కోరుట్ల : పట్టణంలోని గడి బురుజులు (గ్రామకంఠ ,అబాది) స్థలాలపై ( Gadi Buruju Lands ) వేసిన వీఎల్టీలను రద్దు ( VLTs Cancell ) చేయాలని అఖిలపక్ష ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. మంగళవారం పాత మున్సిపల్ కార్యాలయం వద్ధ చేపట్టనున్న నిరసన దీక్షలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ మేరకు సోమవారం అఖిలపక్ష, ప్రజాసంఘాల ఐక్యవేదిక పక్షాన నిర్వహించిన సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, మేధావులు పాల్గొని గడి బురుజుల భవిష్యత్తుపై చర్చించారు. గడి బురుజుల పరిధిలోని ఖాళీ భూములకు ఇచ్చిన వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ (VLT)ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
గడి బురుజుల ఖాళీ స్థలాలను భూ అక్రమార్కుల నుంచి కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ భూములను ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలని కోరారు. కూరగాయల మార్కెట్, పార్కు వంటి ప్రజా అవసరాల కోసం వినియోగించడంతో పాటు, ఇప్పటికే ఉన్న మైసమ్మ తల్లి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు.
కోనేరును పునరుద్ధరించి, ఈ ప్రాంతంలోని పురాతన చారిత్రక కట్టడాలను సంరక్షించాలని తీర్మానించారు. ఈసమావేశంలో నాయకులు చెన్న విశ్వనాథం, డాక్టర్ పేట భాస్కర్, ఎం డి ముజాహిద్, చింతా భూమేశ్వర్, ఎం డి ముజీబుర్ రెహమాన్, సుతారి రాములు, తుమ్మనపల్లి శ్రీనివాస్ బాబు, కుంచెం శంకర్, శనిగారపు రాజేష్, పోతని సత్యం, న్యాయవాది బర్ల సంతోష్, గణేష్, వికాస్, రమేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.