వరంగల్, నవంబర్ 9(నమస్తేతెలంగాణ):జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల తీరుపై నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సహా పలువురు జడ్పీటీసీలు నిరసన వ్యక్తం చేశారు. విధుల నిర్వహణ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డా రు. జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలకు గైర్హాజరైన అధికారులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ స్థాయీ సంఘాల సమావేశాలు జరిగాయి. వేరువేరుగా కొనసాగిన ఒకటి నుంచి ఏడో స్థాయీ సంఘం సమావేశాలకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ఎ శ్రీనివాస్, జడ్పీలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, పర్వతగిరి, వర్ధన్నపేట, సంగెం, చెన్నారావుపేట మండలాల జడ్పీటీసీలు సింగ్లాల్, భిక్షపతి, సుదర్శన్రెడ్డి, పత్తినాయక్ తదితర జడ్పీటీసీలు హాజరయ్యారు. జడ్పీ సీఈవో రాజారావు, డీపీవో ప్రభాకర్, డీఎంహెచ్వోలు వెంకటరమణ, లలితాదేవి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ భాస్కర్రావుతో పాటు పంచాయతీరాజ్, జలవనరుల శాఖ, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ విభాగాల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కీలకమైన కొన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు సమావేశాలకు హాజరు కాకపోవడంపై ఎమ్మెల్యే సహా జడ్పీటీసీలు గరమ య్యారు. నియోజకవర్గంలోని మండలాలు ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలో ఉన్నందున ఐటీడీఏ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులపై చర్చించేందుకు స్థాయీ సంఘ సమావేశాలకు ఐటీడీఏ అధికారులనూ ఆహ్వానించాలని ఎమ్మెల్యే పెద్ది అన్నారు. నర్సంపేటలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులకు కాంట్రాక్టర్ ఏండ్లు గడుస్తున్నా పనులు మొదలుపెట్టనందున అతడి టెండర్ను టర్మినేట్ చేయటంలో అధికారుల నిర్లక్ష్యంపై పెద్ది ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలతో నర్సంపేట నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతు చేయాలని ఎమ్మెల్యే పెద్ది పేర్కొన్నారు. ప్రధానంగా చింతనెక్కొండ చెరువు కట్టపై ఉన్న రోడ్డును పదిరోజుల్లో రిపేర్ చేయాలన్నారు. బ్లడ్ గ్రూప్ మ్యాపింగ్ కోసం నర్సంపేట నియోజకవర్గంలో టెస్టులు నిర్వహించాలని, ఇందుకోసం పదివేల మంది డోనర్ల పేర్లతో జాబితా అందజేస్తామని పెద్ది డీఎంహెచ్వో వెంకటరమణకు చెప్పారు.
మాదన్నపేట పనులపై అసంతృప్తి
నర్సంపేటలోని మాదన్నపేట చెరువు పునరుద్ధరణ పనులపై ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ ఒక లీడరని, ప్రభుత్వం రూ.7కోట్లకుపైగా కేటాయిస్తే కాంట్రాక్టర్ లాభదాయకమైన పనులు చేసి సీసీ వంటి పనులను వదిలేశాడని అన్నారు. అతడికి అధికారులు రూ.5 కోట్ల చెల్లింపులు జరిపి పనులను క్లోజ్ చేశారని మండిపడ్డారు. పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోకుండా క్లోజ్ చేయటం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై విచారణకు ప్రభుత్వాన్ని కోరామని, విచారణలో అధికారులు వాస్తవాలను పేర్కొనాలన్నారు. ట్యాంక్బండ్ నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించిందని ఎమ్మెల్యే తెలిపారు. జలవనరుల శాఖ అధికారులు చెరువులు, కాల్వల మరమ్మతులకు ఉపాధి హామీ నిధులను వినియోగించాలని, ఈ విషయంలో సమన్వయంతో ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. నర్సంపేట నియోజకవర్గంలో చేపట్టిన పది చెక్డ్యాంల నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. వర్ధన్నపేట జడ్పీటీసీ భిక్షపతి మాట్లాడుతూ ఎస్సారెస్పీ కెనాల్ నుంచి నల్లబెల్లి చెరువులోకి నీరు సరఫరా చేసే పనులు ఏండ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.స్థలాలు సిద్ధంగా ఉన్నందున నర్సంపేట, గురిజాల, కన్నారావుపేటలో నూతన సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే పెద్ది ఎన్పీడీసీఎల్ అధికారులను ఆదేశించారు. కొనాయిమాకుల ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో జాప్యంపైనా ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సహా జడ్పీటీసీలు అభివృద్ధి పనులపై సమీక్షించారు.