ఏ కాలంలోనైనా ప్రజల జీవనాన్ని తెలిపే ముఖ్యమైన అంశాలు రెండు ఉంటాయి. మొదటిది ఆర్థికం- అంటే ఆ కాలంలో ఉన్న వ్యవసాయం, వాణిజ్యం, ఉత్పత్తి చేస్తున్న భౌతిక సంపద. రెండోది సాంస్కృతిక అంశాలైన మత విశ్వాసాలు, ఆచార వ్యవహారాలు, భాష, సాహిత్యం. శాతవాహనుల తర్వాత అతి పెద్ద భూ భాగాన్ని ఎక్కువ కాలం ఏలిన వంశం విష్ణుకుండి. కృష్ణా-మూసీ, మంజీరా-గోదావరుల మధ్య భూభాగం క్రీస్తు శకం 5-7 శతాబ్దాల మధ్య సుమారు రెండు శతాబ్దాలు వీరి ఏలుబడిలో ఉంది. నేడు మనం చూస్తున్న తెలుగు భాష, శైవ, వైష్ణవ మతాలు ఈ కాలంలోనే పూర్తి రూపును సంతరించుకున్నాయి.
వ్యవసాయ విస్తరణ లేనిదే రాజ్య విస్తరణ జరగదనేది ఒక మౌలిక విషయం. విష్ణుకుండి రాజ్య ఉద్భవం, విస్తరణ కృష్ణా-మూసీ-గోదావరి నదుల మధ్య వ్యవసాయ విస్తరణ, గ్రామీణ ఆర్థికవ్యవస్థ ఎదుగుదలతో పాటే సాగింది. అందుకే రాజులు బౌద్ధ విహారాలకు, ఆలయాలకు, బ్రాహ్మణులకు గ్రామాలను దానం చేశారు.
గ్రామీణ ఉత్పత్తిలో భాగమైన చేతివృత్తుల అభివృద్ధి కూడా వస్తువుల ఉత్పత్తికి దోహదం చేసింది. ఫలితంగా వ్యవసాయ, వస్తు ఉత్పత్తులు దేశీయ, విదేశీ వాణిజ్యానికి మార్గం వేశాయి. మూసీ నది కృష్ణాలో కలిసే నల్గొండ జిల్లా వాడపల్లితో పాటు, నల్గొండ జిల్లాలో ప్రవహిస్తున్న కృష్ణా తీరంలోని ఇంకా వెలుగులోకి రాని నదీరేవులు వాణిజ్య కేంద్రాలు, వర్తక మార్గాలైనాయి. శాతవాహన కాలం నుంచే కోస్తాంధ్రలో మొదలైన ధాన్యకటకం, కోడూరు, ఘంటసాల, రామతీర్థం వంటి నదీరేవులు వాణిజ్యానికి తోడ్పడ్డాయి.
నాణేలు: విష్ణుకుండి నాణేలు ఏలేశ్వరం, కీసరగుట్ట తవ్వకాల్లో దొరికాయి. పెద్దపల్లి జిల్లా తేలుకుంట, వరంగల్ జిల్లా గీసుకొండ వంటి ఊళ్లలో కూడా విష్ణుకుండి నాణేలు దొరికినయి. ఏలేశ్వరంలో మూత ఉన్న చిన్న ముంతలో దొరికిన 49 విష్ణుకుండి నాణేలు, ఏలేశ్వరం ప్రాంతంలో వీరి పాలనను నిర్ధారిస్తుంది. ఈ నాణేలు బాగా క్షీణ దశలో ఉన్నందున స్పష్టంగా అధ్యయనం జరగలేదు. కేవలం ఒక నాణెంపై ‘విక్రమ’ అనే అక్షరాలు కనిపిస్తున్నందున ఇది విష్ణుకుండి రాజైన రెండవ విక్రమేంద్ర వర్మ నాణెం అయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇక కీసర గుట్టలో జరిపిన తవ్వకాల్లో పెద్ద సంఖ్యలో నాణేలు దొరికాయి. ఇప్పుడున్న రామలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో 270 రాగి నాణేలున్న నిధి బయటపడింది.
దొరికిన నాణేల్లో చాలా వాటిపై రాజుల పేర్లు ముద్రించకపోవటం వల్ల ఇవి పల్లవుల నాణేలని కొందరు భావించారు. ఆ తర్వాత ఇవి దొరికిన ప్రాంతాలు, దొరికిన చారిత్రక సందర్భం వల్ల విష్ణుకుండి రాజులు జారీ చేశారని స్పష్టమైంది. కానీ ఏ రాజు జారీ చేశాడన్నది తెలియడం లేదు. విష్ణుకుండి నాణేలపై సింహం, వృషభం (ఎద్దు) గుర్తులున్నాయి. సింహం బొమ్మ ఉన్నవి విష్ణుకుండి రాజ్య తొలినాళ్లలో జారీ అయిన నాణేలని న్యూమిస్మాటిస్ట్స్ (పణ శాస్త్రవేత్తలు) భావిస్తున్నారు. ఈ నాణేల బొమ్మ వైపు ఒక వృత్తంలో కుడివైపునకు తిరిగి నోరు తెరుచుకుని, తోక పైకెత్తిన సింహం, బొరుసు వైపు కలశం, దీపస్తంభాలు చుట్టూ చుక్కలు లేదా కిరణాల వంటి డిజైన్ ఉంటుంది. కొన్నేండ్ల కిందట సింహం, ఉజ్జయిని గుర్తున్న విష్ణుకుండి రకపు బంగారు ఫణం కూడా దొరికింది.
వీరి నాణేల్లో ఇనుముపై రాగిపూత ఉందని కొందరు రాసినప్పటికీ ఎక్స్రే డిఫ్రాక్షన్ అనే శాస్త్రీయ పరీక్షలో ఇనుము లేదని తేలిందని రాజారెడ్డి చెప్తున్నారు. విష్ణుకుండి నాణేలలో ఇంకో ముఖ్యమైన అంశం-బౌద్ధ ప్రతీకలు లేకపోవడం. శాతవాహనుల నుంచి ఇప్పటివరకు అన్ని రాజవంశాల నాణేలపై బౌద్ధ చిహ్నాలు ఉన్నాయి. ఇది వైదిక మతం విష్ణుకుండి రాజ్య అధికారిక మతంగా మారిందని భావించడానికి సూచన.
సింహం, వృషభం బొమ్మలు ఒకే నాణెం మీద ఉండి, శ్రీ సుబిరాజ అనే పేరు రాసి ఉన్న అరుదైన నాణెం కూడా మహారాష్ట్రలో దొరికింది. అయితే విష్ణుకుండి వంశ రాజులలో సుబిరాజ అనే పేరుతో ఎవరూ లేనందున ఈ సుబిరాజు మహారాష్ట్రలోని విష్ణుకుండి సామంతుడు కావచ్చని డా.రాజారెడ్డి భావిస్తున్నారు. మహారాష్ట్రలో విష్ణుకుండి ప్రతీకలైన సింహం, వృషభంతో, శ్రీహరి రాజ, శ్రీ రణమిత్ర, శ్రీరామ, శ్రీ భీమరాజ వంటి పేర్లున్న నాణేలు కూడా చాలా దొరుకుతున్నాయి. ఇది మహారాష్ట్రలో విష్ణుకుండి ప్రభావానికి నిదర్శనం. మహారాష్ట్ర ప్రాంతాన్ని ప్రత్యక్షంగా ఒక 50 లేక 60 ఏండ్లు మాత్రమే పాలించినప్పటికీ వాకాటకులలో ఒక శాఖకు, విష్ణుకుండి వంశానికి వివాహ సంబంధం, సాన్నిహిత్యం ఉండటం వల్ల విష్ణుకుండి నాణేలు మహారాష్ట్ర ప్రాంతంలో, దక్కన్లో చలామణి అయ్యాయి. వాకాటకుల నాణేలు లేకపోవడానికి ఉన్న కారణాల్లో ఇదొకటి. వాకాటకుల పాలన మొదలైన కొంతకాలం వరకు శాతవాహనుల, పశ్చిమ క్షాత్రపుల నాణేలే వాడకంలో ఉండినాయి. అయితే ఆ నాణేలు కాలక్రమేణా తరిగి, నశించి పోవడంతో విష్ణుకుండి నాణేలు చెలామణిలోకి వచ్చి ఉంటాయి.
భాష-సాహిత్యం: శాసనాల్లో ఉన్న ప్రాకృత, సంస్కృతాలతో పాటు, తెలుగు పదాలు ఉండటం విష్ణుకుండి కాలంలో భాషలో మార్పును సూచిస్తుంది. శిలా లేఖనమైన ‘తొలుచు వాండ్రు’, శాసనాల్లో కనిపిస్తున్న ‘విజయ రాజ్య సంవత్సరంబుళ్’ వంటి తెలుగు బహువచన పూర్వ రూపం ఇందుకు ఉదాహరణలు. జనాశ్రయ బిరుదు ఉన్న నాలుగో మాధవవర్మ రాసిన లేదా రాశాడని భావిస్తున్న ‘జనాశ్రయ ఛందో విచ్ఛిత్తి’ ఛందస్సు, సాహిత్య ప్రక్రియలపై గ్రంథం. ఇందులో తెలుగు కవితకు సంబంధించిన గణ, యతి, ప్రాసలను వివరించే ఒక అధ్యాయం ఉందని బి.ఎన్.శాస్త్రి రాశారు.
లాభించిన వాకాటకులతో వియ్యం: దక్కనులో విష్ణుకుండి సమకాలికులు వాకాటకులు. వీరిలో నందివర్ధన శాఖ విదర్భ కేంద్రంగా పాలించింది. వాకాటక రాజైన రెండవ పృథ్వీ సేనుడి కూతురు మహాదేవిని విష్ణుకుండి రాజు రెండవ మాధవ వర్మకు ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ మహాదేవీ మాధవవర్మల కొడుకు విక్రమేంద్ర వర్మ. పృథ్వీ సేనుడికి వారసులు లేకపోవడంతో వాకాటక రాజ్యంలోని పెద్దభాగం విక్రమేంద్రవర్మ రాజ్యంలో భాగమైంది. ఈ రకంగా తెలంగాణలోని అమ్రాబాదులో మొదలైన విష్ణుకుండి రాజ్యం దక్కన్లో ఒక సామ్రాజ్యంగా మారింది.
విష్ణుకుండి వంశ పతనం: ఏ వంశ చరిత్ర చూసినా పుట్టుక, ప్రాభవం, పతనం అనే దశలను ఎదుర్కోవాల్సిందే. కృష్ణ-గోదావరుల మధ్య దక్కన్లో విస్తరించిన ఈ విష్ణుకుండి రాజ్యం కృష్ణా-తుంగభద్రలలో పుట్టిన ఇంకో వంశం బాదామి చాళుక్యుల చేతిలో పతనమైంది. బాదామి చాళుక్య చక్రవర్తి రెండవ పులకేశి, అతని తమ్ముడు కుబ్జ విష్ణువర్ధనుడు ఆంధ్ర ప్రాంతంలో విస్తరించే క్రమంలో విష్ణుకుండి నాలుగో మాధవ వర్మ, ఆ తర్వాత కొంతకాలమే ఏలిన మంచన భట్టారకుడు ఓటమి పొందడంతో విష్ణుకుండి రాజ్యం అంతమైంది.
విష్ణుకుండి కాలంలో మతం
మొదటి ముగ్గురు రాజుల కాలంలో బౌద్ధానికి రాజాదరణ బాగా కనిపించినప్పటికీ ఆ తర్వాత వైదిక మతం ప్రాభవం పెరగడం మొదలైంది. గోత్రంలో విష్ణు పదం, నెలకొల్పుతున్న రామలింగేశ్వర ఆలయాల్లో ‘రామ’ పదం వైష్ణవ ఆచరణకు ఆధారం. అయితే గుంటూరు దగ్గర విష్ణుకుండి నిర్మాణమైన ఉండవల్లి గుహలోని అనంతశయన శిల్పం తప్ప ప్రత్యేకంగా వైష్ణవ ఆలయం కట్టించిన ఆధారం ఇప్పటివరకు లేదు. కీసరగుట్ట, ఇంద్రపురి(తుమ్మలగూడెం)లలో రామలింగేశ్వర ఆలయాలు కట్టించినట్టు ఆధారాలున్నాయి. రాజుల బిరుదులలో ‘పరమ మహేశ్వర’ అనే పదం శైవాన్ని ఆచరించారనడానికి సూచన. విష్ణుకుండి రాజుల వైదిక మత ఆచరణకు ఇంకో ముఖ్య ఆధారం వారు చేసిన వైదిక యాగాలు. రెండవ మాధవ వర్మ ఏకాదశ అశ్వమేధ యాగాలు, పురుషమేధం, వాజపేయం, రాజసూయం, ప్రాజాపత్యం చేసిండని శాసనవర్ణన ఉంది. ఇంకా అగ్నిస్తోమం, పుండరీకం, సర్వమేధం, నరమేధం వంటి వైదిక క్రతువులను విష్ణుకుండి రాజులు చేశారని శాసనాలు చెప్తున్నాయి.
కీసరగుట్టలో పురాతత్వ శాఖ పరిరక్షించిన విష్ణుకుండి రాజప్రాసాదం, నిర్మాణాలు సందర్శకుల కోసం సిద్ధంగా ఉన్నాయనేదే చాలామందికి తెలువదు. తెలంగాణలో పుట్టి, విస్తరించిన రెండు శతాబ్దాల విష్ణుకుండి చరిత్ర కృష్ణా, మూసీ, మంజీర, గోదావరుల తీరాల్లో ఇంకా వెలుగులోకి రానేలేదు. ఆధారాలు దొరికిన కీసరగుట్టలో అసంపూర్తి తవ్వకాలు, అసలే తవ్వకాలు జరగని ఇంద్రపాల నగరం (తుమ్మలగూడెం) మనల్ని ఇంకా ప్రశ్నిస్తూనే ఉన్నాయి.
–డా. ఎం.ఏ. శ్రీనివాసన్
81069 35000