కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టి, అన్నదాతకు అండగా నిలిచేందుకు టీఆర్ఎస్ సమర శంఖం పూరించింది. యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గులాబీ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, నేతలు, రైతులు ఇటీవల నియోజకవర్గాల్లో ధర్నాలు, నిరసన ర్యాలీలు నిర్వహించారు. కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచేందుకు రైతుల పక్షాన గురువారం నగరంలోని ఇందిరాపార్కు వద్ద ‘మహాధర్నా’కు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్, కార్పొరేషన్, రైతుబంధు సమితి చైర్మన్లు హాజరుకానున్నారు.
“ధాన్యం కొనుగోలులో పంజాబ్కు ఒక న్యాయం.. తెలంగాణకు మరో న్యాయమా.. కేంద్రం ఆ రాష్ట్ర వడ్లు కొన్నప్పుడు మనవి ఎందుకు కొనదు.. రాష్ట్ర బీజేపీ నేతలేమో వరి సాగు చేయాలని పిలుపునిస్తరు.. కేంద్రంలో కొలువుదీరిన ఆ పార్టీ పెద్దలేమో ధాన్యం కొనేది లేదంటరు.. ఇలాంటి మోసపూరిత మాటలతో వడ్లు పండించే అన్నదాత నష్టపోడా? కేంద్ర ప్రభుత్వం వెంటనే ద్వంద్వ వైఖరిని వీడి యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలి.. అలాగే ఏడాదికి ఎంత ధాన్యం కొంటారో స్పష్టం చేయాలి”
-సుబ్బారెడ్డి, రైతు, ఖుదావంద్పూర్, పరిగి మండలం
పరిగి/ఇబ్రహీంపట్నం, నవంబర్ 17 : యాసంగిలో పండించే వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతుల పక్షాన టీఆర్ఎస్ ప్రభుత్వం పోరాటం చేస్తున్నది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద గురువారం మహాధర్నాను చేపట్టనున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, రైతుబంధు సమితి చైర్మన్లు ఒకే వేదికపై కూర్చొని రైతుల కోసం పోరాటం చేయడం భారతదేశ చరిత్రలోనే తొలిసారని చెప్పవచ్చు. గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ మహాధర్నా కొనసాగనున్నది. వికారాబాద్ జిల్లా తరఫున జిల్లా పరిషత్ చైర్పర్సన్ పి.సునీతారెడ్డి, ఎమ్మెల్సీ పి.మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్రెడ్డి, పైలట్ రోహిత్రెడ్డి, పి.నరేందర్రెడ్డి, టీఎస్ఈడబ్ల్యుఐడీసీ చైర్మన్ నాగేందర్గౌడ్, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి మహాధర్నాలో పాల్గొననున్నారు. ఇప్పటికే నియోజకవర్గ కేంద్రాల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు నిర్వహించినా స్పందించకపోవడంతో ఏకంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రజాప్రతినిధులు ధర్నా చేయనున్నారు. పంజాబ్లోని వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ తెలంగాణలోని ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రం ఒక్కో రాష్ర్టానికి ఒకలా వ్యవహరించడం సరికాదని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వడ్లను కొననంటది.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరి వేయాలని పేర్కొనడం వంటి ద్వంద్వ వైఖరి వల్ల నష్టపోతామని రైతాంగం పేర్కొంటున్నది. అసలు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి సంవత్సరానికి ఎంత ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్న ఏకైక డిమాండ్తో రైతుల పక్షాన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ధర్నా చేస్తున్నారు. శాంతియుత ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం సాధించిన ఉద్యమ నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఉద్యమ పంథాలో పోరాటం కొనసాగించి తెలంగాణ రైతుల హక్కులను సాధించుకోవడానికి నడుం బిగించడం వల్ల రైతాంగంలో ఒక రకమైన మనోధైర్యం నింపుతుందని చెప్పవచ్చు. కేంద్రం ఎంత ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందో తెలియజేస్తే సాగుకు సంబంధించి రైతుల్లో అవగాహన కల్పించే అవకాశం ఉంటుంది. రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ప్రాజెక్టుల నిర్మాణం, 24 గంటల ఉచిత కరెంట్ను వ్యవసాయానికి అందిస్తుండడం వల్ల పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. ఇందులో ప్రధానంగా వరి పంట సాగు పెరిగి, దిగుబడులు గతంలో కంటే అధికంగా వస్తున్నాయి. గతంలో ఆరుతడి పంటలు వేసే భూముల్లో సైతం వరి సాగు చేస్తున్నారు. వరి ధాన్యం ఉత్పత్తి పెరిగినందున అందుకు అనుగుణంగా కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నది రాష్ట్ర సర్కారు డిమాండ్ చేస్తున్నది. కేంద్రం దిగివచ్చే వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచి పోరాటం కొనసాగించనున్నది. గురువారం రోజు జరిగే మహాధర్నాకు జిల్లా నుంచి టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు హాజరవుతారు.
రంగారెడ్డి జిల్లానుంచి..
సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగే మహాధర్నాకు రంగారెడ్డి జిల్లా నుంచి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివెళ్లనున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సహకార సంఘం చైర్మన్లు, రైతుబంధు సమితి సభ్యులు, జడ్పీటీసీలు, ఎంపీపీలతో పాటు వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులంతా ధర్నాకు పెద్ద ఎత్తున తరలివెళ్లడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ధాన్యం కొంటరా, కొనరా..
పరిగి, నవంబర్ 17 : యాసంగిలో పండించే వరి ధాన్యాన్ని కొంటరా.., కొనరా అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పాలని చేవెళ్ల పార్లమెంటు సభ్యులు డాక్టర్ జి.రంజిత్రెడ్డి డిమాండ్ చేశారు. పంజాబ్లో పండించిన వరి ధాన్యాన్ని వంద శాతం కేంద్రం కొనుగోలు చేస్తుందని, తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయరని ప్రశ్నించారు. ఓవైపు కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయము అని అంటుండగా మరోవైపు బీజేపీ నేతలు వరి సాగు చేయండి అంటూ రైతులతో ఆడుకోవడం సరికాదన్నారు. వరి సాగుపై రైతులను అయోమయానికి గురిచేసి రాజకీయాలు చేయడం బీజేపీ మానుకోవాలని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఉచిత కరెంటు సరఫరాతో పాటు సరిపడా సాగునీరు అందుతుందన్నారు. పెట్టుబడికి ఎకరాకు రెండు సీజన్లకు కలిపి రూ.10వేలు అందిస్తుండడంతో వ్యవసాయం పండుగగా మారిందన్నారు. తద్వారా సాగు విస్తీర్ణం పెరిగి, దిగుబడులు పెరిగాయన్నారు. యాసంగిలో పండించే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయము అని చెప్పడం కేంద్ర ప్రభుత్వానికి తగదన్నారు. ఇప్పటికైనా యాసంగి వరి ధాన్యాన్ని కొంటరా.. కొనరా స్పష్టం చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు.
కేంద్ర వైఖరి ఏమిటో స్పష్టం చేయాలి.. చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి