కంది, నవంబర్ 11 : అతడో కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగి. అతడు చేసే పనికి కంపెనీ సంవత్సరానికి రూ.26 లక్షల ప్యాకేజీ ఇస్తున్నది. తండ్రి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలో ఉద్యోగి. తమ్ముడు కూడా బాగా చదువుకుంటున్నాడు. కానీ, ఆ ఇంట్లో ఒక్కడి వంకర బుద్ధి ఆ ఇంటిల్లిపాది పరువును రోడ్డున పడేసింది. ఉంటున్న ఊరి వాళ్లే కాదు.. దేశవ్యాప్తంగా ఆ ప్రబుద్ధుడు చేసిన పనికి ఛీ.. అంటూ తిట్లదండకాన్ని సోషల్ మీడయాలో వెళ్లగక్కుతున్నారు. గత నెల 24న ఇండియా-పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో భారత్ పరాజయం కావడంతో ఓ వ్యక్తి ‘క్రిక్క్రేజీగర్ల్’ పేరుతో ట్విటర్ ఫేక్ అకౌంట్తో విరాట్ కోహ్లీ కుమార్తెను లైంగికదాడి చేస్తానంటూ ఇతర బెదిరింపులతో ట్వీట్ చేశాడు. తొలుత ఈ ట్వీట్ ను పాకిస్తాన్కు చెందిన ఓ మహిళగా చేసినట్టుగా భావించి నెటిజన్లు ఆమెపై తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో ట్విట్టర్ దాన్ని వెంటనే తొలగించింది. నిందితులని పట్టుకుని ఉరి తీయాలంటూ ప్రతి ఒక్కరు ఆ ట్వీట్ను రీ ట్వీట్ చేస్తూ పోస్టులు పెట్టారు.
సంగారెడ్డి జిల్లా ఓడీఎఫ్కు చెందిన రామ్నగశ్ అరెస్టు
భారత జట్టు కెప్టెన్ విరాట్ కొహ్లీతో పాటు అతడి కూతురిపై అసభ్యంగా ట్వీట్ చేయడంతో ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఆ ట్వీట్ చేసిన సంగారెడ్డి జిల్లా కంది మండలం ఓడీఎఫ్లో నివసిస్తున్న రామ్నగేశ్ అలిబత్తిని(23)గా గుర్తించి, ఈ నెల 10న ముంబై పోలీసులు స్థానిక పోలీసుల సహకారంతో అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఈ మేరకు అతడిపై కేసు నమోదు చేసిన న్యాయస్థానం ముందు హాజరుపర్చనున్నారు.
మంచి ఉద్యోగం ఉంటే సరిపోదు..
సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఓడీఎఫ్లో ఉద్యోగిగా పని చేస్తున్న వ్యక్తికి ఇద్దరు కుమారులు. పెద్దవాడు రామ్నగేశ్ బెంగళూరుకు చెందిన ఓ స్టాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. కరోనా కావడంతో వర్క్ ఫ్రమ్ హోం కారణంగా ఓడీఎఫ్లోని తల్లిదండ్రుల వద్ద క్వార్టర్లో ఉంటూ పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే భారత్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్లో భారత్ ఓడిపోవడంతో జీర్ణిచుకోలేని రామ్నగేశ్, ఫేక్ అకౌంట్ పేరు విరాట్తో పాటు అతని కుమార్తెపై లైంగికదాడి బెదిరింపులతో ట్వీట్ చేశాడు. మళ్లీ ఏమీ తెలియనట్లు ఇంట్లోనే ఉండి పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ కేసును ఢిల్లీ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకొని, నిందితులపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ, ముంబై పోలీసులను ఆదేశించింది. దీంతో ఢిల్లీ, ముంబై పోలీసుల ముమ్మర దర్యాప్తుతో నిందితున్ని అరెస్టు చేశారు. రామ్నగేశ్ అరెస్టు కావడం పట్ల దేశవ్యాప్తంగా నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొడుకు అరెస్టు అవడంతో తీవ్ర మనోవేదనకు గురైన కుటుంబ సభ్యులు ఇంటి తాళం వేసి వెళ్లిపోయారు.