బొంరాస్పేట, సెప్టెంబరు 14 : ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ప్రజలకు సూచించారు. ఎంపీపీ హేమీబాయి అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా తీసుకోవాలని, వైద్య సిబ్బంది గ్రామాలకు వెళ్లి టీకాలు ఇస్తే త్వరగా లక్ష్యం చేరుకుంటామన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రైతులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. మండలంలోని గిరిజన తండాలకు మంజూరైన త్రీ ఫేజ్ విద్యుత్ పనులను సత్వరమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ పనులకు ఎంత సామగ్రి అవసరమో తనకు ఇండెంట్ ఇస్తే ఉన్నతాధికారులతో మాట్లాడి ఇప్పిస్తానని చెప్పారు. మండలంలోని బాపల్లితండా, బురాన్పూర్లో నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్లను త్వరలోనే ప్రారంభించి విద్యుత్ లోవోల్టేజీ సమస్య తీరుస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన స్తంభాలను తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
కొత్తగా ఆసరా పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులకు ఎంపీడీవో కవరింగ్ లెటర్ ఇవ్వలేదని, గ్రామాల్లో పూర్తి చేసిన ఉపాధి పనులకు ఏడాది కాలంగా బిల్లులు చేయడం లేదని వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, ఎంపీటీసీలు శ్రవణ్గౌడ్, తిరుపతయ్య, సుదర్శన్రెడ్డి అధికారుల దృష్టికి తెచ్చారు. మిషన్ భగీరథ పైపులైన్లు లీకేజీ అవుతున్నాయని, ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇవ్వడం లేదని ఎంపీటీసీలు తిరుపతయ్య, శ్రవణ్గౌడ్, సుదర్శన్రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు జలీల్ ప్రస్తావించారు. లైన్మన్లు డబ్బులు తీసుకుని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నారని వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి ఆరోపించారు. విద్యుదాఘాతంతో మృతిచెందిన పశువులకు పరిహారం అందించాలని సభ్యులు కోరారు. బొంరాస్పేట పీహెచ్సీకి రెగ్యులర్ డాక్టర్ను నియమించాలని ఎంపీటీసీ, రైతులకు రాయితీపై వేరుశనగ విత్తనాలు అందించాలని సభ్యులు కోరారు. సమావేశంలో జడ్పీటీసీ చౌహాన్ అరుణాదేశు, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి, తహసీల్దార్ చాంద్పాషా, సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు.