టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ వైదొలగడంతో పూరించలేని శూన్యం ఏర్పడింది. భారత క్రికెట్ను ఉన్నతస్థానంలో నిలబెట్టిన నాయకుడిగా కోహ్లీ నిలిచిపోతాడు. ముఖ్యంగా విదేశీ పర్యటనల్లో జట్టులో ఉత్సాహం నింపి విజయపథాన నడపడంలో సమర్థుడతడు. కోహ్లీ ఆగమనానికి ముందు రక్షణ స్థితిలో ఆడే జట్టులో విజేతలు కావాలనే పట్టుదలను ఆవహింపజేసిన ఘనత కోహ్లీది. ఆయన నాయకత్వంలో 68 మ్యాచ్లు ఆడితే, అందులో నలభై గెలుచుకోగలగడం విశేషం. పదిహేడు మ్యాచ్లలో మాత్రమే పరాజయం చవిచూశారు. స్వభావరీత్యా మొండితనం ఉన్నా అది ఆయనకు రాణించింది. కోహ్లీ ఆడింది మొత్తం ఆటేనా అంటే రాజకీయాలు కూడా ఉన్నాయి. ఆయనే చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లేకు పొగబెట్టింది అని తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా గంగూలీ స్పందించాడు. ఇప్పుడు కుంబ్లే మిత్రుడు రాహుల్ ద్రావిడ్ చీఫ్ కోచ్ అవుతాడంటే కోహ్లీకి గిట్టదు. కోహ్లీకి గంగూలీ ఊపిరి ఆడకుండా చేయడం వల్లనే ఆయన కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నారనేది బహిరంగ రహస్యం.
క్రికెట్ క్రీడాకారులలో భిన్నాభిప్రాయాలు, గ్రూపులు ఉండటం సహజం. వీటిని వీలైనంతగా అరికట్టవచ్చు. కానీ రాజకీయవాదులు క్రికెట్రంగంలో చొరబడి రాజకీయాలు నడపడం మాత్రం సమర్థనీయం కాదు. హోం మంత్రి అమిత్ షా తనయుడు జయ్ షా బీసీసీఐ కార్యదర్శి కావడం ఇందుకు ఉదాహరణ. సాధారణంగా బీసీసీఐ అధ్యక్షులు ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్ష స్థానాన్ని పొందుతారు. కానీ ఈసారి కార్యదర్శిగా ఉన్న జయ్ షా ఈ అవకాశం పొందడం విచిత్రం. క్రికెట్ రంగంలో తలెత్తిన పలు వివాదాల వెనుక బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో పాటు జయ్ షా పాత్ర ఉందనే ఆరోపణలున్నాయి. వీరి మూలంగా ఇప్పుడిప్పుడే నిలదొక్కుకున్న క్రికెట్ రంగం మళ్లీ దిగజారిందనే అభిప్రాయం కూడా ఉన్నది. కోహ్లీ నిష్క్రమణ ఈ చర్చకు మరోసారి తావిచ్చింది.
దేశంలో రాజకీయాలే నీతిబాహ్యంగా మారిన వేళ, క్రీడారంగంలోనూ రాజకీయ నాయకులు ప్రవేశించడం అవాంఛనీయం. క్రికెట్కు ఉన్న ప్రజాదరణ, ఆదాయం మూలంగా రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఎక్కువైంది. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, హిమాచల్ప్రదేశ్, హర్యానా, ఒడిశాతో సహా దేశంలోని పలు క్రికెట్ సంఘాలు రాజకీయ నాయకుల గుప్పిట ఉన్నాయనేది తెలిసిందే. ఐపీఎల్లో అవినీతి, స్పాట్ ఫిక్సింగ్ వివాదం మూలంగా చైర్మన్ పదవికి రాజీనామా చేసిన రాజీవ్ శుక్లా మళ్లా అనతికాలంలోనే ఐపీఎల్లో, బీసీసీఐలో చక్రం తిప్పడం క్రీడారంగ దుస్థితిని వెల్లడిస్తున్నది. రాజకీయ నాయకులు, వ్యాపారులతో క్రీడారంగం లుకలుకలాడుతున్నదనేది వాస్తవం. టెస్ట్ క్రికెట్కు కోహ్లీకి వారసుడెవరనేది కాదు ప్రధాన సమస్య. క్రీడారంగాన్ని ప్రక్షాళన చేసి క్రీడాస్ఫూర్తిని కాపాడటం ఎలా అనేది ఆలోచించాలి.