ఆత్మకూరు: రెండేండ్లుగా జరుగుతున్న మరమ్మతులను పూర్తి చేసుకున్న ఎగువ జూరాల జలవిద్యుత్ కేంద్రం 5వ యూ నిట్ ఎట్టకేలకు పునఃప్రారంభమైంది. యూనిట్లో స్టేటర్ కాలిపోయి రెండేండ్లవగా కొద్ది రోజుల క్రితం మరమ్మతు పనులు ప్రారంభించి సన్నాహక పరీక్షలను విజయవంతం చేశారు. జెన్ హైడెల్ ప్రాజక్ట్స్ డైరెక్టర్ వెంకటరాజం, శ్రీశైలం సీఈ రామ సుబ్బారెడ్డి ప్రాజక్టును సందర్శించి సన్నాహక పరీక్షలను పర్యవేక్షించారు. గురువారం పూజా కార్యక్రమాలు నిర్వహించి 5వ యూనిట్ను సింకరైజేషన్ చేశారు.
సన్నాహక పరీక్షలు విజయవంతం కావడంతో గ్రిడ్కు అనుసంధానం చేసి విద్యుతుత్పత్తిని కొనసాగించారు. చైనాకు చెంది న ప్రముఖ కంపెనీ విద్యుత్ ప్రాజెక్టు యూ నిట్లను బిగించిన నేపథ్యంలో వారి ద్వారానే మరమ్మతులు నిర్వహించుకునే క్రమంలో రెండేండ్ల జాప్యం పట్టిందని డైరెక్టర్ వెంకటరాజం తెలిపారు. కరోనా ప్రభావం, రాకపోకల ఆంక్షలు వివిధ కారణాల తో ఇప్పటికి చైనా కంపెనీ ప్రతినిధులు వచ్చి మరమ్మతులు పూర్తి చేశారన్నారు. కాలిపోయిన స్టేటర్ వైండింగ్ మొత్తంగా మార్చేసి కొత్త వైడింగ్తో యూనిట్ను సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు.
సింకరైజేషన్ సక్సెస్ కావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తంచేశారు. ప్రాజక్టు అధికారులకు శుభాభినందనలు తెలిపారు. ఇప్పటికే ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాలలో 450 మి.యూ ఉత్పత్తి జరిగిందని, ఈ ఏడాది నీటి లభ్యతను బట్టి గత రికార్డులను తిరగరాస్తామన్నారు. రెండు విద్యుత్ కేంద్రాలలో 800 మి.యూ లక్ష్యం ఉందన్నారు. ఇక నుంచి ఎగువ జూరాలలో ఆరు యూనిట్లు అందుబాటులో ఉంటాయని ఎస్ఈ జయరాం తెలిపారు. కార్యక్రమంలో హైదరాబాద్ సీఈ బిట్చన్న, ఎస్ఈలు జయరాం, వర్మ, శ్రీధర్, డీఈలు పవన్కుమార్, విన్నూత్, ఈఈలు కృష్ణకిషోర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.