బీజింగ్: చైనా, తైవాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. తైవాన్ అధ్యక్షురాలు త్సాయి యింగ్ వెన్ అమెరికా పర్యటనతో ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. వెన్ పర్యటనపై ఆగ్రహంతో ఉన్న చైనా.. శనివారం తైవాన్ వైపుగా ఎనిమిది యుద్ధ నౌకలు, దాదాపు 70 ఫైటర్ జెట్లను మోహరించింది. వీటిలో 45 ఫైటర్ జెట్లు చైనా, తైవాన్ను విడదీసే జలసంధిలోని మీడియన్ లైన్ను దాటి వచ్చాయని తైవాన్ రక్షణ శాఖ వెల్లడించింది.
మూడు రోజుల పాటు జరిగే యుద్ధ సన్నాహక విన్యాసాలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయని చైనా మిలటరీ ప్రకటించింది. అదేవిధంగా తైవాన్కు సరిగ్గా ఎదురుగా ఉండే ఫుజియాన్ ప్రావిన్స్లోని లుయోయువాన్ బేలో లైవ్ ఫైర్ ట్రైనింగ్(సైనికులకు యుద్ధ సన్నాహక శిక్షణ) నిర్వహించాలని చైనా నేవీ నిర్ణయించింది. అవసరమైతే తైవాన్ను బలవంతంగానైనా తమ దేశంలో కలిపేసుకొంటామని చైనా చెబుతున్న విషయం తెలిసిందే. తైవాన్ను కొన్ని విదేశీ శక్తులు ఎగదోస్తున్నాయని, ఇది యుద్ధానికి దారితీసే అవకాశం లేకపోలేదు అని గతంలో హెచ్చరించింది.