యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం తేల్చి చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులను అప్రమత్తం చేసింది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఇతర పంటలు వేయాలని సూచించింది. దీంతో జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో రైతులు ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. వరికి బదులు వ్యవసాయ శాఖ సూచనలకు అనుగుణంగా కందులు, పెసర, మినుములు తదితర దినుసుల సాగువైపు మొగ్గుచూపుతున్నారు.
ప్రభుత్వం మాట సద్దన్నం మూట
యాసంగిలో దొడ్డొడ్లు కేంద్రం కొనడం లేదని రాష్ట్రప్రభుత్వం చెప్పింది. దీంతో వేరే పంటలు వేయాలంది. ప్రభుత్వం మాట సద్దన్నం మూట. సర్కారు చెప్పింది వినకుంటే చేతులు కాల్చుకోవాల్సి వస్తుంది. మేం ఇద్దరం అన్నదమ్ములకు 4 ఎకరాల పొలం ఉంది. ఏటా రెండు పంటలు వరి సాగు చేస్తాం. ఇప్పుడు నాలుగెకరాల్లో రెండెకరాలు సోయాచిక్కుడు, మరో రెండెకరాలు పల్లికాయ వేశాం. సోయాచిక్కుడు సీడ్ పండించి తిరిగి కంపెనీకే ఇవ్వాలనే అగ్రిమెంట్. క్వింటాల్కు రూ 8వేలు ఇస్తామన్నారు.
అంతా పల్లికాయనే..
వరి వేస్తే కొనేదిలేదని కేంద్రం తేల్చిచెప్పడం, కేసీఆర్ అదేవిషయం పలు మార్లు తెలిపారు. దీంతో రైతులు తిండి మందం వరి సాగు చూసి మిగతా పొలంలో వేరుశనగ సాగు చేస్తున్నారు. ధర్మాపురం పరిసర తండాల్లో వందలాది ఎకరాల్లో వేరుశనగ ఇప్పటికే సాగు చేశారు. వరి విస్తీర్ణం సగానికి సగం తగ్గింది. మన మంచి కోరే ప్రభుత్వం చెబుతుందని రైతులు అంటున్నారు. నేను యాసంగిలో ఐదెకరాలు నాటు పెట్టేది. 2 ఎకరాలకు కుదించి 8 ఎకరాల్లో వేరుశనగ పంట వేశా. వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి వరి వద్దని నచ్చచెబుతున్నారు.
-వాంకుడోతు నర్సింహానాయక్, రైతు, మాల్యాతండా
20 శాతం మంది రైతులు మారిండ్రు
తెలంగాణ ప్రభుత్వ సూచనల మేరకు ఇప్పటికే 20 శాతం మంది రైతులు వరికి బదులు ఇతర పంటలు వేస్తున్నారు. ధాన్యం కొనకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుందని రైతులకు అర్థమైంది. కడవెండి క్లస్టర్ పరధిలో గిరిజనులంతా పల్లి, కూరగాయలు సాగుచేస్తున్నారు. ఇతర గ్రామాల రైతులు పెసర్లు, కందులు, మినుములు, ఉలువలు, సోయాచిక్కుడు, కూరగాయలు వేయడానికి ఇష్టపడుతున్నారు. రైతుల్లో అవగాహన పెరిగింది. గత్యంతరం లేకపోతేనే వరి సాగు చేస్తున్నారు.