ఇటీవలే ‘మెడిసిన్ ఫ్రం స్కై’ కార్యక్రమం ప్రారంభానికి వేదికై దేశ ప్రజల చూపును తనవైపు తిప్పుకున్న వికారాబాద్ జిల్లాకు త్వరలోనే మరో వరం దక్కనున్నది. జిల్ల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు రాష్ట్ర సర్కార్ ఏర్పాట్లు చేస్తున్నది. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల సౌకర్యార్థం జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కొన్ని వైద్య కాలేజ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం వికారాబాద్లో 2023-2024 విద్యాసంవత్సరంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. వైద్య కళాశాల నిర్మాణానికి రూ.500కోట్లు పైచీలుకు ఖర్చు కానున్నట్లు వైద్యారోగ్య శాఖాధికారులు పేర్కొంటున్నారు.
పరిగి, సెప్టెంబర్ 14 : వికారాబాద్ జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటుతో గ్రామీణ విద్యార్థులకు వైద్య విద్య అందనున్నది. పెరుగుతున్న పోటీ ప్రపంచంలో ఈ ప్రాంత విద్యార్థులకు మెడికల్లో సీట్లు వచ్చినా సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సి వస్తున్నది. మెడికల్ కళాశాల ఏర్పాటుతో ఆ అవస్థలు తీరనున్నాయి. అలాగే వైద్య విద్య బోధించే ప్రొఫెసర్ పోస్టులు, సిబ్బంది నియామకాలు సైతం జరుగుతాయి. మరోవైపు వైద్య కళాశాల నిర్మాణానికి సుమారు రూ.500 కోట్ల పైచిలుకు ఖర్చు కానున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖాధికారులు పేర్కొంటున్నారు. వచ్చే సంవత్సరం ప్రారంభం నుంచే భవనాల నిర్మాణ పనులు షురూ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
అనుబంధంగా దవాఖాన…
వైద్య కళాశాల మంజూరు చేయాలంటే 330 పైచిలుకు బెడ్ల దవాఖాన అనుబంధంగా ఉండాలి. ఎన్ఎంసీ నిబంధనల మేరకు మెడికల్ కాలేజీకి అనుబంధంగా సుమారు 20 ఎకరాల్లో 330 కంటే అధికంగా పడకలు ఉండాలి. మెడికల్ కళాశాల ఏర్పాటు సందర్భంగా ప్రస్తుతం ఉన్నటువంటి అనుబంధ దవాఖానల్లో పడకల సంఖ్య పెంచి అవసరమైన మేరకు వైద్య పరికరాలు ఏర్పాటు చేసి వైద్యులు, ఇతర సిబ్బందిని నియమిస్తారు. తద్వారా జిల్లాలోని పేదలందరికీ వైద్య సేవలు ఉచితంగా అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం చిన్న చికిత్సకు సైతం హైదరాబాద్లోని ఉస్మానియాకు వెళ్తున్నారు. కొత్త మెడికల్ కళాశాల ఏర్పాటు ద్వారా అనుబంధ దవాఖానలో సుమారు 18 విభాగాలకు సంబంధించిన వైద్యులు, వైద్య సిబ్బంది నియామకం చేపడుతారు. తద్వారా ఈ ప్రాంత వాసులు చికిత్స కోసం హైదరాబాద్కు వెళ్లడం తప్పుతుంది.
నెరవేరుతున్న జిల్లావాసుల కల…
మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయనుండడంతో వికారాబాద్ జిల్లా ప్రజల కల నెరవేరనున్నది. కొన్నేండ్లుగా వికారాబాద్లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉన్నది. ఈ ప్రాంత ప్రజల మనోగతం తెలిసిన సీఎం కేసీఆర్ జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు నిర్ణయించారు. వికారాబాద్లో డయాగ్నస్టిక్ సెంటర్ ఏర్పాటు చేసి 57 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. డ్రగ్స్ సెంటర్ సైతం ఏర్పాటు చేశారు. వీటితోపాటు కొవిడ్ పరీక్షలకు సంబంధించి ఆర్టీపీసీఆర్ సెంటర్ వికారాబాద్లో నెలకొల్పారు. ఇకపోతే దేశంలోనే తొలిసారిగా డ్రోన్ల సాయంతో వ్యాక్సిన్లు, అత్యవసర మందులు తరలించే కార్యక్రమానికి వికారాబాద్ ఫైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన విషయం తెలిసిందే. ఈనెల 11వ తేదీన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్లు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాబోయే ఏడాదిన్నరలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయనుండడం ద్వారా వికారాబాద్ జిల్లా వైద్య పరంగా మరింత ప్రగతి సాధిస్తుంది. మెడికల్ కళాశాల ఏర్పాటుతో ఈ ప్రాంతం అభివృద్ధి సాధిస్తుంది. మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్లు, ఇతర సిబ్బంది, అనుబంధ దవాఖానలో పనిచేసే వైద్యులు, ఆయా విభాగాల సిబ్బంది, వైద్య విద్య అభ్యసించే వైద్య విద్యార్థులు ఇక్కడే ఉండనున్నారు. తద్వారా వ్యాపారపరంగా రోజురోజుకూ అభివృద్ధి జరుగుతుంది. ఇవన్నీ కలిసి వికారాబాద్ రూపురేఖలు మారనున్నాయి. రాష్ట్రంలో వైద్య విద్య సదుపాయాలు అన్ని ప్రాంతాల వారికి అందించేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. వికారాబాద్ జిల్ల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుకు సర్కారు నిర్ణయించింది. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వైద్యం, విద్య అందుబాటులోకి తీసుకురావడంతోపాటు ఆయా ప్రాంతాల్లో అనుబంధంగా ఏర్పాటు చేయనున్న దవాఖానల్లో పేదలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. మెడికల్ కళాశాలకు అనుబంధంగా సుమారు వెయ్యి పడకల దవాఖాన సైతం ఉంటుంది. వచ్చే ఏడాది రాష్ట్రంలో 7 వైద్య కళాశాలలు అందుబాటులోకి రానున్నాయి. 2023-24లో రాష్ట్రంలో కొత్తగా మరో నాలుగు వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించగా, అందులో వికారాబాద్ జిల్లాలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు కానున్నది.