పరిగి, అక్టోబర్ 28 : వివిధ శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రతి నెలా ప్రణాళికా శాఖ వెబ్సైట్లో నమోదు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అన్ని శాఖల జిల్లాస్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ నెల, త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షిక పనితీరు నివేదికలను ఆయా శాఖల అధికారులు తప్పనిసరిగా ప్రణాళికా శాఖ వెబ్సైట్లో నమోదు చేయాలన్నారు. మండలస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు వివిధ శాఖల ద్వారా ప్రతి నెలా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పనితీరు వివరాలను, ప్రతి నెలా 5 వరకు ప్రణాళిక శాఖ వెబ్సైట్లో పొందుపరచాల్సిందిగా పేర్కొన్నారు.
ఈ సమాచారాన్ని రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు పరిశీలించినట్లు ఆయన తెలిపారు. ప్రతి కార్యాలయం నుంచి ఒక ఉద్యోగిని ప్రత్యేకంగా ఏర్పాటుచేసి క్రమం తప్పకుండా ప్రతి నెలా 5 వరకు నివేదికలు పంపించాల్సిందిగా పేర్కొన్నారు. ముఖ్య ప్రణాళికా అధికారి కార్యాలయం నుంచి పనులను పర్యవేక్షిస్తారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సీపీవో నిరంజన్రావు, డీఆర్డీవో కృష్ణన్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.