పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు
ఆమనగల్లు, అక్టోబర్ 28: మండలంలోని మేడిగడ్డతండా సమీపంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి నుంచి 20 గంజాయి ప్యాకెట్లను గురువారం స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఉపేందర్ తెలిపారు. వెల్దండ మం డలంలోని పల్గుతండాకు చెందిన ఇద్దరు వ్యక్తులు కొన్ని రోజులుగా గంజాయి విక్రయిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ ధర్మేశ్ ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకుని వారి వద్ద ఉన్న 250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని తహసీల్దార్ పాండునాయక్ ఆధ్వర్యం లో పంచనామా నిర్వహించినట్లు సీఐ తెలిపారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు, పట్టుబడిన ఇద్దరిపై మత్తుపదార్థాల విక్రయాల కింద కేసు నమోదు చేసి వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించామన్నారు.
షాద్నగర్ పట్టణంలో 19ప్యాకెట్లు..
షాద్నగర్ రూరల్, అక్టోబర్28: గంజాయి విక్రేతను పట్టుకుని కేసు నమోదు చేసిన ఘటన షాద్నగర్ పట్టణంలో గురువారం జరిగింది. పోలీసు ల కథనం ప్రకారం షాద్నగర్ పట్టణంలోని పటేల్రోడ్డుకు చెందిన శివ అనే యువకుడు మరో వ్య క్తితో కలిసి గంజాయి విక్రయిస్తున్నట్లు అందిన సమాచారంతో పోలీసులు అతడి ఇంటికెళ్లి తనిఖీలు చేయగా 100 గ్రాములు ఉన్న 19 ప్యాకెట్ల గంజాయి దొరికిందన్నారు. గంజాయి విక్రయిస్తున్న శివపై కేసు నమోదు చేసినట్లు, మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు సీఐ నవీన్కుమార్ తెలిపారు.