చేర్యాల, నవంబర్ 26 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని ఎగ్జిట్గేట్ నుంచి వచ్చి దర్శించుకోవడాన్ని ఆలయ ధర్మకర్తల మండలి నిషేధించింది. ఆలయ చైర్మన్ గీస భిక్షపతి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ధర్మకర్తలు పలు నిర్ణయాలు తీసుకుని తీర్మానాలు చేశారు. అనంతరం ఆలయ చైర్మన్ విలేకరులతో మాట్లాడారు. వెనుక మెట్ల నుంచి స్వామివారి దర్శనానికి రావడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఇకపై వీవీఐపీ, వీఐపీలు దర్శనానికి వస్తే వారిని వీవీఐపీ దారిగుండా దర్శనం చేయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గంగిరెగు చెట్టు వద్ద కొబ్బరి ముక్కల టెండరుదారుడు కొబ్బరికాయలు కొట్టడాన్ని నిషేధించామన్నారు. ఎల్లమ్మ దేవాలయం ఇక నుంచి ఉదయం 6 నుంచి ఒంటిగంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7గంటల వరకు తెరిచి ఉంచాలని తీర్మానం చేశామన్నారు. ఎల్లమ్మ ఆలయంలో ఉన్న పోచమ్మ దేవాలయం వద్ద కుమ్మరి సామాజిక వర్గం వారు ఏర్పాటు చేసిన బెల్లం శాకను నిలుపుదల చేశామని, ఎల్లమ్మ ఆలయంలో గౌడ సంఘం వారు పాత పద్ధ్దతిన కల్లు శాకను పెట్టుకునేందుకు ప్రత్యేక స్థలం కేటాయించాలని తీర్మానించినట్లు తెలిపారు. ఎల్లమ్మ ఆలయం వద్ద భక్తులు సమర్పించుకునే ఒడిబియ్యంలో ఒగ్గు పూజారులకు 50శాతం బదులు, పరిమితి మేర బియ్యం చెల్లించి మిగిలిన బియ్యం టెండర్ నిర్వహించాలని తీర్మానం చేశామని, ఎల్లమ్మ ఆలయం వద్ద అసంపూర్తి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. సెంట్రల్ స్టోర్స్ తదితర ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, డిఫ్యుటేషన్ సిబ్బందికి ఇస్తున్న 2020 పీఆర్సీని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. జూనియర్ అసిస్టెంట్ జగదీశ్వర్ను స్వామి కల్యాణం అనంతరం కమిషనర్ ఆదేశాల మేరకు రిలీవ్ చేయాలని తీర్మానం చేసినట్లు ఆలయ చైర్మన్ వెల్లడించారు. సమావేశంలో ఆలయ ధర్మకర్తలు తూముల రమేశ్యాదవ్, ఉట్కూరి అమర్, ధరావత్ అనిత, కొంగరి గిరిధర్, తివారీ దినేశ్, చింతల పరశురాములు, తాళ్లపల్లి శ్రీనివాస్, ముత్యం నర్సింహులు, బొంగు నాగిరెడ్డి, పొతుగంటి కొమురవెల్లి, చిట్టె ఐలయ్య, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.