రాంచ్ కార్యదర్శి పానగంటి సత్తయ్య, పిట్ కార్యదర్శి చిలుమల రాయమల్లు పాల్గొన్నారు.
72 గంటల సమ్మెలో పాల్గొనండి..
సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని వ్యతిరేకిస్తూ 9వ తేదీ నుంచి 72 గంటల సమ్మెలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి విప్లవ కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. విప్లవ కార్మిక సంఘాలు ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు టీ శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి ఈ నరేశ్, ఉపాధ్యక్షుడు బ్రహ్మానందం, ఏఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకుడు జీ రాములు, జీఎల్బీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి మేకల రాములు, తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీరటి రాజన్న విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సింగరేణి గనులు సంస్థకు అప్పగించేంత వరకు కార్మిక సంఘాలు నిరవదిక సమ్మె కొనసాగించాలని కోరారు. తాము కూడా సమ్మె నోటీసు ఇచ్చామని చెప్పారు. సింగరేణి కార్మిక సంఘాలు ఇప్పటికైనా ఏకతాటిపైకి వచ్చి పోరాడడం కార్మిక వర్గానికి మంచిదన్నారు. విడివిడిగా సమ్మె నోటీసు ఇచ్చారని, ఒకే వేదికగా ఇవ్వాలని కోరారు. కార్మిక సంఘాలు ఐక్యం పోరాడాలని కోరారు.
టీబీజీకేఎస్ గేట్ మీటింగ్..
కాసిపేట, డిసెంబర్ 1 : మందమర్రి ఏరియాలోని కాసిపేట గనిపై టీబీజీకేఎస్ గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్ మాట్లాడారు. కేంద్రానికి వ్యతిరేకంగా కార్మికులంతా సమ్మెకు సిద్ధంకావాలని పిలుపునిచ్చారు. 9, 10, 11వ తేదీల్లో రోజుల పాటు సాగే సమ్మెలో ప్రతి కార్మికుడూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమ్మెకు మద్దతు తెలిపిన మిగతా కార్మిక సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు. టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి దుగుట శ్రీనివాస్, ఏరియా కార్యదర్శి వొడ్నాల రాజన్న, మేడ సమ్మయ్య, బైరి శంకర్, అఫ్జలుద్దీన్, రమేశ్, బానాత్ తిరుపతి, సొల్లంగి శ్రీనివాస్ పాల్గొన్నారు.
గనులపై కరపత్రాల ఆవిష్కరణ..
మణుగూరు రూరల్, డిసెంబర్ 1 : గనుల వేలంపై సమ్మెకు సంబంధించి మణుగూరు ఏరియాలోని అన్ని గనుల్లో కార్మికులకు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు వీ ప్రభాకర్రావు మాట్లాడారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు డిసెంబర్ 9 నుంచి టీబీజీకేఎస్ నిరవదిక సమ్మె చేపట్టిందని, కార్మికులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రైవేటీకరణ వల్ల కార్మికలోకానికి కలిగే నష్టాలను వివరించారు. లెవన్మెన్ కమిటీ సభ్యుడు సామా శ్రీనివాసరెడ్డి, నాయకులు అబ్దుల్ రవూఫ్, వీరభద్రయ్య, కోట శ్రీనివాసరావు, కాపా శివాజీ, వర్మ, సీహెచ్ వెంకటేశ్వరరెడ్డి, బానోత్ కృష్ణ, బుర్ర వెంకటేశ్వర్లు, అశోక్, అన్ని గనుల డిపార్ట్మెంట్ల పిట్ సెక్రటరీలు, పిట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
సమ్మె కరపత్రాల విడుదల..
రామవరం, డిసెంబర్ 1 : కొత్తగూడెం ఏరియా వర్క్షాప్లో సమ్మెకు సంబంధించిన కరపత్రాలను టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు ఎండీ రజాక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనేక పరిశ్రమలను కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు ధారాదత్తం చేస్తూ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పిట్ సెక్రటరీ ఎండీ సత్తార్పాషా, సెంట్రల్ కమిటీ మెంబర్ పొదిల శ్రీనివాసరావు, నాయకులు సంపత్, జయరాజ్, సంజయ్, బాబుద్దీన్, కేవీ రెడ్డి, రాజ్కుమార్, గోపాల్, ఐమన్స్, ఆదార్, ఖాజాపాషా, కే కుమార్, సముద్రాల శ్రీనివాస్, స్వామి, పద్మావతి, కిరణ్, రూపట్, సత్యనారాయణ, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
గోదావరిఖని, డిసెంబర్ 1 : బొగ్గు గనుల వేలాన్ని నిరసిస్తూ చేపట్టనున్న సమ్మెను విజయవంతం చేయాలని సింగరేణి ఐక్య గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం ఏ గౌస్ పిలుపునిచ్చారు. గోదావరిఖనిలోని ఆ సంఘ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సమ్మె పోరాటానికి సంఘటిత, అసంఘటిత కార్మికులు, ప్రజా సంఘాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.