ముంబై, మార్చి 2: రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం తీవ్రతరం కావడంతో మార్కెట్ వరుస రెండ్రోజుల లాభాలకు బుధవారం చెక్పడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 778 పాయింట్లు క్షీణించి 55,469 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచి 1,200 పాయింట్ల వరకూ నష్టపోయినప్పటికీ, ముగింపులో నష్టాల నుంచి కొంతవరకూ కోలుకున్నది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 189 పాయింట్ల తగ్గుదలతో 16,606 పాయింట్ల వద్ద నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారత జీడీపీ అంచనాల కంటే తక్కువగా నమోదు కావడం, రూపాయి విలువ భారీగా క్షీణించడం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీసిందని విశ్లేషకులు తెలిపారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్, ఇతర పెద్ద నగరాల్లో పోరు తీవ్రతరంఅవగా, రష్యా విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. రష్యా ఆర్థిక స్థితిని బలహీనపర్చేందుకు మరిన్ని చర్యల్ని తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు బిడెన్ హెచ్చరించారు. డాలరుతో రూపాయి మారకపు విలువ 38 పైసలు తగ్గి 75.71 స్థాయికి పడిపోయింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 6 శాతం అధికమై 111 డాలర్ల వద్దకు పెరిగింది. ఫిబ్రవరిలో విదేశీ ఇన్వెస్టర్లు భారత్ మార్కెట్ నుంచి 9 బిలియన్ డాలర్లకుపైగా వెనక్కు తీసుకున్నారు.
సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా మారుతి సుజుకి 6 శాతం క్షీణించింది. ఫిబ్రవరి నెలలో ఈ కంపెనీ అమ్మకాలు, ఉత్పత్తి మందగించడంతో ఇన్వెస్టర్లు మారుతి షేర్లను భారీగా విక్రయించారు. ఇతర ఆటోమొబైల్ షేర్లపై సైతం ఈ ప్రభావం పడింది. డాక్టర్ రెడ్డీస్, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ ద్వయం 5 శాతం వరకూ తగ్గాయి. మరోవైపు టాటా స్టీల్, టైటాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, నెస్లే ఇండియా, యాక్సిస్ బ్యాంక్లు 5.54 శాతం వరకూ లాభపడ్డాయి. ఈ ఒక్కరోజే రూ.87 వేల కోట్ల సంపద కరిగిపోయింది.