ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్ ఉమ్మడి జిల్లాకు అత్యధిక ప్రాధాన్యం లభించింది. ఏకంగా ముగ్గురు నేతలకు అవకాశం దక్కడంతో పార్టీ శ్రేణుల్లో నయా జోష్ నెలకొంది. ఉమ్మడి జిల్లాకు చెందిన సీనియర్ నేతలు కడియం శ్రీహరి, బండా ప్రకాశ్, తక్కళ్లపల్లి రవీందర్రావులకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఓరుగల్లుపై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. వీరు మంగళవారం నామినేషన్లు దాఖలు చేయగా, అసెంబ్లీలో టీఆర్ఎస్కు ఉన్న సంఖ్యాబలంతో ఏకగ్రీవంగా ఎన్నికవనున్నారు. తెలంగాణ ఉద్యమంలో, టీఆర్ఎస్ ప్రస్థానంలో మొదటి నుంచీ అండగా నిలిచిన ఓరుగల్లుకు రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాజకీయ పదవుల్లో పెద్దపీట వేస్తున్నారన్న విషయం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుతో మరోమారు స్పష్టమైంది.
వరంగల్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పెద్దల సభలో ఓరుగల్లుకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారు. ఎమెల్యే కోటా ఎమ్మెల్సీ పదవుల్లో ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురికి అవకాశం కల్పించారు. సీనియర్ నేతలు కడియం శ్రీహరి, బండా ప్రకాశ్, తక్కళ్లపల్లి రవీందర్రావు మంగళవారం అసెంబ్లీలో నామినేషన్ వేశారు. వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుండగా ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీల సంఖ్య భారీగా పెరిగినట్లయింది. తాజాగా ప్రకటించిన వారితో కలిపి ఈ సంఖ్య ఏడుకు చేరింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా బస్వరాజు సారయ్య ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరంగల్-నల్లగొండ-ఖమ్మం జిల్లా గ్రాడ్యుయేట్స్ ఎమ్మె ల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి వరంగల్ జిల్లాకు చెందినవారే కావడం గమనార్హం. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి ఉన్నారు. తాజాగా కడియం శ్రీహరి, బండా ప్రకాశ్, తక్కళ్లపల్లి రవీందర్రావు ఈ జాబితాలో చేరారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ ఏడాది జూన్ వరకు ఎమ్మెల్సీగా ఉన్నారు. కరోనా కారణంగా ఎన్నిక సకాలంలో జరుగలేదు. ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్ఎస్ అధిష్టానం కడియం శ్రీహరికి మరోసారి అవకాశం ఇచ్చింది. 2003 నుంచి టీఆర్ఎస్లో కీలకంగా పని చేసిన తక్కళ్లపల్లి రవీందర్రావుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తుతం చట్టసభలో అవకాశం కల్పించారు. వరంగల్ ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా.. తెలంగాణ ఉద్యమంలో, టీఆర్ఎస్ ఎన్నికల్లో రవీందర్రావు కీలకంగా పని చేశారు. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన బండా ప్రకాశ్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. రాష్ట్రం లో సమీకరణల నేపథ్యంలో బండా ప్రకాశ్కు ఎమ్మెల్సీ గా అవకాశం కల్పించారు.
అభినందనల వెల్లువ
వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అవకాశం పొందిన వారిని మంత్రి సత్యవతిరాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, బానోత్ శంకర్నాయక్, నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్రెడ్డి అసెంబ్లీ ఆవరణలో అభినందించారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన ఉమ్మడి జిల్లా నేతలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అభినందనలు తెలిపారు. వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించడంపై టీఆర్ఎస్ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.