కవిత్వం ఒక బ్రహ్మపదార్థం. దాన్ని ఉపాసించేవాడు బ్రహ్మ కావాలి. బ్రహ్మత్వాన్ని తెలుసుకొన్న వాడే బ్రహ్మ అవుతాడు. ‘బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి’ (బ్రహ్మను తెలుసుకొన్నవాడు బ్రహ్మగా మారిపోతాడు) అని వేదసూక్తి. బ్రహ్మత్వం గుణంలో ఉంటుందా ?
ఆకర్షణలో ఉంటుందా? అంటే గుణంలోనే ఉంటుందని ఎవరైనా సమాధానం చెబుతారు. గుణం లేని వస్తువుకు లోకంలో విలువలేదు. గుణం లేనిదంతా వ్యర్థమే. పూలకు ఉన్న సువాసనల కారణంగానే ఎవరైనా వాటిని మెడలో, తలలో ధరించాలనుకొంటారు.
ఆ పూలతో అనుసంధానమైన దారానికి సురభిళత్వం లేకున్నా పూలతో అది స్నేహం చేస్తున్నది కనుక పూలతో బాటు దారానికి కూడా ధారణ యోగ్యత లభించింది.
అంటే గుణంకానీ, గుణంతో తాదాత్మ్యం చెందినది ఏదైనా కానీ ధారణయోగ్యమౌతుందికానీ మరొకటి కాదని స్పష్టమౌతుంది. సుభాషితకర్తలు కూడా ఇదే విషయాన్ని సురుచిరంగా చెప్పారు. వాళ్లు ఏమంటున్నారంటే ఓ మనుష్యులారా! గుణం కోసమే మీరు సర్వదా ప్రయత్నించండి. ఈ భయంకర పటాటోపాలెందుకు ? అందమైన గంటలు కట్టినంత మా త్రాన పాలు ఇవ్వని ఆవులను ఎవరైనా కొంటారా? కొననే కొనరు. అలాగే గుణానికే మూల్యం కానీ ఆకర్షణకు కాదు. ఎవరైనా ఆకర్షణలకు మూల్యాన్ని చెల్లిస్తే నష్టపోతారు.
ఏ రంగంలోనైనా శ్రేష్ఠులు కావాలంటే వారివారి జ్యేష్ఠత్వాలు (వయస్సులో పెద్దతనాలు) ముఖ్యం కావు. గుణం కారణంగానే శ్రేష్ఠులుగా పరిగణింపబడతారనేది సత్యం. ఒక్కొక్క గుణం చేరుతున్న కొద్దీ మనిషిలో విలువ పెరుగుతుంది. మొదట పెరుగురూపంలో ఉండే పదార్ధం, చిలికినకొద్దీ, వెన్నగా మారి, చివరికి ఆయుష్యాన్ని పెంచే గు ణం కలిగిన నెయ్యిగా పరిణమిస్తుంది. ఇదే సూత్రం కవిత్వానికీ వర్తిస్తుంది.
కవిత్వాన్ని రాసే వాడికీ, కవిత్వాన్ని ఆస్వాదించేవాడికీ మొదట కావలసింది గుణం. గుణా న్ని ఆశ్రయించుకొని కవితా పరమార్థమైన ఆనందం ఉంటుందే కాని, ఆకర్షణకు శాశ్వతానందం ఉండదు. కానీ దురదృష్టవశాత్తు నేటి కాలంలో ఎక్కువమంది ఆకర్షణలకు మాత్రమే లొంగుతూ, వాటిపట్ల ఆకర్షితులవుతూ ఆలోచనామృతమైన కవిత్వాన్ని అధోగతుల పాలు చేస్తున్నారు.
కవిత్వం శబ్దరూపంలో ప్రభవిస్తుంది. అర్థరూపంలో పరిణమిస్తుంది. ఆనంద రూపంలో ఫలిస్తుంది. అందుకే శబ్దం అనే జ్యోతి వెలుగులీనకపోతే ముల్లోకాలూ గాఢాంధకారంలో మునిగి పోతాయని దండి వంటి ఆలంకారికులు పేర్కొన్నారు. అయితే శబ్దరూపంలో ఉండే కవిత్వా న్ని దుర్వినియోగం చేస్తే, సాహిత్యలోక భవితవ్యం అంధకారమయమవుతుంది. కవిత్వం రాయకపోతే ఎవరూ దండించరు. కానీ చెడు కవిత్వాన్ని రాయడం మాత్రం మ రణంతో సమానమని భామహుడు అంటాడు. దృశ్యశ్రవ్యకావ్యాల రూపంలో ఉండే కవిత్వం లోకంలో ధర్మాన్ని స్థాపించడానికీ, కోరికలు నెరవేర్చుకోవడానికీ, దుష్టులను నిగ్రహించడానికీ, సుజనులను రక్షించడానికి ఉపయోగపడాలని కవిత్వతత్త్వ పితామహుడు భరతముని పేర్కొన్నాడంటే కవిత్వానికి ఎంత విశిష్టత ఉందో అర్థ్ధమౌతుంది. అందుకే ఆయన కవిత్వాన్ని దృశ్యశ్రవ్యకావ్య క్రీడగా అభివర్ణించాడు. ఈ లోకమంతా జగన్నాటక సూత్రధారి అయిన సృష్టికర్తకు క్రీడారంగం. పరోక్ష రూపంలో ఈ జగత్తు అనే క్రీడారంగంలో జరిగే క్రీడలను భగవంతుడు చూస్తూ ఆనందిస్తే, లోకులందరూ ప్రత్యక్షరూపంలో తామే పాత్రధారులై జగన్నాటకాన్ని రక్తికట్టిస్తూ, భగవంతుని అనుగ్రహాన్ని పొం దుతున్నారు. ఇంతటి పరమార్థం కవిత్వానికి ఉంది. దీనిని మరచిపోయి నీచ భావాలతో నీచ ప్రయోజనాల కోసం నీచ పదాలతో రాసేది కవిత్వమో, లేక కపిత్వమో తేల్చుకోవలసింది రాసేవాడే. రాసేవాడు ఎప్పుడూ మనస్సుతో చూసేవాడై ఉండాలి. చూస్తూనే లక్ష్యాన్ని అంచనా వేసే వాడై ఉండాలి. అలాంటి సమయంలోనే మంచి కవిత్వం వస్తుంది.
ఒకరిని ఇంకొకరు ద్వేషించే విధంగా రాసేది కవిత్వమా? అని సందేహం కలుగుతుంది. పగలనూ, సెగలనూ రగిలిం చి, జగత్తును కలుషితం చేసే రాతలు కవితలు ఎప్పటికీ కాలేవు. అలాంటి వాటిని కవితల పేరుతో ప్రకటించినా, అవి నేతిబీరకాయల వంటివే కాని మధుర ద్రాక్షాఫలాలు కాలేవు.
ముఖ్యంగా కవిత్వానికి ఉండవలసింది ఔచిత్యం. సమాజానికి ఏది ఉచితమో అదే చెప్పాలి. అనుచితకవిత్వం పదే పదే రచించడం వల్ల మసిపూసి మారేడుకాయగా రూపొందించవచ్చునేమో కాని, మసిపూసినంత మాత్రాన అది మారేడుకాయ ఎలా అవుతుం ది? కానే కాదు. కవిత్వం గుణాత్మకం కావడం ఎంత ప్రధానమో, దోషరహితం కావడం కూడా అంతే ప్రధా నం. చెప్పే మాట రుచికరంగా ఉండాలి. అరోచకంగా ఉం డరాదన్నదే కవిత్వానికి ప్రధానార్హత.
కవిత్వం రాసినా, చదివినా ఏం వస్తుంది? మొదట ప్రీతి కలుగుతుంది. తినకున్నా కడుపు నిండినట్లుంటుంది. విందుభోజనాన్ని ఆరగించినట్లుంటుంది. చదివినందువల్ల కొత్తగా విషయజ్ఞానం కలుగుతుంది.
చదివినవాడనే కీర్తి లభిస్తుంది. రాసే వాడికి కూడా ఇవే ఫలితాలు లభిస్తాయి. ఇంకా అనేకానేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ ప్రయోజనాలన్నీ మనిషి జీవితాన్ని సుఖమయం, కీర్తివంతం చేస్తాయి.
కవిత్వం లోకుల బాధలకూ, సందేహాలకూ పరిష్కారం చూపాలని మంఖకుడు అనే ఆలంకారికుడు అంటాడు. మనిషికి శబ్దార్థాలు అందమైన రూపాలవంటివి. వ్యంగ్యం ప్రాణం లాంటిది. అలంకారాలు రత్నహారాల వంటివని పలికిన విద్యానాథుని మాట యథా ర్ధం. లోకంలో మనిషికి ధనసంపాదనం ఒక్కటే సుఖాన్ని ఇవ్వదు. మానసికానందం కావాలి. అది డబ్బుతో కొనేది కాదు. మనిషి మానసికానందానికి మూలకారణాలైన విషయాలలో కవిత్వం మొదటిది. కనుక మానసికానందానికి మూలమైన కవిత్వం గుణాత్మకం కావాలే కానీ, ఆకర్షణాత్మకం కారాదు.
ఆకర్షణలు ఎప్పుడూ గాజు పెంకులే. అవి మెరుస్తాయేగాని, గుణాన్ని ప్రసాదించలేవు. అసలైన మణులు ఆకర్షణలు ఇవ్వలేవు కానీ, ధరించినప్పుడు ఉత్తమ గుణాలను వారికి కలుగజేస్తాయి. కనుక ఏ కవితాసాధకుడైనా తెలుసుకోవలసింది కవిత్వానికి ప్రధానం గుణమే కాని, ఆకర్షణ కాదనే సత్యాన్ని. దాన్ని మనస్సులో ఉంచుకొని రచనలు చేసినంత కాలం కవి సూర్యునిలా, చంద్రునిలా వెలిగిపోతూ, లోకానికి ప్రయోజనకారి అవుతాడు. లేకుంటే కనుమరుగైపోతాడు.
– డా. అయాచితం నటేశ్వరశర్మ
9440468557