కరీమాబాద్ : ఉత్తమ విద్యాబోధనతో నవోదయ విద్యాసంస్థలు ముందుంటే నవోదయ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులతో పాటు ఉన్నత స్థానాల్లో ఉంటారు. అందుకే నవోదయ విద్యాలయాల్లో విద్యను అభ్యసించాలని చాలా మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుకుంటారు. దరఖాస్తులు చేసుకున్న నాటి నుంచి పరీక్ష రాసే సమయం వరకు ప్రత్యేక శిక్షణ సైతం తీసుకుని పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటారు. నవోదయ విద్యాలయంలో సీటు వస్తే విద్యార్థుల భవిష్యత్కు డొక ఉండదని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిభకు పట్టం కడుతూ ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు నవోదయ విద్యాలయాల విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నాయి. అందులో భాగంగా మామునూరులోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతి ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానించింది. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి నవంబర్ 30వరకు గడువు ఉండటంతో విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు నవోదయ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
నవంబర్ 30వరకు అవకాశం
2022-23 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 30 వరకు అవకాశం కలదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 80మంది విద్యార్థులకు నవోదయ విద్యాలయంలో సీట్లు ఉన్నాయి. దరఖాస్తు చేయు విద్యార్థులు www.navodaya.gov.in వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలి. 30 ఏప్రిల్ 2022లో పరీక్షను నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేస్తారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను బట్టి సెంటర్లను ఏర్పాటు చేస్తారు. దరఖాస్తులు చేసుకునే సమయంలో బ్లాక్లు, మండలాలు ఇతరత్రా సమాచారం తప్పులు లేకుండా చేసుకోవాలి.
75శాతం గ్రామీణం.. 25శాతం ఓపెన్ కోటా
నవోదయ విద్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థులకు 80సీట్లు ఉన్నాయి. అందులో 75శాతం గ్రామీణ విద్యార్థులకు, 25శాతం ఓపెన్ కోటా కింద కేటాయిస్తారు. అందులో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా 33శాతం బాలికలకు, ఓబీసీకి 25శాతం, ఎస్సీ 15 శాతం, ఎస్టీ 7.5శాతం, వికలాంగులకు 3శాతం రిజర్వేషన్ వర్తిస్తుందని అధికారులు తెలిపారు.
ఉమ్మడి జిల్లాను 15 బ్లాకులుగా విభజన
ఉమ్మడి వరంగల్ జిల్లాను 5 బ్లాకులుగా విభజించారు. బ్లాకుల వారిగా మండలాలను సైతం కేటాయించారు.
6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యాబోధన..
పరీక్షలు ఉత్తమ ప్రతిభను కనబరిచి సీటు సాదించిన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్యను అందించి ఆశ్రయం కల్పిస్తారు. ఉన్నత విలువలతో కూడిన విద్యను బోధిస్తారు. సీబీఎస్సీ సిలబస్ ఆధారంగా బోధన ఉంటుంది. ఉత్తమ విద్యాబోధనలతో పాటు క్రీడలు, సాంస్కృతిక, ఇతర అన్ని రంగాల్లో శిక్షణను ఇస్తారు. నవోదయ విద్యాలయంలో విద్యను అభ్యసించిన విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు.
నవోదయలో ఉజ్వల భవిష్యత్.. పూర్ణిమ, ప్రిన్సిపాల్
ప్రతి ఏటా వచ్చే వారితో పాటు ఉన్న విద్యార్థులకు జవహర్ నవోదయ విద్యాలయం ద్వారా ఉజ్వల భవిష్యత్ అందించడమే లక్ష్యం. క్రమశిక్షణతో ఉండేలా బోధన ఉంటుంది. ప్రభుత్వ సహకారంతో మెరుగైన విద్య, నాణ్యమైన భోజనం, పూర్తిస్థాయి వసతులు కల్పిస్తున్నాము. విద్యతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాము. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 80సీట్లు ఉన్నాయి. నవంబర్ 30 వరకు దరఖాస్తులకు గడవు కలదు. విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే సమయంలో ప్రతి విషయాన్ని గమనించాలి. తప్పులు లేకుండా దరఖాస్తు నింపాలి.